గణపురం, మే 17 : విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేదిలేదని డీఎంహెచ్వో మధుసూదన్ వైద్య సిబ్బందిని హెచ్చరించారు. శుక్రవారం ‘నమస్తే’లో ‘చెత్త కుప్పలో ఔషధాలు’ శీర్షికన కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే.. దీనికి స్పందించిన ఆయన గణపురం పీహెచ్సీని సందర్శించారు. బయోవేస్ట్, కాలం చెల్లిన మందులను చెత్త కుప్పలో వేసి కాల్చి వేయడంపై వైద్యులు, సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
వాటిని కాల్చడం వల్ల విషపూరితమైన వాయువులు వెలువడుతాయన్నారు. బయో వేస్టేజీని దవాఖానలో ఏర్పాటు చేసిన కుండీలో వేస్తే సంబంధిత కాంట్రాక్టర్లు వాటిని తీసుకెళ్తారన్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతమైతే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆస్పత్రి వెనకాల పడేసిన మందులను ఆయన గ్రామ పంచాయతీ సిబ్బందితో తీయించారు.
దవాఖాన తనిఖీకి వచ్చిన సమయంలో వైద్యులు, సిబ్బంది సకాలంలో విధులకు హాజరుకాకపోవడంపై డీఎంహెచ్వో ఫైర్ అయ్యారు. సమయపాలన పాటించడంతో పాటు దవాఖానకు వచ్చే రోగులతో మర్యాదగా నడుచుకోవాలన్నారు. పేదలే ఎక్కువగా వస్తారని వారికి అవసరమైన వైద్య సేవలందించడంతో పాటు సరైన మందులు ఇవ్వాలని ఆదేశించారు.