ముంబై: మహారాష్ట్రలోని శరద్ పవార్ ఎన్సీపీకి చెందిన ఎంపీల బృందం సోమవారం ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆయన నివాసంలో కలిశారు. శరద్ పవార్ కుమార్తె, ఆ పార్టీ ఎంపీ సుప్రియా సూలే నేతృత్వంలోని ఈ బృందం సుమారు అరగంట పాటు మోదీతో సమావేశమయ్యారు. (Sharad Pawar) తమ నియోజకవర్గాల అంశాలను ప్రస్తావించడంతో పాటు, మహారాష్ట్రలోని కరువు పరిస్థితులు, నీటిపారుదల సంబంధిత సమస్యలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. అలాగే మహాత్మా జ్యోతిరావు ఫూలే, సావిత్రిబాయి ఫూలే, షాహిర్ అన్నా భావు సాఠే, తుకడోజీ మహారాజ్లకు భారత్ రత్నా పురస్కారాలు ప్రదానం చేయాలని కూడా ఈ బృందం డిమాండ్ చేసింది. నవీ ముంబై విమానాశ్రయానికి మహారాష్ట్ర మాజీ మంత్రి డీవై పాటిల్ పేరు పెట్టాలని వారు కోరారు. తమ డిమాండ్లు, ఆందోళనలను వివరిస్తూ ప్రధానమంత్రికి ఒక లిఖితపూర్వక వినతిపత్రాన్ని సమర్పించారు.
కాగా, ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమికి మిత్రపక్షమైన శరద్ పవార్ వర్గం ఎంపీలు ప్రధానితో భేటీ నేపథ్యంలో ప్రతిపాది డీలిమిటేషన్ బిల్లుకు ఆ పార్టీ మద్దతు ఇవ్వవచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ప్రతిపాదిత డీలిమిటేషన్ బిల్లు, విదేశీ విరాళాల (నియంత్రణ) సవరణ బిల్లుపై ఈ సమావేశంలో చర్చ జరుగలేదని శరద్ పవార్ వర్గం ఎంపీలు తెలిపారు. ఎఫ్సీఆర్ఏ బిల్లును తాము వ్యతిరేకిస్తామని పేర్కొన్నారు.
మరోవైపు మహారాష్ట్రకు సహాయ నిధులు అందకపోవడంతో ప్రధానమంత్రిని కలిసేందుకు తమ పార్టీ ఎంపీలు ముందుగా అపాయింట్మెంట్ కోరినట్లు ఈ సమావేశానికి ముందే సుప్రియా సులే తెలిపారు. ప్రతిపాదిత డీలిమిటేషన్ చట్టం తుది స్వరూపంపైనే తమ పార్టీ వైఖరి ఆధారపడి ఉంటుందని ఆమె స్పష్టం చేశారు.