అమరావతి : మానవ అక్రమ రవాణాకు (Human trafficking) పాల్పడుతున్న కేసులో విశాఖ (Visaka) కు చెందిన ముగ్గురు ఏజెంట్లను పోలీసులు అరెస్టు చేశారు. శనివారం విశాఖలో పోలీస్ కమిషనర్ (CP) రవి శంకర్(Ravi Shanker) ముఠా వివరాలను, వారు చేస్తున్న మోసాలను వివరించారు. ఈ కేసులో రాజేశ్వరరావు, జ్ఞానేశ్వరరావు, కొండలరావును అనే ఏజెంట్లను అరెస్టు (Agents arrest) చేశామని వెల్లడించారు.
కాంబోడియా (Cambodia) లో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాల పేరుతో 150 మంది నిరుద్యోగులను కాంబోడియాకు పంపి నిర్బంధించారని తెలిపారు. అక్కడికి వెళ్లిన తరువాత చైనాకు చెందిన మాఫియా కంపెనీలు వీరిచే బలవంతంగా సైబర్ స్కామ్లు చేయిస్తున్నాయని పేర్కొన్నారు. సామాన్యులను పెడెక్స్ స్కామ్లోకి ఎలా లాగాలో శిక్షణ ఇస్తారని చెప్పారు. నిరుద్యోగుల నుంచి రూ. లక్షన్నర చొప్పున వసూలు చేసి ఇందుల్లో 80 శాతం కాంబోడియా వారికి ఇచ్చి మిగతాది వీరు తీసుకుంటున్నారని తెలిపారు.
కాంబోడియాకు వెళ్లిన వారు ఒత్తిళ్లకు లొంగి స్కామ్లు చేసేవారికి రూ. 600 డాలర్లు ఇస్తారని, మాట వినకుంటే చిత్ర హింసలు పెడతారని పేర్కొన్నారు. ఈ ముఠా ఆగడాలు రెండేళ్లుగా నడుస్తున్నాయని అన్నారు. కేసు గురించి ఇప్పటికే కాంబోడియా ఎంబసీ సిబ్బందికి తెలిపామని, కేసు దర్యాప్తుకు కాంబోడియాలోని భారత ఎంబసీ(India Embassy) సహకారం తీసుకుంటామని సీపీ వివరించారు. ఈ ముఠా వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారో ఆరా తీస్తామని ఆయన వెల్లడించారు.