Asaduddin Owaisi : ఉత్తర ప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ)తో పొత్తుకు సిద్ధంగా ఉన్నామని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. అయితే, పొత్తు చాలా క్లిష్టమైందని ఎసమాజ్వాదీ పార్టీ అభిప్రాయపడింది. శనివారం యూపీలోని మొరాదాబాద్లో జరిగిన ఒక కార్యక్రమంలో ఒవైసీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒవైసీ మాట్లాడారు. ఎస్పీతో పొత్తుకు ఎంఐఎం సిద్ధంగా ఉందన్నారు. పొత్తుపై చర్చించేందుకు ఇదే సరైన సమయం అని ఆయన అభిప్రాయపడ్డారు.
తమ పార్టీ పోరాటం ఏ మతానికి వ్యతిరేకం కాదని, ఎన్నికల అనంతరం సమాజ్వాదీ పార్టీ బాధపడటం కంటే పొత్తే నయం అన్నారు. బీజేపీని మరోసారి రాష్ట్రంలో అధికారంలోకి రానివ్వకుండా చూడటమే తమ లక్ష్యమని అభిప్రాయపడ్డారు. ఎస్పీతో కలిసి పని చేస్తామని చెప్పారు. తమ పోరాటం తమ గౌరవం కోసమని, న్యాయం కోసమే అని ఒవైసీ అన్నారు. ఎస్పీతో పొత్తు కోసం ఒవైసీ మాట్లాడటం పది రోజుల్లో ఇది రెండోసారి. గతవారం కూడా ఈ అంశంపై మాట్లాడారు. తమ పార్టీ ఎస్పీతో, బీఎస్పీతో కలిసి పోటీ చేసేందుకు సిద్ధమన్నారు. ఎస్పీతో పొత్తు గురించి ఒవైసీ ఎంతగా మాట్లాడుతున్నా.. ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ మాత్రం దీనికి అంత సుముఖంగా లేనట్లు కనిపిస్తోంది.
ఎంఐఎంతో పొత్తు అంత సులభం కాదని అఖిలేష్ యాదవ్ అభిప్రాయపడ్డారు. ఎస్పీ ఎంపీ మొహిబ్బుల్లా నద్వీ మాట్లాడుతూ ఈ పొత్తులో చాలా సమస్యలున్నాయని, అయినప్పటికీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తుది నిర్ణయం తీసుకుంటారని ఆయన వ్యాఖ్యానించారు. వచ్చే ఏడాది ఉత్తర ప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీని ఎదుర్కొనేందుకు ఇప్పటినుంచే వివిధ పార్టీలు ప్రత్యేక వ్యూహాలు రచిస్తున్నాయి. దీనిలో భాగంగా ఒవైసీ.. ఎస్పీతో పొత్తు కోసం తాపత్రయపడుతున్నారు.