హేమాహేమీలను మట్టికరిపిస్తున్న టీఆర్ఎస్
అధినేత కేసీఆర్ పదునైన వ్యూహంతో కుదేలైన బడానేతలెందరో
సాగర్లో జానారెడ్డికి చుక్కలు చూపుతున్న గులాబీ సైన్యం
హైదరాబాద్, మార్చి 31 (నమస్తే తెలంగాణ): తమకు ఎదురే లేదని.. తమ రాజకీయ కోటల్ని ఎవరూ ఛేదించలేరని విర్రవీగిన హేమాహేమీలను టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తన పదునైన రాజకీయవ్యూహంతో మట్టి కరిపించారు. ఇప్పుడు నాగార్జునసాగర్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జానారెడ్డికి ‘కుంజర యూధంబు…దోమ కుత్తుక జొచ్చెన్..’ అనే పరిస్థితి తలెత్తుతున్నదా? అంటే జరుగుతున్న పరిణామాలు అవుననే అంటున్నాయి. టీఆర్ఎస్ పార్టీకి ఉన్న ప్రజాబలం.. పార్టీ అధినేత కేసీఆర్ తీసుకునే నిర్ణయాలకు ప్రత్యర్థులు బెంబేలెత్తిపోయిన సందర్భాలు అనేకమున్నాయి. అదే జాబితాలో జానారెడ్డి సైతం చేరడం ఖాయమనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
టీఆర్ఎస్ ఎవరిని అభ్యర్థిగా బరిలో దించినా ప్రజలు ఆదరిస్తారని నాగార్జునసాగర్ ఉప ఎన్నికల ఫలితాలు మరోసారి నిరూపించబోతున్నాయని టీఆర్ఎస్ శ్రేణులు పేర్కొంటున్నా యి. తమదే సామ్రా జ్యం అని గొప్పలు చెప్పుకున్న ఎందరో హేమాహేమీలపై.. రాజకీయ ఓనమాలు కూడా నేర్వని వాళ్లను పోటీగా దింపి అత్యంత సునాయాసంగా గెలిపించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. వైఎస్ రాజశేఖర్రెడ్డి, కిరణ్కుమార్ మంత్రివర్గాల్లో తిరుగులేని మంత్రులుగా చలామణి అయిన ఎంతోమందిని రాజకీయాల్లో చెల్లకుండా చేసిన ఘనత తమ అధినేత సీఎం కేసీఆర్ సొంతమని ఆ పార్టీ నాయకులు చెప్తున్నారు. తెలంగాణ వాదానికి ప్రజల్లో అంతగా ఆదరణలేదని అసత్యాలు ప్రచారాలు చేసిన సందర్భంలో మంత్రుల మీదే పోటీకి నిలబెట్టి వాళ్లను మట్టి కరిపించిన దాఖాలాలు బోలెడు. 2014, 2015, 2018 సాధారణ ఎన్నికల సందర్భంలోనూ అదే చరిత్ర పునరావృతమైంది.
కదిలిన పీఠాలు
2014 సాధారణ ఎన్నికల సమయంలో పెద్దపల్లి లోక్సభ స్థానం కాంగ్రెస్కు కంచుకోట. ఆరుసార్లు ఎంపీగా, 4సార్లు ఎంపీగా వెంకటస్వామి ఆ నియోజకవర్గాన్ని శాసించారు. ఆనంతరం ఆయన కొడుకు వివేక్ వెంకటస్వామి అదే పార్టీకి సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాల్లో పెద్దపెల్లి అంత కీలకమైన స్థానం. అక్కడి నుంచి సీఎం కేసీఆర్.. విద్యార్థి నాయకుడు బాల్క సుమన్ను బరిలో దింపారు. ‘వెయ్యికోట్ల అధిపతి కావాలా.. తెలంగాణ ఉద్యమంలో వెయ్యి కేసులున్న విద్యార్థి నాయకుడు కావాలా?’ అని సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపును పెద్దపల్లి ప్రజలు ఆలకించి బాల్క సుమన్కు 2.94 లక్షల ఓట్ల పైచిలుకు మెజారిటీని ఇచ్చి వివేక్ను మట్టి కరిపించారు.
2015 వరంగల్ లోక్సభ ఉప ఎన్నికల్లో అప్పటిదాకా కనీసం స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పోటీచేయని పసునూరి దయాకర్ను.. కేంద్రమంత్రిగా పనిచేసి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న సర్వే సత్యనారాయణపై బరిలో దింపి నాలుగున్నర లక్షల భారీ ఆధిక్యంతో దేశంలోనే ఏడో అత్యధిక మెజారిటీ సాధించిన పార్టీగా రికార్డు సృష్టించారు.
2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఎంతోమంది హేమాహేమీలు సీఎం కేసీఆర్ వ్యూహరచనకు కుప్పకూలారు. మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ (ఆందోల్)పై జర్నలిస్ట్ చంటి క్రాంతికిరణ్, గద్వాల నుంచి మాజీ మంత్రి డీకే అరుణపై కృష్ణమోహన్రెడ్డి, జహీరాబాద్లో మాజీ మంత్రి గీతారెడ్డిపై మాణిక్యరావును, నల్లగొండలో మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డిపై కంచర్ల భూపాల్రెడ్డి, జగిత్యాలలో జీవన్రెడ్డిపై డాక్టర్ సంజయ్, తెలంగాణ తొలి పీసీసీ అధ్యక్షుడు పొన్నాలపై ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మొదలైనవారిని బరిలో దింపి వారి కంచుకోటలను కైవసం చేసుకున్న చరిత్ర టీఆర్ఎస్ది.
ఒత్తిడిలో జానా
సాగర్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రచార హోరు, ఆ పార్టీకి ప్రజల నుంచి లభిస్తున్న విశేష ఆదరణతో జానా.. జరూర్ ఘర్”జానా’ అనే వాతావరణం నెలకొన్నదని గులాబీ శ్రేణులు ధీమాతో ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో రికార్డుస్థాయిలో మంత్రిగా పనిచేసిన జానారెడ్డికి టీఆర్ఎస్ ముచ్చెమటలు పట్టిస్తున్నదని, తన రాజకీయ జీవితంలో ఆయన మొదటిసారి ఓటమి ఒత్తిడికిలోనై మాట్లాడుతున్నారని టీఆర్ఎస్ విశ్లేషిస్తున్నది. జానారెడ్డిపై టీఆర్ఎస్ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే నర్సింహయ్య కుమారుడు భగత్ను బరిలో దింపింది. భగత్ ఇప్పటిదాకా తండ్రి చాటు కొడుకు.. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయంతో అభ్యర్థిగా మారారు. ఎన్నికల్లో గెలిచేది టీఆర్ఎస్ అని, అధినేత ఎవరిని బరిలో నిలిపినా ప్రజలు ఆదరిస్తారని సాగర్ మరోసారి రుజువు చేయబోతున్నదని ఆ పార్టీ ధీమా వ్యక్తంచేస్తున్నది. హేమాహేమీలపై సింహాలై గర్జించిన చరిత్ర తమ పార్టీకి ఉన్నదని గులాబీ శ్రేణులు పేర్కొంటున్నాయి. సాగర్లో ఇక జానారెడ్డి గతం..భవిష్యత్ టీఆర్ఎస్ అని టీఆర్ఎస్చేస్తున్న ప్రచారంపై ప్రజలు ఆదరిస్తున్నారని.. జానారెడ్డి ఇంటికి పోవటం ఖాయమని చెప్తున్నాయి.
ఇవి కూడా చదవండి:
మహేశ్కు మంత్రి కేటీఆర్ భరోసా
ఎఫ్సీఐ కావాలనే ఇబ్బంది పెడుతున్నది
ఆటో వద్దనే భూమి రిజిస్ట్రేషన్
రామాయణం, భారతం ప్రపంచానికే తలమానికం
మన పల్లె ప్రగతికి 12 పురస్కారాలు
స్వచ్ఛ సర్వేక్షణ్లో హైదరాబాద్షా