నాన్న ఆశయాలు సాధిస్తా!
సీఎం వాత్సల్యానికి జీవితాంతం రుణపడి ఉంటా
టీఆర్ఎస్ ముందు కాంగ్రెస్ నిలవదు.. బీజేపీ పెరగదు
ప్రజలకు అందుబాటులో ఉండాలని అక్కడే ఉంటున్నం
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి నియోజకవర్గంలో ఇల్లేలేదు
నమస్తే తెలంగాణ ఇంటర్వ్యూలో నాగార్జునసాగర్ టీఆర్ఎస్ అభ్యర్థి భగత్
హైదరాబాద్, మార్చి 29 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కేసీఆర్ బాటలో సాగుతూ తండ్రి నోముల నర్సింహయ్య ఆశయాలను సాధిస్తానని నాగార్జునసాగర్ ఉపఎన్నికల టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ తెలిపారు. సీఎం కేసీఆర్ తనపట్ల చూపిన వాత్యల్యానికి జీవితాంతం రుణపడి ఉంటానని అన్నారు. 2018 ఎన్నికల్లో సాగర్లో టీఆర్ఎస్ విజయం తర్వాతే ఆ ప్రాంత ప్రజలకు స్వాతంత్య్రం వచ్చిందని చెప్పారు. అందరి అభిమానం, ఆశీర్వాదం తో ఎన్నికల్లో విజయం సాధిస్తానని స్పష్టంచేశారు. సాగర్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిగా సోమవారం సీఎం కేసీఆర్ ఎంపికచేసిన తర్వాత భగత్ ‘నమస్తే తెలంగాణ’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
సీఎం కేసీఆర్ మీ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడంపై మీ స్పందన?
మాటల్లో చెప్పలేను. ఈ రోజు ఉదయం ‘సార్.. హైదరాబాద్కు రమ్మన్నారు’ అని చెప్పారు. ఎందుకో తెలియదు. నేను, అమ్మ, ఇద్దరు ముగ్గురు బంధువులతో కలిసి వచ్చాం. తెలంగాణభవన్లో సార్.. మంత్రి జగదీశ్రెడ్డి, ఎంపీ సంతోష్కుమా ర్, ఎమ్మెల్సీలు శేరి సుభాష్రెడ్డి, పల్లా రాజేశ్వర్రెడ్డి, తేరా చిన్నపరెడ్డి, శ్రీనివాస్రెడ్డి, శ్రవణ్కుమార్రెడ్డి, కోటిరెడ్డి, రమేశ్రెడ్డి అందరూ ఉన్నారు. సార్ దగ్గరికి పిలుచుకొ ని బీ-ఫాం ఇచ్చారు. ‘బాగా కష్టపడు.. మంచి భవిష్యత్ ఉంటది’ అని ఆశీర్వదించారు. సీఎంకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో అర్థం కావడంలేదు. పోటీచేసేందుకు అవకాశం ఇవ్వడమే కాకుండా ప్రచారం కోసం రూ.28 లక్షల చెక్కు కూడా ఇచ్చారు. సీఎం కేసీఆర్కు, టీఆర్ఎస్కు జీవితాంతం రుణపడి ఉంటా. సారు ఆశీర్వాదం. పార్టీ బలం.. ప్రజల దీవెనలతో సాగర్లో గెలుస్తాననే విశ్వాసం ఉన్నది.
మీ నాన్నను ఆదరించినట్టే మిమ్మల్ని ఆదరిస్తారని అనుకొంటున్నారా?
తప్పకుండా. మా నాన్న జీవితాంతం ప్రజా సమస్యల పరిష్కారానికి కృషిచేశారు. సీఎం కేసీఆర్ పట్ల మా నాన్నకు, నాన్న పట్ల కేసీఆర్కు ఉన్న అభిమానం వల్లే నేడు సాగర్ ప్రజలు అభివృద్ధిని రుచి చూస్తున్నా రు. నిజం చెప్పాలంటే సాగర్ ప్రజలకు 2018 తర్వాతే స్వాతంత్య్రం వచ్చింది. కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ప్రజల జీవితాల్లో వెలుగులు ప్రసరిస్తున్నా యి. టీఆర్ఎస్ ప్రభుత్వం వల్లే తాము సుఖసంతోషాలతో ఉన్నామని ప్రజలు భావిస్తున్నారు. ఒక్క మా నియోజకవర్గంలోనే 1.5 లక్షల పైచిలుకు ప్రభుత్వం ద్వారా లబ్ధిపొందారు. మా నాన్న చేయాలనుకొన్న పనులు.. ఆయన ఆశయాలను సీఎం కేసీఆర్ బాటలో నడు స్తూ నెరవేరుస్తాననే నమ్మకం నాకున్నది. మా నియోజకవర్గ ప్రజలు నన్ను తప్పకుం డా ఆశీర్వదిస్తారనే విశ్వాసం ఉన్నది.
సుదీర్ఘ అనుభవం ఉన్న జానారెడ్డితో మీరు తలపడుతున్నారు? మీ బలం?
జానారెడ్డి పెద్ద నాయకులే.. కాదనను. కానీ నాకు సీఎం కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తోపాటు మొత్తం పార్టీ బలం ఉన్నది. సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు, ప్రజల ఆశీర్వాద బలం ముందు జానారెడ్డి పెద్ద కాదనుకుంటున్న. 2018లో సాగర్ ప్రజలు నాన్నను అక్కున చేర్చుకున్నారు. ఆయన కొడుకుగా సభ్యుడిగా నన్నూ ఆశీర్వదిస్తారనే నమ్మకం ఉన్నది. వారి నమ్మకాన్ని వమ్ముచేయకుండా పనిచేస్తానని హామీ ఇస్తున్న.
మీరు నాన్లోకల్ అంటున్నారు?
నేను ఎక్కడ పుట్టాను అన్నది గతం. ఇప్పుడు మేము.. మా కుటుంబం ఎక్కడుంటున్నాం. 24 గంటలు ప్రజలకు అం దుబాటులో ఉంటూ వారి సమస్యల్ని పరిష్కరిస్తున్నామా లేదా అన్నది ప్రజలకు తెలుసు. నియోజకవర్గ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలి. ప్రజాప్రతినిధిగా ప్రజల మధ్యలేకపోతే వారి కష్టసుఖాలు తెలుసుకోలేం అని భావించిన నాన్న.. 2016లో హాలియాలో ఇల్లు కట్టారు. అప్పటి నుంచి అక్కడే ఉంటున్నాం. పండుగలు.. పబ్బాలు అన్నీ అక్కడే చేసుకుంటున్నాం. మా కుటుంబాన్ని నాన్లోకల్ అనేవారికి అక్కడ ఆఫీస్ తప్ప సొంత ఇల్లులేదు. కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి హైదరాబాద్లో ఉంటారు.
కాంగ్రెస్, బీజేపీ ఎన్నికల్లో గెలుపు మాదే అంటున్నాయి. దీనిపై మీరేమంటారు?
సాగర్ ప్రజలకు 2018కి ముందు.. తర్వాత తేడా ఏమిటో తెలిసిపోయింది. కాంగ్రెస్ 35 ఏండ్లు ప్రాతినిధ్యం వహించినా ప్రజలకు కలిగిన లాభం ఏమీలేదు. నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యం. కానీ టీఆర్ఎస్ 2018 ఎన్నికల సందర్భంగా ప్రకటించిన మ్యానిఫెస్టోలో ఇచ్చిన అన్ని హామీలనూ సీఎం కేసీఆర్ నెరవేర్చారు. మ్యానిఫెస్టోలో లేని అనేక అంశాలను పరిష్కరిస్తున్నారు. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ బలం ముందు కాంగ్రెస్ బలం చాలా చిన్నది. మా నియోజకవర్గంలో బీజేపీ 2018లో ఏ స్థాయిలో ఉన్నదో ఇప్పుడూ అదేస్థాయిలో ఉన్నది.
పార్టీలో టికెట్ ఆశించిన ఇతర నేతల సహకారం మీరు ఎలా పొందుతారు?
అందరి సహకారం.. ఆశీర్వాదం నాకు ఉండటం వల్లే నా అభ్యర్థిత్వాన్ని సీఎం కేసీఆర్ ఖరారు చేశారని భావిస్తున్నాను. టికెట్ ఆశించడం తప్పు ఎట్లా అవుతుంది? టికెట్ ఆశించిన అందరి సమక్షంలో అందరి ఆశీర్వాదం ఉండాలని సీఎం కేసీఆర్ దీవించారు. అందరూ నన్ను దీవిస్తారు. అందరి ప్రేమను నేను పొందుతాను అనే విశ్వాసం నాకున్నది.
సీఎం కేసీఆర్ తోబుట్టువులా ఆదరించారు: నోముల లక్ష్మి
సీఎం కేసీఆర్ తనను తోబుట్టువు లా ఆదరించారని దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య సతీమణి నోముల లక్ష్మి తెలిపారు. సోమవారం తెలంగాణభవన్లో తన కొడుకు భగత్కు సీఎం కేసీఆర్ బీ-ఫాం ఇచ్చిన అనంతరం ఆమె భావోద్వేగానికి గురయ్యారు. తన భర్తకు సీఎం కేసీఆర్ గొప్ప కానుక ఇచ్చారని చేతులెత్తి మొక్కారు. నిత్యం ప్రజల కోసం కష్టపడిన తన భర్త అడుగు జాడల్లో కొడుకు ఎదగాలని ఆశీర్వదించారు. 2014లో సాగర్లో తన భర్త పోటీచేసినప్పుడు ప్రచారం భయంభయంగా సాగేదని.. కానీ ఇప్పుడా పరిస్థితిలేదని తెలిపారు. ‘అప్పుడు మేం ఎన్నికల ప్రచారానికి పోతే ప్రజలు మాదిక్కు భయంభయంగా చూసేవారు. ఇక్కడెట్లా నెగ్గుకొస్తామని మాకూ భయమే అయ్యేది. కానీ కేసీఆర్ తెచ్చిన పథకాలు ఇల్లిల్లు చేరాయి. ఇప్పుడు అందరూ మమ్మల్ని బంధువుల్లా చూస్తున్నారు. నా కొడుకును కేసీఆర్ కూడా దీవించారు. మీరు కూడా దీవించాలి’ అని ఆమె సాగర్ నియోజకవర్గ ప్రజలను కోరారు.
సాగర్ టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్
నిధుల గోల్మాల్పై డీసీసీబీ సీరియస్