పాత పాలకవర్గంపై చర్యలకు డిమాండ్
ప్రకంపనలు సృష్టిస్తున్న విచారణ నివేదిక
ఖమ్మం, మార్చి 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఖమ్మం జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో గత పాలకవర్గం హయాంలో నిధుల దారి మళ్లింపు వ్యవహారం కలకలం రేపుతున్నది. గత పాలకవర్గ హయాంలో జరిగిన పలు అవకతవకలపై ఆదివారం జరిగిన జిల్లా కేంద్ర సహకార బ్యాంకు 118వ మహాజన సభలో వాడివేడిగా చర్చ జరిగింది. కేంద్ర సహకార బ్యాంకులో నిధుల దారి మళ్లింపుపై రాష్ట్ర అడిషనల్ రిజిస్ట్రార్ సుమిత్ర ఆధ్వర్యంలో ప్రభుత్వం విచారణ నిర్వహించింది. అనంతరం నివేదికను ప్రభుత్వం జిల్లా కేంద్ర సహకార బ్యాంకుకు పంపించింది. నిధులు మళ్లింపు అంశంపై అడిషనల్ రిజిస్ట్రార్ నివేదిక ప్రకారం తదుపరి చర్యలు తీసుకోవాలని సభ తీర్మానం చేసింది. గత పాలక సంస్థలో చైర్మన్గా ఉన్న మువ్వా విజయ్బాబు, పాలక మండలి సభ్యులు, సీఈవో ఆధ్వర్యంలో రూ.7,32,65,443 రైతులకు సంబంధించిన సొమ్ము దారి మళ్లించారని, అందులో భాగంగా రైతు సంక్షేమ నిధి దవాఖాన కోసం రూ.6,13,51,148 సేకరించారని, దీనివల్ల సహకార రంగంలోని సభ్యులకు నష్టం వాటిల్లిందని విచారణ నివేదిక స్పష్టం చేసింది. గత పాలకవర్గం వివిధ రూపాల్లో అనవసరపు ఖర్చులు చేసిందని, బహుమతుల ఖర్చు కిందనే రూ.63,15,443లు ఖర్చుచేసినట్టు వెల్లడించింది. విజ్ఞానయాత్ర పేరుతో బ్యాంకు సొమ్మును ఇష్టానుసారంగా ఖర్చు చేశారని, ఇందుకోసం రూ.55,98,847లు వినియోగించినట్టు తెలిపింది. ఇదంతా రిజర్వు బ్యాంకు నిబంధనలకు విరుద్ధమని పేర్కొంది. గత పాలకవర్గంలో జరిగిన అవకతవకలపై ఉన్నతాధికారులు ఇచ్చిన నివేదికను పూర్తిస్థాయిలో అమలుచేసి నిధులను రాబట్టాలని, నిధులను కేంద్ర సహకార బ్యాంకుకు జమచేయాలని డీసీసీబీ అధ్యక్షుడు కూరాకుల నాగభూషయ్య మహాజన సభలో డిమాండ్ చేశారు. ట్రస్టు పేరుతో రైతుల నుంచి సేకరించిన సొమ్మును రికవరీ చేయాలన్నారు.
సాగర్ టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్