ఆర్ఎఫ్సీఎల్లో ఉత్పత్తి ప్రారంభం
కరీంనగర్కు చేరిన కిసాన్ యూరియా
మొత్తం ఉత్పత్తిలో సగం మనకే
ఏప్రిల్ నుంచి పూర్తిస్థాయిలో తయారీ
45 కిలోల సంచి గరిష్ఠ ధర రూ. 266.50
కరీంనగర్, మార్చి 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్ర రైతాంగం ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న యూరియా ఉత్పత్తి ఎట్టకేలకు ప్రారంభమైంది. రామగుండం ఫర్టిలైజర్స్, కెమికల్స్ లిమిడెట్(ఆర్ఎఫ్సీఎల్) ఎరువుల తయారీని ప్రారంభించింది. కిసాన్ బ్రాండ్ పేరుతో మార్కెట్లోకి విడుదల చేసింది. ఆరుసంస్థల భాగస్వామ్యంతో చేపట్టిన ఫ్యాక్టరీ నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం కీలకపాత్ర పోషించింది. వచ్చేనెల నుంచి పూర్తి సామర్థ్యంతో ఇది పనిచేయనున్నది.
తీరనున్న కొరత
ఏటా 12.5 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఆర్ఎఫ్సీఎల్ను నిర్మించారు. నిత్యం 2,200 మెట్రిక్ టన్నుల అమ్మోనియా, 3,850 మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి కానున్నది. ఇందులో సగం తెలంగాణ రైతాంగానికే అందించనున్నారు. మిగిలిన సగం ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ర్టాలకు కేటాయించే అవకాశం ఉన్నది. దేశవ్యాప్తంగా ఏటా 300 నుంచి 350 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం 250 నుంచి 300 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే ఉత్పత్తి అవుతున్నది. మిగతాది విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ఆర్ఎఫ్సీల్ ఉత్పతితో ఈ కొరత తీరనున్నది. ఆర్ఎఫ్సీఎల్లో తయారవుతున్న 45 కిలోల యూరియా కిసాన్ యూరియా బస్తా ధరను రూ.266.50గా నిర్ణయించారు. కర్మాగారంలోని తొలి ఉత్పత్తిని తిరుమల తిరుపతి దేవస్థానానికి విరాళం ఇవ్వగా.. వాణిజ్యపర ఉత్పత్తి ప్రారంభమయ్యాక కరీంనగర్కు చెందిన రాష్ట్ర ఫర్టిలైజర్ అసోసియేషన్ అధ్యక్షుడు, హోల్సేల్ డీలర్ గౌరిశెట్టి మునీందర్కు మొదటి 22 టన్నులు (450 బస్తాలు) సరఫరా చేశారు.
నాడు ఎఫ్సీఐ.. నేడు ఆర్ఎఫ్సీఎల్
1970 అక్టోబర్ 2న నాటి కేంద్ర ఎరువుల రసాయనాలశాఖ మంత్రి త్రిగున్సేన్ రామగుండంలో ఎఫ్సీఐ (ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా)ఎరువుల కర్మాగారానికి శంకుస్థాపన చేశారు. గడువు కంటే ఆరేండ్ల ఆలస్యంగా ప్రారంభమైన ఎఫ్సీఐ.. 1980 నవంబర్ 1 నుంచి వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించింది. స్వస్తిక్ బ్రాండ్ పేరుతో యూరియాను మార్కెట్లోకి విడుదల చేయగా ఆదరణ లభించింది. అనంతర కాలంలో నిర్వహణతోపాటు పలు కారణాలతో 1999 మార్చి 31న కంపెనీ మూతపడింది. అప్పటి నుంచి ఉమ్మడిరాష్ట్రంలో ప్రతి ఎన్నికల్లోనూ ఎఫ్సీఐ పునరుద్ధరణ ఓ ఓటుబ్యాంకు నినాదంగా మారింది. యూరియా కొరతను తీర్చాలన్న లక్ష్యంతో దేశంలో మూతపడ్డ ఐదు ఎరువుల కర్మాగారాల పునరుద్ధరణకు కేంద్రం చర్యలు చేపట్టింది. వాటిలో ఒకటి ఆర్ఎఫ్సీఎల్.
ఆరుసంస్థల భాగస్వామ్యంతో..
ఆరు సంస్థల భాగస్వామ్యంతో ఎఫ్సీఐ స్థానంలోనే గ్యాస్ ఆధారిత ఆర్ఎఫ్సీఎల్ను నిర్మించారు. ఇందులో ఫర్టిలైజర్స్ లిమిటెడ్ 26 శాతం, ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్ 26, గెయిల్కు 14.3, డెన్మార్క్కు చెందిన హాల్దర్ టాప్సే కంపెనీకి 11.7, తెలంగాణ ప్రభుత్వం 11, భారత ఎరువుల సంస్థ(ఎఫ్సీఐ) 11 శాతం వాటా కలిగి ఉన్నాయి. 2015 సెప్టెంబర్ నుంచే నిర్మాణ పనులు సాగుతుండగా, అధికారికంగా 2016 ఆగస్టు 7న గజ్వేల్ వేదికగా ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. 2017 నవంబర్లో గ్యాస్ సరఫరాకు గెయిల్తో, 2019 ఏప్రిల్లో విద్యుత్తు సరఫరాకు ట్రాన్స్కో ఒప్పందం కుదిరింది. 2021 ఫిబ్రవరి 28 నుంచి ప్రయోగాత్మకంగా యూరియా ఉత్పత్తిని ప్రారంభించిన కంపెనీ, సోమవారం మార్కెట్లోకి పంపించింది.
రాష్ట్ర ప్రభుత్వ కృషితోనే..
దేశంలో ఐదు కర్మాగారాల పునరుద్ధరణకు చర్యలు తీసుకున్నా.. ఆర్ఎఫ్సీఎల్లో ఉత్పత్తి ప్రారంభం కావడం వెనుక తెలంగాణ ప్రభుత్వ కృషి చాలా ఉన్నది. మౌలిక సదుపాయల కల్పనతోపాటు స్థానికంగా ఎదురైన అవాంతరాలను తొలగిస్తూ నిర్మాణానికి కావాల్సిన స్వేచ్ఛను కల్పించింది. రాష్ట్ర ప్రభుత్వం తన వాటాను ఎప్పటికప్పుడు అందిస్తూ భాగస్వామ్య సంస్థలను ప్రోత్సహించింది. ఈ నేపథ్యంలోనే ఆర్ఎఫ్సీఎల్ ఉత్పత్తిని ప్రారంభించడానికి ఆస్కారం ఏర్పడింది.
సాగర్ టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్
నిధుల గోల్మాల్పై డీసీసీబీ సీరియస్