Delhi hotel : ఢిల్లీలోని హోటల్లో బుధవారం భారీ అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 17 మంది విదేశీయులు ఉన్నారు. ఇటీవలి కాలంలో ఢిల్లీలో జరిగిన భారీ అగ్ని ప్రమాదాల్లో ఇదీ ఒకటిగా నిలిచింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. భవిష్యత్లో ఇలాంటి అగ్నిప్రమాదాలు జరగకుండా నివారణ చర్యలు చేపట్టాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తరణ్జిత్ సింగ్ ప్రభుత్వాన్ని ఆదేశించారు. నెలంతా ఫైర్ సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని అధికారులకు సూచించారు.
ఢిల్లీ పరిధిలోని హోటళ్లు, రెస్టారెంట్లు, నర్సింగ్ హోమ్స్, కోచింగ్ సంస్థలు, కమర్షియల్ బిల్డింగ్స్.. ఇలా అన్నింటినీ తనిఖీ చేయాలని ఆదేశించారు. సరైన ప్రమాణాలు పాటించని వాటిని వెంటనే మూసి వేయాలని, సీల్ వేసి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. అగ్నిప్రమాదం అనంతరం ఢిల్లీలోని వివిధ విభాగాల ఉన్నతాధికారులతో ఎల్జీ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. అనంతరం ఈ ఆదేశాలు జారీచేశారు. దీని ప్రకారం.. జిల్లా స్థాయి అధికారులతో టీమ్స్ ఏర్పాటు చేయాలి. ఇందులో జిల్లా మేజిస్ట్రేట్, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్, మున్సిపల్ అధికారులు, ఫైర్ సేఫ్టీ అధికారులు సంయుక్తంగా తనిఖీ నిర్వహించాలి. హోం శాఖ కూడా నోడల్ ఏజెన్సీగా వ్యవహరించాలి. చీఫ్ సెక్రెటరీ, పోలీస్ కమిషనర్ ఈ టీమ్స్ పనితీరును పర్యవేక్షించాలి.
హోటళ్లలో అనుమతికి మించి ఎలాంటి నిర్మాణాలున్నా కఠిన చర్యలు తీసుకోవాలి. టూరిజం లైసెన్సులు, బిల్డింగ్ లైసెన్సులు పరిశీలించాలి. హోటల్స్ అసోసియేషన్లతో టూరిజం శాఖ ప్రాంతాలవారీగా సమావేశం నిర్వహించాలి. ఫైర్ సేఫ్టీని పరిశీలించాలి. నిబంధనలకు అనుగుణంగా ఫైర్ సేఫ్టీ ప్రమాణాలు పాటిస్తున్నారో లేదో పరిశీలించాలి. ప్రభుత్వ కార్యాలయాల బిల్డింగుల్ని కూడా పరిశీలించాలి. నీటి ప్రవాహం, వాటర్ ట్యాంకులు వంటివి లేకుంటే నోటీసులు ఇవ్వాలి. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. తనిఖీలకు సంబంధించిన వివరాల్ని డిజిటలైజ్ చేయాలి. ఫైర్ ఇంజిన్ వాహనాలు రావడానికి తగిన ఏర్పాట్లు ఉండేలా చూడాలి.