plastic currency : దేశంలోకి ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు రాబోతున్నాయనే ప్రచారం ఎప్పటినుంచో జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఇందుకు సిద్ధమవుతోంది. ప్లాస్టిక్ లేదా పాలిమర్తో తయారైన నోట్లను ప్రవేశపెట్టాలని ఆర్బీఐ ప్రయత్నిస్తోంది. ఈ అంశంపై తాజాగా ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా కూడా స్పందించారు. ప్లాస్టిక్ లేదా పాలిమర్ కరెన్సీ నోట్లను తీసుకొచ్చేందుకు ఆర్బీఐ ప్రయత్నిస్తోందన్నారు. ఈ నోట్లు వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అందుబాటులోకి వస్తాయని తెలిపారు. వచ్చే ఏప్రిల్-మే లోపు వీటిని విడుదల చేస్తామని, ఆ తర్వాత నుంచి మార్కెట్లో పూర్తిస్థాయిలో చెలామణిలో ఉంటాయన్నారు.
ఇవి పూర్తి ప్లాస్టిక్ నోట్లు కాదు. పాలిమర్ నోట్లు. ప్లాస్టిక్లాగా ఉండే ఒక సింథటిక్ మెటీరియల్తో వీటిని తయారు చేస్తారు. దృఢత్వంతోపాటు, ఫ్లెక్సిబుల్గా ఉండే ప్లాస్టిక్ ఫిలింపై కరెన్సీని ముద్రిస్తారు. ఇవి ప్రస్తుతం మార్కెట్లో ఉన్న కాటన్ ఫైబర్ పేపర్తో పోలిస్తే చాలా ఎక్కువ కాలం మన్నికతో ఉంటాయి. అంత త్వరగా చిరగడం, పాడైపోవడం వంటివి జరగవు. కరెన్సీ నోట్లు ఎక్కువ కాలం స్థిరంగా, మార్కెట్లో అందుబాటులో ఉండే లక్ష్యంతో ప్రభుత్వం ప్లాస్టిక్ కరెన్సీ నోట్లవైపు మొగ్గు చూపుతోంది. పైగా వీటి తయారీ ఖర్చు చాలా తక్కువ. వృథా కూడా తగ్గుతుంది. ఎక్కువ కాలం మన్నికతో ఉంటాయి. ఈ ప్లాస్టిక్ నోట్లు దాదాపు 30 ఏళ్లపాటు మన్నిక సామర్ధ్యం కలిగి ఉంటాయని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు.
ముఖ్యంగా చిన్న నోట్లకు ఇవి ఎంతో ఉపయోగకరం అన్నారు. రూ.10, రూ.20, రూ.100 నోట్లను ఇలా తయారు చేస్తామని వెల్లడించారు. పైలట్ ప్రాజెక్ట్ కింద రూ.10, రూ.20 నోట్లను వంద కోట్ల వరకు తయారు చేయాలని నిర్ణయించారు. ముందుగా ప్రయోగాత్మకంగా ఈ నోట్లను విడుదల చేస్తారు. మార్కెట్లో వినియోగదారులు, ప్రజల నుంచి వచ్చిన స్పందన ఆధారంగా వీటిలో మార్పులు చేసి, భారీ స్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తారు.