తెలంగాణలో పండే పత్తికి అంతర్జాతీయ మార్కెట్లో భారీ డిమాండ్ ఉన్నది. తెలంగాణ పత్తి మంచి క్వాలిటీతో ఉంటుంది కనుక అధిక ధర లభించే అవకాశం ఉన్నది. వచ్చే వానకాలంలో 75-80 లక్షల ఎకరాల్లో పత్తి సాగుకు రైతులు సిద్ధం కావాలి. అదే విధంగా కంది పంటను 20-25 లక్షల ఎకరాల్లో సాగు చేయాలి. పత్తి, కంది పంటలను వర్షాధారంగా కాకుండా నీళ్లు పారిస్తే నాణ్యతతోపాటు దిగుబడి పెరుగుతుంది. వేరుశనగ, ఆయిల్పామ్ సాగు కూడా బాగా లాభదాయకంగా ఉన్నది. వాటి సాగు మీద కూడా రైతులు దృష్టిసారించాలి.
-సమీక్షలో ముఖ్యమంత్రి కేసీఆర్
హైదరాబాద్, మార్చి 29 (నమస్తే తెలంగాణ): యాసంగి ధాన్యాన్ని మొత్తం ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రకటించారు. కరోనా మరోసారి విజృంభిస్తున్న నేపథ్యంలో రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని గతంలో మాదిరిగా గ్రామాల్లోనే ధాన్యం కొనుగోలుకు నిర్ణయించినట్టు వెల్లడించారు. దీనికోసం రాష్ట్రవ్యాప్తంగా 6,408 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ధాన్యం కొనుగోళ్లపై సోమవారం ప్రగతిభవన్లో వ్యవసాయ, మార్కెటింగ్, పౌరసరఫరాల శాఖల అధికారులతో సీఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ధాన్యం కొనుగోళ్లకు అవసరమైన రూ.20 వేల కోట్ల కు పౌర సరఫరాల శాఖకు బ్యాంకు గ్యారెంటీ ఇచ్చే ప్రక్రియను మంగళవారం నాటికి పూర్తిచేయాలని ఈ సందర్భంగా ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావును సీఎం కేసీఆర్ ఆదేశించారు. కరోనా మహమ్మారి మరోసారి పంజా విసురుతున్నది. ఈ సమయంలో రైతులు మార్కెట్లకు తరలివస్తే పెద్దఎత్తున కరోనా వ్యాపించే ప్రమాదం ఉన్నది. ఈ నేపథ్యంలోనే రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని గత యాసంగి, వానకాలంలో మాదిరిగానే ధాన్యం కొనుగోలుకు గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఇందుకు రాష్ట్రవ్యాప్తంగా 6,408 కేంద్రాలను ఏర్పాటుచేయాలన్నారు. ఇందులో 2,131 ఐకేపీ కేంద్రా లు, 3,964 పీఏసీఎస్ కేంద్రాలు, ఇతర మార్కెట్లలో మరో 313 కేంద్రాలు ఏర్పా టుచేయాలని ఆదేశించారు. మొన్నటి వానకాలంలోనూ ధాన్యం కొనుగోలును ప్రభు త్వం గ్రామాల్లోనే చేపట్టింది. ఇందుకోసం రాష్ట్రంలో 6,506 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. హైదరాబాద్లో ఉండి ధాన్యం కొనుగోలు ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డిని సీఎం కేసీఆర్ ఆదేశించారు. వ్యవసాయ, మార్కెటింగ్, సివిల్ సైప్లె శాఖ లు సమన్వయంతో పనిచేసి, కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందుల్లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
1.38 కోట్ల టన్నుల ధాన్యం అంచనా
ఈ యాసంగిలో 1.38 కోట్ల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనాలున్నట్టు సీఎం కేసీఆర్ తెలిపారు. ఈ సీజన్ లో 52.76 లక్షల ఎకరాల్లో వరి సాగుచే యడం గమనార్హం. ఈ మేరకు భారీ మొత్తంలో దిగుబడి వస్తుందని భావిస్తున్నారు. అందులో 1.17 లక్షల టన్నుల దొడ్డు రకం, 21 లక్షల సన్న ధాన్యం ఉం టుందని అంచనా వేస్తున్నారు. ఎండలు తీవ్రంగా ఉన్నందున వరి పైర్లు ఎండకూడదనే ఉద్దేశంతో నడి వేసవిలోనూ నీళ్లు అందించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. సీఎం ఆదేశాలకు అనుగుణంగా అధికారు లు రాష్ట్రంలోని అన్ని చెరువులను కాళేశ్వ రం నీళ్లతో నింపేశారు. దీంతో వరి పంటకు ఇబ్బంది లేకుండా పోయింది.
తాలు, తేమ లేకుండా తీసుకురండి
వరి కోయగానే.. ధాన్యాన్ని నేరుగా కొనుగోలు కేంద్రాలకు తీసుకురావొద్దని సీఎం కేసీఆర్ రైతులకు సూచించారు. ఆ ధాన్యాన్ని ఎండపోసి, తాలు, తేమ లేకుం డా చూడాలని చెప్పారు. తేమ శాతం 17కు మించకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నా రు. నిబంధనలకు అనుగుణంగా నాణ్యమై న ధాన్యాన్ని తీసుకొచ్చి మద్దతు ధర పొందాలని కోరారు. ధాన్యం కొనుగోలుకు అవసరమైన 20 కోట్ల గన్నీ బ్యాగులను సిద్ధం చేసుకోవాలని పౌరసరఫరాలశాఖను ఆదేశించారు. ఆహార ధాన్యాల నిల్వల కోసం అదనపు గోదాములను నిర్మించేందుకు సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ సిద్ధంగా ఉన్నందున కార్పొరేషన్కు లీజుకు ఇచ్చేందుకు స్థలాలను ఎంపిక చేయాలని సీఎస్ సోమేశ్కుమార్ను ఆదేశించారు.
ఎల్లుండి కొనుగోలుకు చర్యలు
ధాన్యం కొనుగోళ్లకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సివిల్ సైప్లె అధికారులు అవసరమైన చర్యలు చేపట్టారు. గురువారం లేదా శుక్రవారం నుంచి కొనుగోళ్లు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ముందుగా ఎక్కడైతే వరి కోతలు మొదలయ్యే అవకాశం ఉన్నదో అక్కడ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు సివిల్ సైప్లె కార్పొరేషన్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. ముందుగా ఖమ్మం, నల్లగొండ, నిజామాబాద్ జిల్లాల్లో వరి కోతలు మొదలయ్యే అవకాశం ఉన్నది కాబట్టి.. ఆ ఏరియాల్లో కొనుగోలు కేంద్రాలను ముందుగా ప్రారంభించనున్నారు. ఆ తర్వాత కోతల క్రమాన్ని బట్టి ఏర్పాటు చేయనున్నారు.
80 లక్షల ఎకరాల్లో పత్తి.. 25 లక్షల ఎకరాల్లో కంది
రాష్ట్రంలో పండే పత్తికి అంతర్జాతీయ మార్కెట్లో భారీ డిమాండ్ ఉన్నదని సీఎం కేసీఆర్ తెలిపారు. తెలంగాణ పత్తి మంచి క్వాలిటీతో ఉంటుంది కనుక అధిక ధర లభించే అవకాశం ఉన్నదన్నారు. ఈ నేపథ్యంలో వానకాలంలో 75-80 లక్షల ఎకరాల్లో పత్తి సాగుకు రైతులు సిద్ధం కావాలని కోరారు. ఇందుకు అవసరమైన విత్తనాల కోసం ఇప్పటినుంచే ఏర్పాట్లు చేయాలని వ్యవసాయశాఖ కార్యదర్శి జనార్దన్రెడ్డిని సీఎం కేసీఆర్ ఆదేశించారు. గత వానకాలంలో పత్తి రికార్డుస్థాయిలో 60.53 లక్షల ఎకరాల్లో సాగుచేయడం గమనార్హం. కంది పంట 20-25 లక్షల ఎకరాల్లో సాగుచేయాలని సీఎం కోరారు. గత వానకాలంలో కంది కూడా రికార్డుస్థాయిలో 10.84 లక్షల ఎకరాల్లో సాగుచేశారు. పత్తి, కంది పంటను కేవలం వర్షాధారంగా కాకుండా నీళ్లు పారిస్తే నాణ్యతతోపాటు దిగుబడి పెరుగుతుందని సీఎం కేసీఆర్ రైతులకు సూచించారు. వేరుశనగ, ఆయిల్పామ్ సాగు కూడా బాగా లాభదాయకంగా ఉన్నదని, వాటి సాగుపై కూడా రైతులు దృష్టిసారించాలని కోరారు. ఈ సమావేశంలో మంత్రులు నిరంజన్రెడ్డి, ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్, పౌరసరఫరాల కార్పొరేషన్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్, సీఎం కార్యాలయ ముఖ్యకార్యదర్శి నర్సింగ్రావు, కార్యదర్శి భూపాల్రెడ్డి, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు, వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి జనార్దన్రెడ్డి, ఎఫ్సీఐ జీఎం అశ్వినీగుప్తా తదితరులు పాల్గొన్నారు.
సూర్యాపేట చివరి భూములకు కాళేశ్వరం జలాలు
అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి కేసీఆర్
రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల కింద వరిపంట ఎండిపోకుండా మరో 10 రోజులపాటు పూర్తిస్థాయిలో నీరు అందించేలా చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. సూర్యాపేట జిల్లాలో కొన్నిచోట్ల కాలువ చివరి భూములకు సరిపడా నీరందించాలని రైతులు కోరుతున్నారని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక్క ఎకరం కూడా ఎండిపోకుండా చూడాలని చెప్పారు. కరీంనగర్ లోయర్ మానేరు డ్యాం నుంచి డీబీఎం-71 పరిధిలో ఉన్న సూర్యాపేట జిల్లాలోని కాల్వ చివరి భూములకు సరిపడా కాళేశ్వరం జలాలను అందించాలని జలవనరులశాఖ ఈఎన్సీ బీ శంకర్ను సీఎం కేసీఆర్ ఫోన్లో ఆదేశించారు.
సాగర్ టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్
నిధుల గోల్మాల్పై డీసీసీబీ సీరియస్