హైదరాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో తెలంగాణ రాష్ర్టాన్ని స్వతంత్ర భారత చరిత్రలో అత్యంత విజయవంతమైన ‘స్టార్టప్ స్టేట్’గా నిలిపామని, అన్ని రంగాల్లో అగ్రగామిగా తీర్చిదిద్దామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పునరుద్ఘాటించారు. ఇటీవలే ఢిల్లీలో ఓ మీడియా సంస్థ (ఇండియన్ ఎక్స్ప్రెస్) నిర్వహించిన ఐడియా ఎక్స్చేంజ్ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొని తన అభిప్రాయాలు పంచుకున్నారు. సమకాలీన రాజకీయాలు, డీలిమిటేషన్, పార్టీ ఫిరాయింపులు, జెన్జీ ఉద్యమంపై స్పందించారు. బీఆర్ఎస్ పాలనలో సాధించిన అభివృద్ధిని గణాంకాలతో వివరించారు. ‘2014లో తెలంగాణ తలసరి ఆదాయం రూ.94 వేలు.. 2023 నాటికి అది రూ.3.27 లక్షలకు పెరిగింది. ఇది జాతీయ సగటు కంటే రెట్టింపు.
దేశంలోనే అత్యధిక తలసరి ఆదాయం సాధించిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది’ అంటూ వివరించారు. 2014లో రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ) సుమారు రూ.4.5 లక్షల కోట్లుగా ఉండగా, 2023 నాటికి అది రూ.15 లక్షల కోట్లకు చేరుకున్నదని తెలిపారు. తమ పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పలు రంగాల్లో గణనీయంగా పురోగతి సాధించిందని గుర్తుచేశారు. కాంగ్రెస్, బీజేపీ జాతీయ పార్టీలు కావని, అవి పెద్ద ప్రాంతీయ పార్టీలు మాత్రమేనని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో బీఆర్ఎస్ బలంగా ఉన్నదని, రాష్ట్రంలో తమ పార్టీని ఎవరూ ఫినిష్ చేయలేరని తేల్చిచెప్పారు.
తాము నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ పథకమని కేటీఆర్ పేర్కొన్నారు. అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏది అని ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తే కాళేశ్వరమనే సమాధానం వస్తుందని చెప్పారు. సముద్ర మట్టానికి సుమారు 80 మీటర్ల ఎత్తులోని నీటిని, పలు దశల్లో 620 మీటర్ల ఎత్తుకు ఎత్తిపోసే ప్రాజెక్టును తాము నిర్మించామని తెలిపారు. ఇలాంటి ఘనత బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాలు సాధించి ఉంటే దేశవ్యాప్తంగా మరింత ప్రచారం దక్కేదని వ్యాఖ్యానించారు. కానీ తమకు తగినంత ప్రచారం లభించలేదని తెలిపారు. భాక్రానంగల్, నర్మద వంటి ఎన్నో ప్రాజెక్ట్లు నిర్మించినా దశాబ్దాలు పట్టిందని, ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరాన్ని తాము కేవలం నాలుగేండ్ల వ్యవధిలోనే పూర్తిచేశామని చెప్పారు.
హైదరాబాద్లోని టీ హబ్ ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ క్యాంపస్గా ఎదిగిందని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టితో ఏర్పాటు చేసిన టీ హబ్ నుంచి సైరూట్ వంటి సంస్థలు వెలుగులోకి వచ్చాయని చెప్పారు. స్టార్టప్ల అభివృద్ధికి తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని వివరించారు. వరి ఉత్పత్తిలో తెలంగాణ నంబర్వన్గా ఎదిగిందని, వ్యవసాయం, పరిశ్రమలు, ఐటీ, మౌలిక సదుపాయాలు, సంక్షేమం సహా అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధి సాధించిందని గుర్తుచేశారు. ఈ సందర్భంగా పలు ప్రశ్నలకు ఆయన సమాధానాలిచ్చారు.

కేటీఆర్: మేము అధికారాన్ని ఆస్వాదించలేదు. టాస్క్.. గేమ్లా భావించాం. ప్రజలు అప్పగించిన గొప్ప బాధ్యతగా భావించి పనిచేశామన్నారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజం. పదేండ్ల పాటు ప్రజల కోసం అంకితభావంతో పనిచేసినం. ఎన్నికల్లో గెలిచినా, ఓడినా మేము ప్రాతినిధ్యం వహించిన తెలంగాణ రాష్ట్రం సాధించిన అభివృద్ధిని చూసి గర్వపడుతున్నం.
కాంగ్రెస్-బీజేపీ మధ్య రహస్య అవగాహన ఉన్నది. కేంద్ర ప్రభుత్వ పథకాల కాంట్రాక్టులు, రాష్ట్ర ప్రభుత్వ పనుల్లో పరస్పర ప్రయోజనాలు పొందుతున్నరు. కాంగ్రెస్ ముఖ్యమంత్రి బావమరిది కేంద్ర ప్రభుత్వ అమృత్ టెండర్లు దక్కించుకుంటరు. బీజేపీ ఎంపీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పనులు కైవసం చేసుకుంటరు. ఇంత జబర్దస్తీ దోస్తీ నడుస్తున్నది. ఇరు పార్టీలు కలిసి నడుస్తున్నయ్.
తెలంగాణ రాజకీయాల్లో బాపు కేసీఆర్ మాత్రమే. రాష్ట్రంలో కేసీఆర్ ఓ వైపు ఉంటే.. మిగతా వారంతా మరో వైపు ఉన్నరు. కేసీఆర్ రాజకీయాల్లో చురుగ్గానే ఉన్నరు. ప్రజల ముందుకు తరచూ రాకపోయినా పార్టీ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నరు. అవసరమైనప్పుడు ప్రజా సమస్యలపై స్పందిస్తున్నరు. కృష్ణా నది జలాల అంశంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా విమర్శించిండ్రు. నల్లగొండలో రెండు లక్షల మందితో భారీ సభ నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయాలు మార్చుకునేలా చేసిండ్రు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించే నాయకుడిగా కొత్త ప్రభుత్వానికి పనిచేసే అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో కేసీఆర్ సంయమనంతో వ్యవహరిస్తున్నరు. మేమంతా కేసీఆర్ తయారుచేసిన సైనికులం.. ఆయన శిష్యులం. మేం మాట్లాడే ప్రతి అంశం పార్టీ సిద్ధాంతాలు, కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగానే ఉంటది.
ఢిల్లీలో జరిగింది వాట్సాప్ అంకుల్స్.. ఇన్స్టా కిడ్స్ మధ్య యుద్ధం. వాట్సాప్ అంకుల్స్ మొదటి రౌండ్లోనే ఓడిపోయిండ్రు. యువత ఆందోళన అనేక సంకేతాలిస్తున్నది. ఇది బీజేపీని కలవరపెట్టింది. యువతకు సంఘీభావంగా మేము సైతం రంగంలోకి దిగినం. ఇండియా సరైన సమయంలో స్పందిస్తుందని కేసీఆర్ గతంలోనే చెప్పిండ్రు. నేపాల్లో జరిగినట్టు జెన్జీ ఆందోళనలు మన దగ్గర జరిగే అవకాశం ఉన్నదని నేను ముంబైలో జరిగిన సమావేశంలో చెప్పిన. ఈడీ, ఐటీ, సీబీఐలను ప్రయోగించి బీజేపీ జెన్జీని ఆపలేకపోయింది. అవేవీ యువతపై పనిచేయలేకపోయినయ్.
వాస్తవానికి కాంగ్రెస్, బీజేపీ జాతీయ పార్టీలు కావనేది నా అభిప్రాయం..అవి కూడా పెద్దసైజు ప్రాంతీయ పార్టీలే. నేషనల్ పార్టీలతో దేశానికి ఒరిగేదేమీ ఉండదు. ప్రాంతీయపార్టీలు బలంగా ఉన్నప్పుడే దేశపురోగతి సాధ్యమనేది నా నిశ్చితాభిప్రాయం.. ఫిరాయింపు నిరోధక చట్టం విషయంలో రెండు పార్టీలదీ ద్వంద్వవైఖరే. ఈ చట్టం చేసిన కాంగ్రెస్ గతంలో అనేక పార్టీలను చీల్చింది. ఇప్పుడు బీజేపీ కూడా అదే చేస్తున్నది. తెలంగాణలో బీఆర్ఎస్ బలంగా ఉన్నది. ఇప్పటికే అనేక అంశాలపై పోరాటాలు చేస్తూ క్షేత్రస్థాయిలోకి వెళ్తున్నం. మా పార్టీ నుంచి వెళ్లిన ఒకరిద్దరు ఎమ్మెల్యేలు తిరిగివచ్చిండ్రు. తెలంగాణలో మా పార్టీని ఎవరూ ఫినిష్ చేయలేరు.
భారతదేశంలో ఏ వ్యక్తయినా వ్యవస్థ కంటే గొప్పవారు కారనేది నా స్పష్టమైన అభిప్రాయం. నా సోదరి అయినా, నేనైనా లేదా మరే ఇతర వ్యక్తయినా సరే పార్టీ అనే సంస్థే ముఖ్యం. బీఆర్ఎస్ అనేది తెలంగాణను సాధించిన సంస్థ. దాని అధినేత కేసీఆర్. కేసీఆర్ ఆదేశాలతో ఐదుసార్లు ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన. వారసత్వ రాజకీయాలు అంటే నేను గెలువకపోయి ఉంటే నాకు మళ్లీ అవకాశం ఉండదు. కవిత ఎన్నికల్లో ఓడిపోయినా మళ్లీ ఎమ్మెల్సీగా పార్టీ ఆవకాశమిచ్చింది. ఆమె పార్టీని వీడి వెళ్లడానికి కారణాలు ఏమిటో ఆమెనే అడగాలి. మా ఆధినేత కేసీఆర్ తన జీవితాన్ని రాష్ట్రం కోసం అంకితం చేసిండ్రు. కుటుంబ బంధాలు, రాజకీయాలు వేర్వేరు. వ్యక్తిగత ఆశల కోసం సంస్థను తాకట్టు పెట్టడం సరికాదు. ఇక్కడ వ్యక్తిగత ఆకాంక్షలకు తావులేదు. మాది తెలంగాణను సాధించిన పార్టీ. మేం కేసీఆర్ నేతృత్వంలో తిరిగి అధికారంలోకి వస్తం.
అవును.. దేశ యువత నిరాశలో ఉన్నది. తప్పుడు హామీలిచ్చి మోసం చేసిన వారిపై కోపంతో ఉన్నది. రాజకీయ పార్టీలు సైతం వారి ఆకాంక్షలను గుర్తించడంలో విఫలమైనందునే వారు పోరాటానికి దిగుతున్నరు. ప్రజలు మార్పును, విభిన్నమైన పాలనను కోరుకుంటున్నరు. తమిళనాడులో రెండు ద్రవిడ పార్టీలను పక్కనబెట్టి కొత్తగా పార్టీ పెట్టిన విజయ్ను ఆదరించిండ్రు. అన్ని పార్టీలు ప్రస్తుత పరిణామాలను చూసి గుణపాఠం నేర్చుకోవాలి.
డీలిమిటేషన్ చేయాల్సిందే.కానీ దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగకుండా చూడాలి. జనాభా ప్రాతిపదికన లోక్సభ నియోజకవర్గాలను పునర్వవ్యవస్థీకరిస్తే జనాభాను నియంత్రించిన దక్షిణాది రాష్ర్టాలకు నష్టం జరుగుతది. అందుకే ప్రస్తుత పద్ధతిలో చేపట్టే ప్రక్రియను వ్యతిరేకిస్తున్నం. చిత్తశుద్ధి ఉంటే అన్ని రాష్ట్రాల్లోనూ అసెంబ్లీ స్థానాల సంఖ్య పెంచాలి. కానీ కేవలం పార్లమెంట్ స్థానాల పెంపుపై దృష్టి పెట్టడంలోని ఔచిత్యమేంది? తప్పకుండా మా వాటా మాకు దక్కాల్సిందే. బీజేపీ ఒకటి చెప్తూ ఆచరణలో విరుద్ధంగా వ్యవహరిస్తున్నది. తెలంగాణ ఏర్పాటు తర్వాత విభజన చట్టప్రకారం రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య పెంచాలి. కానీ 12 ఏండ్లు దాటినా కేంద్రంలో చలనం లేదు. వారికి అవసరం ఉన్నది కాబట్టి కశ్మీర్లో అసెంబ్లీ స్థానాలను పునర్వవ్యవస్థీకరించారు. తెలంగాణను మాత్రం విస్మరించారు. ఇదేం విధానం? కేంద్రం చేసిన చట్టానికే విలువ ఇవ్వకపోవడం ఎంతవరకు సమంజసం? డీలిమిటేషన్ బిల్లు పేరిట మహిళా రిజర్వేషన్ల బిల్లును తొక్కిపెట్టడం దారుణం..తెలంగాణలో స్థానిక సంస్థల్లో 50 శాతం రిజర్వేషన్లు అమలు చేసి చూపినం.
అప్పులను ఎప్పుడూ ఒంటరిగా చూడకూడదు. వాటిని రాష్ట్ర జీఎస్డీపీ లేదా జీడీపీ నిష్పత్తితో పోల్చిచూడాలి. తెలంగాణ అప్పు-జీఎస్ డీపీ నిష్పత్తి దేశంలోనే అత్యంత సురక్షితమైన పరిమితుల్లో ఉన్నది. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అప్పులను భరించగలదు. మేము ఉత్పాదక రంగాల్లో పెట్టుబడులు పెట్టినం. దేశ జనాభాలో తెలంగాణ కేవలం 2.7% మాత్రమే అయినా జాతీయ జీడీపీకి మన రాష్ట్రం అందిస్తున్న సహకారం 5.2%. ఇక ఉచితాల గురించి అంటారా.. బిసెట్లు, మంచినీళ్ల బాటిళ్లపై కూడా జీఎస్టీ చెల్లించే దేశం మనది. పేదరికం ఎకువగా ఉన్న మనలాంటి దేశంలో బలహీన వర్గాలను ఆదుకోవడం ప్రభుత్వాల కనీస బాధ్యత. పేదలకు మూడు పూటలా భోజనం అందకపోతే అది తీవ్రమైన అశాంతికి, చట్టవ్యతిరేకతకు దారితీస్తుంది. సంక్షేమం, అభివృద్ధి రెండూ సమపాళ్లలో ముందుకు వెళ్లడం ఎంతో ముఖ్యం.
కేసీఆర్ ‘రైతు బంధు’ కింద ఎకరానికి రూ. 10,000 ఇస్తుంటే, కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలోకి వస్తే రూ. 15,000 ఇస్తామని హామీ ఇచ్చింది. అలాగే ‘కల్యాణ లక్ష్మి’ కింద డబ్బుతో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పి, మొత్తం సుమారు 420 ఆచరణ సాధ్యం కాని హామీలతో ప్రజలను ఆకర్షించి మోసం చేసింది. అందుకే మేం ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.
సింగరేణిలో 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు అదృశ్యమనేది చిన్న విషయం. అసలైన పెద్ద కుంభకోణం వేరే ఉన్నది. కాంగ్రెస్ వచ్చాక ముఖ్యమంత్రి బావమరిది ఆధ్వర్యంలో టెండర్ రిగ్గింగ్ జరిగింది. సైట్ విజిటేషన్ సర్టిఫికెట్ అనే కొత్త నిబంధన తెచ్చి సుమారు రూ. 30,000 కోట్ల టెండర్లలో అక్రమాలు జరిగినయ్. ఈ పెద్ద సామ్ను బీజేపీ పట్టించుకోదు. రెవెన్యూ మంత్రి ఇండ్లపై ఈడీ దాడులు జరిగి రెండేండ్లయినా ఎలాంటి కేసు నమోదు కాలేదు. ఇకడే కాంగ్రెస్-బీజేపీ లాలూచీ బయటపడుతున్నది.
తెలంగాణ హైకోర్టు హైడ్రాను తొమ్మిది తలల రాక్షస పాము అని తీవ్రంగా తప్పుబట్టడాన్ని మేము నైతిక విజయంగా భావిస్తున్నం. ఎన్ఫోర్స్మెంట్ పేరుతో ప్రభుత్వం చేస్తున్న దౌర్జన్యాలకు ఇది సిగ్గుచేటు.
ఇదంతా కేవలం రాజకీయ దురుద్దేశంతో సృష్టించిన ప్రచారం మాత్రమే. 1952 నుంచి నేటి వరకు భారతదేశంలో ఏ ప్రభుత్వమైనా చట్టబద్ధమైన నిఘా పద్ధతుల ప్రకారమే నడుచుకుంటూ వస్తున్నది. ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం చీఫ్ సెక్రటరీ, హోమ్ సెక్రటరీ, డీజీపీతో కూడిన అధికారిక కమిటీ ఆమోదంతోనే ఇవన్నీ జరుగుతయ్. ఇందులోకి రాజకీయ నాయకుల పేర్లను అనవసరంగా లాగుతున్నరు.
దేశంలో ఈడీ, సీబీఐ, ఆదాయపు పన్ను శాఖ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను రాజకీయ ప్రత్యర్థులపై రాజకీయ ఆయుధాలుగా వాడుతున్నరు. 2024లో 15 ప్రాంతాల్లో ఈడీ దాడులు జరిగినయ్. నోట్లు లెక్కించే మిషన్లు ఇంట్లోకి తీసుకెళ్లినట్టు మీడియాలో వార్తలొచ్చినయ్. రెండేండ్లు జరిగినా ఈడీ కేసులు లేవు.. పురోగతి లేదు. దాడులు జరిగిన రెండు రోజులకే సదరు మంత్రి ఓ బడా పారిశ్రామికవేత్తను కలువగానే అంతా గప్చుప్ అయ్యింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల అంశంలో పదివేల కోట్ల స్కామ్ జరిగింది. సుప్రీంకోర్టు గ్రీన్ బెంచ్ జోక్యం చేసుకొని కేంద్ర సాధికార కమిటీని నియమించింది. ఆ కమిటీ కూడా పలు సూచనలు చేసినా ఇప్పటివరకు పురోగతి లేదు. దీనిపై ఈడీ ఎందుకు జోక్యం చేసుకోదు? అవినీతిపై మాట్లాడే ప్రధానమంత్రి ఈ అంశంపై ఎందుకు స్పందించరు? మదీ తెలంగాణ రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్ నడుస్తున్నదని అంటరు. కేంద్ర హోం మినిస్టర్ వచ్చి తెలంగాణను ఏటీఎంగా మార్చుకున్నారంటరు. కానీ చర్యలు మాత్రం తీసుకోరు. మరి దొంగలను ఎవరు పట్టుకోవాలి? హోం మినిస్టరే పట్టుకోకపోతే ఎట్లా?
కాళేశ్వరంపై వచ్చిన ఆరోపణల్లో ఆధారాలుంటే ఇప్పటికే జైలులో ఉండేవాళ్లం కదా? ఆరోపణల్లో ఏమాత్రం నిజం ఉన్నా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గానీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గానీ మాపై కఠినంగా వ్యవహరించేవి. కాంగ్రెస్-బీజేపీ కుమ్మకు రాజకీయాలు చేస్తున్నయ్. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎలాంటి విచారణకైనా మేము సిద్ధమే. కాళేశ్వరం బహుళ ప్రయోజనాల ప్రాజెక్టు. హైదరాబాద్కు తాగునీరు, పరిశ్రమలకు నీటి సరఫరా, తెలంగాణలోని సుమారు 40 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్న గొప్ప ప్రాజెక్టు కాళేశ్వరం. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రత్యర్థులు ఎంత దుష్ప్రచారం చేసినా వాస్తవాలు మారవు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన ఎస్సెల్బీసీ సొరంగ ప్రమాదంపై కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఎందుకు మౌనంగా ఉంటున్నది? నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎందుకు స్పందించలేదు? ఎనిమిది మంది చనిపోయినా ఎందుకు దృష్టిపెట్టలేదు?
మేము గతంలో ప్రాథమిక అంశాలపై దృష్టి పెట్టినం. మిషన్ భగీరథ, రైతుబంధు వంటి పథకాలను తెచ్చి దేశానికే ఆదర్శంగా నిలిచినం. కేంద్ర ప్రభుత్వమే మా పథకాలను కాపీ కొట్టింది. మేము మళ్లీ అధికారంలోకి వచ్చి సంక్షేమం, అభివృద్ధిని మరింత సమర్థవంతంగా అమలు చేస్తాము. దేశ యువత తమ హకుల కోసం ముందుకు వచ్చి ప్రభుత్వాలను జవాబుదారీగా నిలదీయడం చాలా సంతోషకరమైన పరిణామం అని చెప్పారు. ప్రభుత్వాలు, మంత్రులు తాము ప్రజలకు సేవకులుగా బాధ్యత వహించాలి. యువత చైతన్యం ప్రజాస్వామ్యానికి ఎంతో ఆరోగ్యకరం.
ప్రాంతీయ పార్టీలు జాతీయ స్థాయికి ఎదగడం తప్పు కాదు. తెలుగు సినిమాలు పాన్ ఇండియా అయినప్పుడు తెలుగు పార్టీలు ఎందుకు కాకూడదు? తెలంగాణ ఉద్యమ సమయంలో కాంగ్రెస్తో పొత్తు లేదా విలీనం గురించి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ,‘నాడు కాంగ్రెస్తో ఒప్పందం కుదరకపోవడానికి వారిపై సరైన నమ్మకం, గౌరవం లేకపోవడమే కారణం. తెలంగాణకు సొంత గొంతు ఉండాలనే ఉద్దేశంతోనే అది జరుగలేదు. ప్రస్తుతం మా మొదటి లక్ష్యం తెలంగాణలో మళ్లీ గెలువడమే’ అని తేల్చిచెప్పారు.
కేంద్రం ఇచ్చిన హామీలను (రైతుల ఆదాయం పెంపు, 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ, బులెట్ రైళ్లు, అందరికీ ఇండ్లు) ఏమాత్రం నెరవేర్చలేదు. దేశంలో అభివృద్ధి గురించి కాకుండా మతం, తిండి వంటి అంశాల చుట్టే చర్చలు నడిచేలా చేసిండ్రు. పూర్తి మెజారిటీ ఉన్న ప్రభుత్వాన్ని మోదీ సరార్ వృథా చేసింది.