Surekha Vani | సౌత్ సినీ ఇండస్ట్రీలో ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్టుగా గుర్తింపు పొందిన సురేఖా వాణి మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవల ‘నీరమ్’ సినిమా ప్రెస్మీట్లో పాల్గొన్న ఆమె సోషల్ మీడియాలో తనపై వస్తున్న ట్రోల్స్, రెండో పెళ్లిపై జరుగుతున్న ప్రచారం, సినిమాల్లో అవకాశాలు తగ్గాయనే ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు. సోషల్ మీడియాలో తాను, తన కుమార్తె సుప్రీత నాయుడుతో కలిసి చేసే పోస్టులపై వచ్చే విమర్శల గురించి మాట్లాడిన సురేఖా వాణి.. మొదట్లో ట్రోల్స్ను సీరియస్గా తీసుకున్నప్పటికీ ఇప్పుడు వాటిని పూర్తిగా పట్టించుకోవడం మానేశామని చెప్పారు.మనదేంటి.. నేనేంటి.. నాకేంటి అనేదే ఇప్పుడు నా ఆలోచన. నేను ఏం చేయాలనుకుంటానో అదే చేస్తాను. ఏ ఫోటో పోస్ట్ చేయాలనిపిస్తే అది పెడతాను. ఎలా ఫోటో దిగాలనిపిస్తే అలా దిగుతాను. ఇతరులు ఏమనుకుంటారో ఆలోచిస్తూ ఉంటే ముందుకు వెళ్లలేం అని ఆమె స్పష్టం చేశారు.
గత కొంతకాలంగా సురేఖా వాణి రెండో పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఆమె కుమార్తె సుప్రీత గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో “అమ్మకు పెళ్లి చేసిన తర్వాతే నేను పెళ్లి చేసుకుంటాను” అని చెప్పడంతో ఆ ప్రచారానికి మరింత ఊతమిచ్చింది. ఈ వార్తలపై స్పందించిన సురేఖా వాణి.. ప్రస్తుతం తనకు రెండో పెళ్లి చేసుకోవాలనే ఆలోచనే లేదని తేల్చిచెప్పారు. నాకు పెళ్లి చేసుకోవాలనే ఆలోచన ఉంటే ఇన్ని సంవత్సరాలు ఎందుకు వేచి ఉండేదాన్ని? ప్రస్తుతం అలాంటి ఆలోచన లేదు. ఇక ముందు కూడా ఉండదనుకుంటున్నాను. మా అమ్మాయికి పెళ్లి చేసే వయసు వచ్చింది. ఇప్పుడు నేను పెళ్లి చేసుకోవడం గురించి ఎందుకు ఆలోచిస్తాను? అయితే మీడియా మాత్రం నాకు చాలా కాలం క్రితమే పెళ్లి చేసేసింది అంటూ నవ్వుతూ వ్యాఖ్యానించారు.
ఇటీవల సినిమాల్లో తక్కువగా కనిపిస్తున్నారని ప్రశ్నించగా, తనకు ఎందుకు పాత్రలు ఇవ్వడం లేదో దర్శక నిర్మాతలను అడగాలని సురేఖా వాణి సరదాగా సమాధానం ఇచ్చారు. అలాగే తన కుమార్తె సుప్రీతకు వచ్చే కథలన్నీ తాను కూడా వింటానని, అయితే వాటిలో నటించాలా వద్దా అనేది పూర్తిగా సుప్రీత నిర్ణయమేనని వెల్లడించారు. ట్రోల్స్పై ధైర్యంగా స్పందించడం, రెండో పెళ్లి వార్తలకు ఒకే మాటలో చెక్ పెట్టడం, సినిమాల్లో అవకాశాల గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో సురేఖా వాణి చేసిన ఈ కామెంట్స్ మరోసారి చర్చనీయాంశంగా మారాయి.