రాయపోల్ : వర్షాకాలం ( Rains ) నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు పాటించాలని తొగుట సీఐ షేక్ లతీఫ్ ( CI Latheef ) సూచించారు. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా వరద నీరు ప్రవహిస్తున్న రోడ్లు, వాగులను ఎట్టి పరిస్థితుల్లోనూ దాటేందుకు ప్రయత్నించవద్దని అన్నారు.
ఆలస్యమైనా ప్రాణ భద్రతే ముఖ్యమని పేర్కొన్నారు. వర్షం సమయంలో పాత చెట్లు, ప్రమాదకర ప్రాంతాల వద్ద ఆశ్రయం పొందవద్దని, తడి రోడ్లపై వాహనాలను అధిక వేగంతో నడపవద్దని కోరారు. నీటి గుంతలు లోతుగా ఉండే అవకాశం ఉన్నందున ముందుగా పరిస్థితిని పరిశీలించిన తర్వాతే ప్రయాణం కొనసాగించాలని తెలిపారు. విద్యుత్ స్తంభాలు , తెగిపోయిన విద్యుత్ తీగల సమీపంలో నీరు నిల్వ ఉంటే వాటికి దూరంగా ఉండి వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని కోరారు.
భారత వాతావరణ శాఖ, ట్రాఫిక్ పోలీసులు జారీ చేసే హెచ్చరికలను తప్పనిసరిగా పాటించాలని, అత్యవసరమైతే తప్ప వర్షాల సమయంలో అనవసర ప్రయాణాలు చేయవద్దని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో 100 , వాట్సాప్ హెల్ప్లైన్ 87126 67100కు సంప్రదించి పోలీసుల సహాయాన్ని పొందాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.