హదరాబాద్: డెల్టా ప్లస్ వేరియంట్ పట్ల అప్రమత్తంగా ఉన్నామని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ సంచాలకులు శ్రీనివాసరావు అన్నారు. డెల్టా వేరియంట్ కన్నా డెల్టా ప్లస్ ప్రమాదకరమనే ఆధారాలు లేవని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటివరకు డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు నమోదవలేదని వెల్లడించారు. డెల్టా ప్లస్ వేరియంట్ ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా వైద్యారోగ్య శాఖ కోర్టుకు నివేదిక సమర్పించింది. కరోనా మూడో దశను ఎదుర్కొనేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. నెల రోజుల్లో ప్రభుత్వ దవాఖానల్లో పడకలన్నింటికీ ఆక్సిజన్ సౌకర్యం కల్పిస్తామన్నారు.
రాష్ట్రంలో ఇప్పటివరకు 1.14 కోట్ల కరోనా డోసులు పంపిణీ చేశామని తెలిపారు. ఇందులో 16.39 లక్షల మందికి రెండు డోసులు ఇచ్చామని, 81.42 లక్షల మందికి ఒక డోసు వ్యాక్సినేషన్ పూర్తయిందని వివరించారు. మరో 1.75 కోట్ల మందికి వ్యాక్సిన్లు ఇవ్వాల్సి ఉందని చెప్పారు. విద్యా సంస్థల్లో 1.40 లక్షల మంది సిబ్బందికి వ్యాక్సిన్లు ఇచ్చామన్నారు. విదేశాలకు వెళ్లే విద్యార్థుల కోసం 11 కేంద్రాల్లో టీకాలు పంపిణీ చేశామని పేర్కొన్నారు. సరాసరి రోజుకు 1.12 లక్షల కరోనా పరీక్షలు చేస్తున్నామని తెలిపారు. కరోనా పాజిటివిటీ రేటు 0.78 శాతానికి తగ్గింది వెల్లడించారు. ప్రైవేటు దవాఖానల్లో చికిత్సలు, గరిష్ఠ ధరలపై జీవో ఇచ్చామన్నారు. జీవో ఉల్లంఘిస్తే ప్రైవేటు వైద్య కేంద్రాలపై చర్యలు తీసుకుంటాని వివరించారు.