హైదరాబాద్ : కరోనా కట్టడికి రాష్ర్ట ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి అని తెతెలంగాణ ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాస్ రావు స్పష్టం చేశారు. అయితే కరోనా నివారణకు వచ్చే మూడు, నాలుగు వారాలు కీలకమని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. మే నెలఖారు వరకు అందరూ జాగ్రత్తలు పాటించాలన్నారు. మాస్కు తప్పనిసరిగా ధరించాలని విజ్ఞప్తి చేశారు. కోఠిలోని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ కార్యాలయంలో శ్రీనివాస్ రావు మీడియాతో మాట్లాడారు.
ఇక నుంచి మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వచ్చేది పెళ్లిళ్లు, పండుగల సీజన్ కాబట్టి మరింత జాగ్రత్తగా ఉండాలన్నారు. జాగ్రత్తల విషయంలో ప్రజల్లో అలసత్వం పనికి రాదు అన్నారు. రాష్ర్టంలో ఇప్పటి వరకు మొత్తం 45 లక్షల మందికి టీకా ఇచ్చామన్నారు. కరోనా నివారణ కోసం ప్రజలు సంపూర్ణంగా సహకరిస్తున్నారు అని తెలిపారు.
గత వారం రోజుల నుంచి రాష్ర్టంలో పరిస్థితులు మెరుగుపడుతున్నాయి. రాష్ర్టంలో కేసుల్లో స్థిరత్వం ఉందన్నారు. పాజిటివ్ కేసుల్లో 80 -90 శాతం వరకు ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం రాదు. కేవలం 10 శాతం మందికే ఆస్పత్రికి వెళ్లాల్సిన అవసరం వస్తుందన్నారు. ప్రస్తుతం రాష్ర్టంలో 95 శాతం వరకు రికవరీ రేటు ఉందన్నారు. మొదటి దశలో దేశంలోనే అత్యధికంగా 99.5 శాతం రికవరీ రేటు మనది అని పేర్కొన్నారు.
కరోనా లక్షణాలు లేకుండానే పరీక్షల కోసం వస్తున్నారు. అలా వచ్చి సగం మంది కరోనాను అంటించుకుని వెళ్తున్నారు. కొందరు వారంలో రెండుసార్లు పరీక్షలకు వస్తున్నారు. ఈ క్రమంలో నిజంగా పరీక్షలు, చికిత్స కావాల్సిన వారికి అందడం లేదు. కరోనాకు పరీక్షలు, చికిత్సకు సంబంధించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. లక్షణాలు కనిపించినప్పుడే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
రాష్ర్టంలో 50 వేలకు పైగా పడకలు ఏర్పాటు చేశామని తెలిపారు. 18 వేలకు పైగా ఆక్సిజన్ పడకలు, 10 వేలకు పైగా ఐసీయూ పడకలు ఉన్నాయన్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో పడకలు పెంచేందుకు ప్రయత్నిస్తున్నామని స్పష్టం చేశారు. ఆక్సిజన్, పడకలు, ఔషధాల విషయంలో మనం మెరుగైన స్థితిలో ఉన్నామని తెలిపారు. అవసరం లేకుండానే ప్రజలు పరీక్షలు, ఆస్పత్రికి వెళ్లడం వల్లే కృత్రిమ కొరత ఏర్పడుతుందన్నారు.
ఏడాదిన్నరగా ప్రజారోగ్య సిబ్బంది అలుపెరగని పోరాటం చేస్తున్నారు. ఈ సంక్షోభ సమయంలోనూ తమ సిబ్బంది విధులకు హాజరవుతున్నారు. కుటుంబ, వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసి ప్రజలకు సేవ చేస్తున్నారు.
సీఎం కేసీఆర్కు కరోనా పాజిటివ్ వచ్చినా తమకు అమూల్యమైన సూచనలు చేస్తూ కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటున్నారు అని తెలిపారు. సీఎం కేసీఆర్ పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. గంట గంటకు సీఎం వివరాలు తెలుసుకుంటూనే ఉన్నారు అని శ్రీనివాస్ రావు వెల్లడించారు.
ఇవికూడా చదవండి..