భువనేశ్వర్ : చార్టర్డ్ అకౌంటెంట్ పరీక్షలకు సిద్ధమవుతున్న వేళ అతనికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. తనకు కరోనా సోకింది కదా అని అలసత్వం వహించలేదు. కొవిడ్ వార్డులోనూ పుస్తకాలతో కుస్తీ పట్టాడు. కానీ సీఏ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ సంఘటన ఒడిశా గంజాం జిల్లాలోని బెర్హంపూర్లో వెలుగు చూసింది.
బెర్హంపూర్కు చెందిన ఓ విద్యార్థి సీఏ పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. ఇటీవలే ఆ యువకుడికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ కావడంతో బెర్హంపూర్లోని ఎంకేసీజీ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలోని కొవిడ్ వార్డులో చేరి చికిత్స పొందుతున్నాడు. ఆ కొవిడ్ వార్డును గంజాం జిల్లా కలెక్టర్ విజయ్ కులంగే సందర్శించారు. ఈ సమయంలో సదరు విద్యార్థి పుస్తకాలు చదువుతున్నాడు. చుట్టూ ఉన్న పుస్తకాలు, క్యాలికులేటర్ చూసి కలెక్టర్ ఆశ్చర్యపోయాడు. విషయం ఏంటి అని ఆరా తీయగా, తాను సీఏ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్నాని కలెక్టర్కు విద్యార్థి తెలిపాడు. మొత్తానికి ఆ విద్యార్థి ఫోటోను తన కెమెరాలో బంధించి ట్వీట్ చేశారు కలెక్టర్. మీ అంకితభావం మీ బాధను మరిచిపోయేలా చేస్తుందని కలెక్టర్ అన్నారు.
సీఏ పరీక్షలు వాయిదా
అయితే సీఏ ఇంటర్, ఫైనల్ పరీక్షలు వాయిదా పడ్డాయి. కరోనా ఉధృతి, విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా(ఐసీఏఐ) ప్రకటించింది. పరీక్షలు నిర్వహించడానికి కనీసం 25 రోజుల ముందు తేదీలు ప్రకటిస్తామని వెల్లడించింది. షెడ్యూల్ ప్రకారం మే 21న ఈ పరీక్షలు జరగాల్సి ఉన్నది.
ఇవికూడా చదవండి..