సిద్దిపేట: రాష్ట్రంలో తాగునీటితోపాటు సాగునీరు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్దే నని మంత్రి హరీశ్ రావు అన్నారు. టీఆర్ఎస్ కంటే ముందు పదేండ్లు కాంగ్రెస్ అధికారంలో ఉండి ప్రజలకు చేసిందేమిటని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలకు మీరిచ్చింది ఆత్మహత్యలు, ఆకలి చావులు, కాలిపోయిన మోటర్లు అని విమర్శించారు. జిల్లాలోని వర్గల్ మండలం హల్దీ వాగువద్ద గోదావరి జలాలకు మంత్రి హరీశ్ రావు ప్రత్యేక పూజలు చేశారు. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే మదన్ రెడ్డి, శేరి సుభాష్ రెడ్డితో కలిసి నాచగిరి శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకుని రథోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం యాసంగి పంటల్లో 53 వేల ఎకరాల్లో వరిసాగు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా గోదావరి జలాలు నాచగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి పాదాలు కడుగుతూ పోతుంటే.. ఇది కూడా జరగలేదని అవాస్తవాలు మాట్లాడితే ఎలా అని ఆగ్రహం వ్యక్తంచేశారు.
సిద్దిపేటలోని వెల్నెస్ సెంటర్లో నిర్మించిన స్వచ్ఛ బడిని మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. సిద్దిపేట వెల్నెస్ సెంటర్ దక్షిణ భారతదేశంలోనే రెండోదని చెప్పారు. స్వచ్ఛతపై ప్రతి రోజు ప్రజలకు స్వచ్ఛ బడి ద్వారా అవగాహన కల్పిస్తామని వెల్లడించారు.
ఘన ద్రవ్యాల నిర్వహణతో పాటు ఆరోగ్య సమాజ నిర్మాణం కోసం స్వచ్ఛ బడిని నిర్మించారు. ఇందులో చెత్త సేకరణ, చెత్తను తడి, పొడి, హానికరమైన చెత్తగా వేరు చేయడం, చెత్తతో ఇండ్లలోనే ఎరువుల తయారీపై ఈ పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కల్పించనున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..