హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వ పరిధిలోని వివిధ శాఖలు, సంస్థలలో ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించే ఎంపిక ప్రక్రియలో తెలుగు భాషకు ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే ఉద్యోగాల ఎంపికలో హిందీ భాషను బలవంతంగా రుద్దడం వల్ల తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు తీరని అన్యాయం జరుగుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
రాజ్యాంగంలోని 8 వ షెడ్యూల్ లో తెలుగు భాష సహా 22 ప్రాంతీయ భాషలను అధికారికంగా గుర్తించిన విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని వినోద్ కుమార్ సూచించారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల ఎంపికలో జోనల్ విధానాన్ని పునరుద్ధరించాలని ఆయన డిమాండ్ చేశారు. గత కొంత కాలంగా జోనల్ ఎంపిక విధానాన్ని పక్కన పెట్టారని, ఇది సత్సంప్రదాయం కాదని ఆయన తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం అవలంభిస్తున్న ఎంపిక విధానం ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం కలిగించేదిగా ఉందని వినోద్ కుమార్ అభిప్రాయ పడ్డారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల ఎంపికలో హిందీని రుద్దడం వల్ల తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు ఆశనిపాతంగా, గొడ్డలిపెట్టుగా మారిందని ఆయన పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఇండియన్ రైల్వేస్, పోస్టల్, పబ్లిక్ వర్క్స్, సెంట్రల్ సెక్రటేరియట్, పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు, కంపెనీలు, రక్షణ శాఖ, సెంట్రల్ యూనివర్సిటీలు, పరిశోధన సంస్థలు, ఐ.ఐ.టీ.లు, నిట్, కేంద్రీయ, నవోదయ విద్యాలయాలు, ఎయిర్ పోర్ట్ అథారిటీ సహా పలు సంస్థలలో ఉద్యోగాల ఎంపికలో హిందీ బదులు తెలుగును కూడా పరిగణనలోకి తీసుకోవాలని వినోద్ కుమార్ కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటనను విడుదల చేశారు.
ఇవి కూడా చదవండి..
చెరువులో చిరుతపులి మృతదేహం లభ్యం
72 టీఎంసీలకు చేరిన శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్
కరోనాతో చనిపోయింది 4 లక్షలు కాదు.. 40 లక్షల మంది!
భారీగా పతనమైన అదానీ షేర్స్…కారణం ఇదే..!
రాగల మూడు రోజులు తెలంగాణకు వర్ష సూచన