రాజన్న సిరిసిల్ల, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ): ‘బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు చీకటి దోస్తులు. బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ను గెలిపించేందుకు కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీ డమ్మీ అభ్యర్థిని నిలబెట్టింది. బండి మత రాజకీయాలు తప్ప అభివృద్ధి మాట ఎత్తడు’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు మండిపడ్డారు. వంద రోజుల్లో హామీలన్నీ నెరవేరుస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు ఇన్ని రోజులు అయినా హామీలు అమలుచేయకపోవడంపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. కేసీఆర్ పాలనకు, ఈ ప్రభుత్వ పాలనకు తేడాను ప్రజలు తెలుసుకున్నారు. రైతులు ప్రభుత్వంపై తిరుగుబాటుకు సిద్ధమయ్యారు’ అని పేర్కొన్నారు. బుధవారం సిరిసిల్లలోని తెలంగాణభవన్లో సిరిసిల్ల నియోజకవర్గంలోని వీర్నపల్లి, ఎల్లారెడ్డిపేట మండలాల క్లస్టర్ స్థాయి పార్టీ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. కేసీఆర్ నాయకత్వంలో దేశానికే ఆదర్శంగా తెలంగాణలో అభివృద్ధి చేసుకున్నామని, వ్యవసాయాన్ని పండుగలా మార్చుకున్నామని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వంలో ప్రతి ఇంటికి ప్రభుత్వ ఫలాలు అందాయని, బీఆర్ఎస్కు ప్రజల్లో ఆదరణ ఉందని, గత అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ పార్టీకి ఓటు వేయలేదని ప్రజలు బాధపడుతున్నారని చెప్పారు.
తెలంగాణ ప్రజల కోసం కేసీఆర్ ప్రజల్లోకి వస్తున్నారని కేటీఆర్ చెప్పారు. తెలంగాణవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి బయలు దేరారని తెలిపారు. రోడ్షోలో తమ నాయకుడిని చూసి రైతులు, ప్రజలు నేరుగా కలిసి తమ బాధలు చెప్పుకుంటున్నారని పేర్కొన్నారు. ‘మళ్లీ కేసీఆర్’ రావాలంటూ తమ ఆకాంక్షను తెలుపుతున్నారని చెప్పారు. బీఆర్ఎస్ అత్యధిక సీట్లు గెలుచుకుంటుందని సర్వేలు చెప్తున్నాయని, ప్రతి కార్యకర్త రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి పార్టీ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ను గెలిపించాలని కోరారు. అధికారంలో ఉన్నపుడు లబ్ధిపొందిన కొందరు నాయకులు కష్టకాలంలో కేసీఆర్ను వీడిపోతున్నారని మండిపడ్డారు. గ్రామీణ స్థాయిలో చురుకైన కార్యకర్తలను తయారు చేసుకుందామని పిలుపునిచ్చారు. పనిచేసే ప్రతి కార్యకర్తకు తాను వెన్నంటి ఉంటానని భరోసా ఇచ్చారు. సమావేశంలో టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, రాష్ట్ర నాయకుడు చీటి నర్సింగారావు, జడ్పీటీసీ సభ్యుడు చీటి లక్ష్మణ్రావు, కార్యకర్తలు పాల్గొన్నారు.