హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): శ్రీశైలం ప్రాజెక్టు జలకళను సంతరించుకొన్నా రేవంత్ సర్కార్ మాత్రం పూర్తిస్థాయి విద్యుదుత్పత్తి చేపట్టడంలో తాత్సారం చేస్తున్నది. ఏపీకి మేలు కోసమే తెలంగాణను పణంగా పెడుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా కరెంట్ కోతలు విధిస్తూ శ్రీశైలం నుంచి మొక్కుబడిగా విద్యుదుత్పత్తిని కొనసాగిస్తున్నది.
శ్రీశైలం రిజర్వాయర్ నుంచి తెలంగాణకు 900 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం ఉన్నా, కేవలం 100 మెగావాట్లనే ఉత్పత్తి చేస్తూ చోద్యం చూస్తున్నది. ప్రాజెక్టు నీటినిల్వ సామర్థ్యం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 870 అడుగులకు చేరుకొన్నది. 834 అడుగులకు చేరుకోగానే, పూర్తిస్థాయి విద్యుదుత్పత్తిని చేపట్టే అవకాశం ఉన్నా, రేవంత్ సర్కార్ మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నది. పోతిరెడ్డిపాడు ద్వారా ఏపీ నీటి తరలింపు అవకాశం కోసమే రేవంత్ సర్కార్ తెలంగాణను పణంగా పెట్టి విద్యుదుత్పత్తి చేపట్టడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
వారం రోజులుగా కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుండగా, ఎగువ నుంచి జూరాలకు, అక్కడి నుంచి శ్రీశైలం రిజర్వాయర్కు భారీగా వరద ప్రవాహం తరలివస్తున్నది. శ్రీశైలం రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 143 టీఎంసీలకు చేరుకున్నది. గత వారమే దాదాపు 100 టీఎంసీలు జలాలు వచ్చి చేరాయి. మరో 72 టీఎంసీల జలాలు వస్తే ప్రాజెక్టు పూర్తిస్థాయికి చేరుకుంటుంది. ఆ తర్వాత గేట్లను తెర చి దిగువకు జలాలను విడుదల చేయాల్సి ఉంటుంది.
మరోవైపు దిగువన నాగార్జునసాగర్ పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 156 టీఎంసీల నీటి నిల్వ ఉన్నది. శ్రీశైలం నుంచి జలాలను విడుదల చేసినా అవి సాగర్కే చేరుకుంటాయి. అక్కడ నిల్వ చేసుకొనే వెసులుబాటే కాదు సాగు అవసరాలు కూడా తీర్చుకునే అవకాశం కూడా ఉన్నది. అదీగాక ఎగువ నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు మరో వారంపాటు ప్రవాహాలు కొనసాగుతాయని తెలుస్తున్నది. పూర్తిస్థాయిలో 900 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేయడం వల్ల ప్రభుత్వానికి రోజుకు దాదాపు రూ.200 కోట్ల మేర ఆదా అయ్యే అవకాశమూ ఉన్నది.
అయినా కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం శ్రీశైలం నుంచి విద్యుదుత్పత్తిని మొక్కుబడిగానే కొనసాగిస్తున్నది. బుధవారం రోజున 2.09 మిలియన్ యూనిట్లు అంటే దాదాపు 84 మెగావాట్లు, గురువారం 3.3మిలియన్ యూనిట్లు అంటే దాదాపు130 మెగావాట్లను మాత్రమే ఉత్పత్తి చేసింది. మరోవైపు కోట్లాది రూపాయలు వెచ్చిస్తూ బహిరంగ మార్కెట్లో దాదాపు 5,000 మెగావాట్ల విద్యుత్తును కొనుగోలు చేస్తున్నది.
సాగు, తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు మొత్తంగా కలుపుకొని 405 టీఎంసీల వినియోగ లక్ష్యంతో నాగార్జునసాగర్ ప్రాజెక్టును చేపట్టారు. సాగర్ ప్రాజెక్టు అవసరాలు తీర్చేందుకు సరిపడా నీటిని నిల్వ చేసుకోవడం కోసమే శ్రీశైలం రిజర్వాయర్ను నిర్మించారు. శ్రీశైలం నుంచి విద్యుదుత్పత్తిని చేస్తూ, ఆ
విధంగా 280 టీఎంసీలను సాగర్కు విడుదల చేయాల్సి ఉంటుంది. అదీగాక శ్రీశైలం రిజర్వాయర్ 834 అడుగుల వరకు చేరుకోగానే, పూర్తిస్థాయి విద్యుదుత్పత్తిని చేపట్టాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేకంగా జీవో 34ను సైతం విడుదల చేసింది.
ఆ మేరకు అనేక సందర్భాల్లో విద్యుదుత్పత్తిని చేపట్టారు. కానీ, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం విద్యుదుత్పత్తి చేపట్టకుండా చోద్యం చూస్తున్నది. ఏపీ నీటి ప్రయోజనాల కోసమేనని స్పష్టంగా తెలిసిపోతున్నది. పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటరీ సిస్టమ్ (పీఆర్పీ) పనిచేసేందుకు శ్రీశైలం రిజర్వాయర్ 854 అడుగుల వద్దకు నీటిమట్టం చేరుకోవాలనే ఉద్దేశంతోనే విద్యుదుత్పత్తిపై రేవంత్ సర్కార్ నిర్లక్ష్యం చూపుతున్నదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
పోతిరెడ్డిపాడు నుంచి జలాలను ఏపీ తరలించేందుకు వీలుగా రిజర్వాయర్లో నీటినిల్వ మట్టాన్ని మెయింటెయిన్ చేయడం కోసమే సాగదీస్తున్నదని తెలుస్తున్నది. గతంలో ఇదే విషయమై ఏపీకి బోర్డు లేఖలు రాయడం, కేఆర్ఎంబీ (కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు) సైతం లెవల్ మెయింటెయిన్ చేయాలని ఆదేశించింది. ప్రస్తుతం ఏపీకి సహకరించేందుకు తెలంగాణ ప్రభుత్వమే విద్యుదుత్పత్తిని నిలిపివేసిందని తెలిసిపోతున్నది.
పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటరీ నుంచి కృష్ణాజలాల మళ్లింపును ఏపీ సర్కార్ అప్పుడే ప్రారంభించింది. శ్రీశైలం డ్యామ్ పూర్తిస్థాయి నీటి నిల్వమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 870 ఫీట్లకు చేరుకొన్నది. ఇదే తడవుగా ఏపీ పోతిరెడ్డిపాడు నుంచి పెన్నా బేసిన్కు కృష్ణాజలాల మళ్లింపును చేపట్టింది. గురువారం
ఉదయం పోతిరెడ్డిపాడుకు చెందిన 5, 6వ నంబర్ గేట్లను ఎత్తి దిగువకు నీటి మళ్లింపును చేపట్టింది. ప్రస్తుతం 4,000 క్యూసెకుల నీటిని తరలిస్తుండగా, రెండుమూడు రోజుల్లో మరింత పెంచే అవకాశం ఉన్నదని అధికార వర్గాలు చెప్తున్నాయి. దీనికి కేఆర్ఎంబీ కూడా ఎలాంటి అనుమతులు ఇవ్వకపోవడం గమనార్హం.
ఇండెంట్లు, అనుమతులు లేకుండా ఏపీ నీటి మళ్లింపును చేపట్టిన ఏపీ సర్కార్ మరోవైపు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకే హుకుం జారీ చేస్తున్నది. ఉన్నపళంగా కేవలం 2026-27 నీటి సంవత్సరానికి శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టుల నుంచి నీటి వి నియోగానికి సంబంధించిన అంశంపైన మాత్రమే మీటింగ్ ఏర్పాటు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నది. ఈ మేరకు కేఆర్ఎంబీ చైర్మన్కు ఏపీ జలవనరుల శాఖ స్పెషల్ సీఎస్ తాజాగా లేఖ రాశారు. ఎల్ నినో ముప్పు ఉన్నదని, ఆగస్టు రెండో వారం తర్వాత వరదలు వచ్చే పరిస్థితి ఉండదని, నీటిని జాగ్రత్తగా వాడుకోవాల్సిన అవసరం ఉంటుందని, ఈ నేపథ్యంలో ప్రాజెక్టుల నుంచి నీటిని తరలించేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఏపీ బోర్డును కో రింది. ఈ సీజన్లో సాధారణం కన్నా తకువ వ ర్షాలుంటాయన్న అంచనాలున్నాయని, శ్రీశైలం ప్రాజెక్టుకు వరద కూడా తకువే ఉన్నదని, కానీ ప్రస్తుతం ప్రాజెక్టులో నీటి నిల్వలు పెరుగుతున్నాయని తెలిపింది. ఈ నేపథ్యంలో సింగిల్ పాయింట్ ఎజెండాగా తక్షణమే మీటింగ్ ఏర్పాటు చేయాలని బోర్డును ఏపీ డిమాండ్ చేసింది. కానీ అనుమతులు ఇవ్వకముందే నీటి మళ్లింపు చేపట్టింది.