(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్ పాలన నాణ్యతలేమికి కేరాఫ్గా మారింది. రూ. వేల కోట్లతో నిర్మిస్తున్న రోడ్లు, వంతెనలు, ఎక్స్ప్రెస్ హైవేలు, ఫ్లై ఓవర్లు, రైల్వే బ్రిడ్జిలు, వాటర్ ట్యాంకులు పేకమేడల్లా కూలిపోతున్నాయి. మొన్న ముంబై-పుణె ఎక్స్ప్రెస్ హైవే.. నిన్న నాందేడ్-లాతూర్ ఫ్లైఓవర్ ప్రమాదం.. నేడు రూ. 4,700 కోట్ల వ్యయంతో నిర్మించిన లక్నో-కాన్పూర్ ఎక్స్ప్రెస్వేలో బయటపడ్డ డొల్లతనం.. ‘డబుల్’ ఇంజిన్ సర్కారు నాసిరకపు పాలనకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నాయి. బీజేపీపాలిత రాష్ర్టాల్లో ఇలాంటి ‘నాణ్యతలేమి’ ప్రమాదాలు నిత్యకృత్యంగా మారడం విస్మయానికి గురి చేస్తున్నది. డబుల్ ఇంజిన్ ప్రభుత్వ పాలన ఉన్న రాష్ర్టాల్లో గడిచిన ఏడాది వ్యవధిలో జరిగిన ప్రమాదాల్లో కొన్ని ఇలా ఉన్నాయి.
ఎప్పుడు: జూలై 9, 2026
ఎక్కడ: మహారాష్ట్ర
ఏం జరిగింది: నాందేడ్-లాతూర్ను కలుపుతున్న హైవేపై నిర్మించిన ఓ ఫ్లై ఓవర్ ఇటీవలి వర్షానికి పూర్తిగా దెబ్బతిన్నది. ఫ్లై ఓవర్ బ్రిడ్జిలోని ఒకవైపు భాగం కూలి సిమెంట్ కాంక్రీటులోపల ఉన్న మట్టి బయటకు వరదలా రావడం స్థానికులను కలవరపరిచింది.
తొలి వర్షానికే తాళలేక!

ఎప్పుడు: జూలై 6, 2026
ఎక్కడ: మహారాష్ట్ర
ఏం జరిగింది: రూ. 6,695 కోట్లతో ఇటీవల నిర్మించిన ముంబై-పుణె ఎక్స్ప్రెస్వే మిస్సింగ్ లింక్ను మూడు నెలల కిందట ప్రారంభించారు. అయితే, నైరుతిలో తొలి వర్షానికి ఈ ఎక్స్ప్రెస్ హైవేపై గుంతలు పడటం రోడ్డు నాణ్యతా ప్రమాణాలపై అనుమానాలను పెంచింది.

ఎప్పుడు: జూలై 4, 2026
ఎక్కడ: బీహార్
ఏం జరిగింది: సమస్తిపూర్ జిల్లాలో గంగా నది మీదుగా నిర్మిస్తున్న బ్రిడ్జి ఐరన్ స్లాబ్ కూలిపోయింది. ఈ ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

ఎప్పుడు: జూన్ 1, 2026
ఎక్కడ: గుజరాత్
ఏం జరిగింది: ఆనంద్ జిల్లాలో నిర్మాణంలో ఉన్న ఓ రైల్వే ఓవర్బ్రిడ్జి కూలిపోయింది. నాణ్యతాలోపాలే దీనికి కారణమని తెలిసింది.

ఎప్పుడు: మే 29, 2026 ఎక్కడ: యూపీ
ఏం జరిగింది: హమీర్పూర్లో బేట్వా నది మీద నిర్మిస్తున్న ఓ వంతెన నాణ్యతాలోపాల కారణంగా కూలిపోయింది. ఈ ఘటనలో ఆరుగురు మరణించారు.

ఎప్పుడు: మే 3, 2026
ఎక్కడ: బీహార్
ఏం జరిగింది: భాగల్పూర్లోని గంగానది మీద నిర్మించిన విక్రమ్శిల బ్రిడ్జి మధ్యభాగం అమాంతం కూలి నదిలోకి పడిపోయింది. దీంతో భారీ ట్రాఫిక్ ఏర్పడింది. పలువురికి గాయాలయ్యాయి.

ఎప్పుడు: జనవరి 21, 2026
ఎక్కడ: గుజరాత్
ఏం జరిగింది: సూరత్ జిల్లాలో 33 గ్రామాలకు రక్షిత మంచినీరు అందించే ఉద్దేశంతో రూ. 21 కోట్లతో ఓ వాటర్ ట్యాంకు నిర్మించారు. అయితే, ప్రారంభానికి ముందే ఆ ట్యాంకు కూలిపోయింది.

ఎప్పుడు: జూలై 9, 2025
ఎక్కడ: గుజరాత్
ఏం జరిగింది: వడోదరా జిల్లాలో గంభీర వంతెన కూలిపోయింది. ఈ ఘటనలో 11 మంది మృతి చెందారు.