గీసుగొండ, ఏప్రిల్ 24 : ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీలు బోగస్ అని ప్రజలకు అర్థమైందని, ఆ పార్టీపై వ్యతిరేకత మొదలైందని మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. బుధవారం గ్రేటర్ వరంగల్ 15వ డివిజన్ గొర్రెకుంట గ్రామంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నాలుగు నెలలైనా హామీలను అమలు చేయలేదని విమర్శించారు. గతంలో కేసీఆర్ పాలన ఎలా ఉండేది.. ప్రస్తుతం కాంగ్రెస్ పాలన ఎలా ఉందో ప్రజలకు వివరించి ఓట్లు అడగాలని సూచించారు. అలాగే మతం పేరుతో దేశంలో బీజేపీ విషం చిమ్ముతున్నదన్నారు. ఆగస్టు 15న రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ మరో కుట్రకు తెరలేపినట్లు వివరించారు.
పార్లమెంటు ఎన్నికల్లో ఓట్లు దండుకునేందుకు రుణమాఫీ నాటకం ఆడుతున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ హామీలను నమ్మి మళ్లీ ప్రజలు మోసపోవద్దని కోరారు. గ్రామ స్థాయిలో బూత్ లెవల్ కమిటీలు వేసుకొని రోజు 50 మందిని కలుస్తూ ప్రచారం చేయాలని కార్యకర్తలకు సూచించారు. 15వ డివిజన్ పరిధిలో ఉన్న గ్రామాల్లో ఈ ఎన్నికల్లో మెజార్టీ వచ్చే గ్రామాల నాయకులకే కార్పొరేటర్ టికెట్ ఇస్తానని తెలిపారు. బీఆర్ఎస్ అభ్యర్థి సుధీర్కుమార్ను గెలిపిస్తే మన ప్రాంతానికి న్యాయం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి కావ్య, బీజేపీ అభ్యర్థి అరూరి రమేశ్ బీఆర్ఎస్ పార్టీని మోసం చేశారని ఆరోపించారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు లవ్రాజు, డీసీసీబీ డైరెక్టర్ దొంగల రమేశ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చింతం సదానందం, సుంకరి శివకుమార్, గోలి రాజయ్య, చిన్నస్వామి, రవీందర్, చిన్ని, జడ్పీటీసీ పోలీసు ధర్మారవు, మండలాధ్యక్షుడు వీరగోని రాజ్కుమార్ పాల్గొన్నారు.