యాదాద్రి భువనగిరి, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ) : ‘చౌటుప్పల్కు ఫ్లోరైడ్ రిసెర్చ్ సెంటర్ను కేంద్రం ఇచ్చినట్టే ఇచ్చి తన్నుకుపోయింది. ప్రపంచంలోనే అత్యధిక శాతం ఫ్లోరైడ్ ప్రభావం ఉన్న ఉమ్మడి నల్లగొండపై కేంద్రం చిన్నచూపు చూస్తున్నది. ఈ ప్రాంత ప్రజల శ్రేయస్సు కోసం కేంద్రం మెడలు వంచైనా మునుగోడుకు ఫ్లోరైడ్ రిసెర్చ్ సెంటర్ తీసుకొస్తా..’ అని బీఆర్ఎస్ భువనగిరి లోక్సభ అభ్యర్థి క్యామ మల్లేశ్ చెప్పారు. మంగళవారం ‘నమస్తే తెలంగాణ’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ముందుచూపుతోనే పదేండ్లలో ఒక్క ఫ్లోరైడ్ కేసు కూడా నమోదు కాలేదని గుర్తుచేశారు.
అందులో వాస్తవం లేదు. జాతీయ పార్టీలకు రాజకీయ ప్రయోజనాలు తప్ప రాష్ర్టాల ప్రయోజనాలు పట్టవు. ఆయా పార్టీల్లో ఎవరు ప్రముఖ నేతలు ఉంటే వారి రాష్ర్టాలకే ఎక్కువ నిధులు వెళ్తాయి. కేవలం ఇద్దరు ఎంపీలున్నప్పుడు మనం తెలంగాణను సాధించినం. ఇప్పటివరకు పార్లమెంట్లో తెలంగాణ హక్కుల కోసం కొట్లాడింది బీఆర్ఎస్ ఎంపీలేననే విషయాన్ని మరిచిపోవద్దు. బీఆర్ఎస్ ఎంపీలకే తెలంగాణ సోయి ఉంటుంది.
అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ ఎగదోపిండు. రైతు రుణమాఫీ, ధాన్యానికి రూ. 500బోనస్, రైతుబంధు, ఆడబిడ్డల పెండ్లికి తులం బంగారం, మహాలక్ష్మి పథకం కింద మహిళలకు నెలకు రూ. 2500, పింఛన్ల పెంపు ఇలా చెప్పుకొంటూ పోతే చాంతాడంత హామీల జాబితా ఉన్నా ఒక్కటీ నెరవేర్చలేదు. ప్రజల్లోకి వెళ్తే కాంగ్రెస్ను బూతులు తిడుతున్నారు. ఆరు గ్యారెంటీలను అమలుచెయ్యి అంటే రేవంత్రెడ్డి దేవుండ్లమీద ప్రమాణం చేస్తున్నడు. ప్రజలను మోసం చేసుడుతప్ప కాంగ్రెస్ ఏం చేసిందని ఈ ఎన్నికలను రెఫరెండంలా తీసుకుంటరు? బడుగులకు వ్యతిరేకంగా సీఎం రేవంత్రెడ్డి ముందుకుపోతున్నడు. తెలంగాణలో 80లక్షల ఓటర్లున్న మాదిగలకు ఒక్క ఎంపీ సీటు కూడా కేటాయించలేదు. గొల్లకురుమలు, గౌడ్లకు కూడా టికెట్ ఇవ్వలేదు. ఆయా వర్గాల్లో కాంగ్రెస్పై పీకలదాకా కోపం ఉంది.
రాజ్యాంగాన్ని మారిస్తే దేశ ప్రజలు ఊరుకోరు. కర్రుకాల్చి వాతపెడుతరు. బీజేపీ కేవలం మత, కుల రాజకీయాలతోనే బతుకుతున్నది. పుల్వామా, రామమందిరం, ఇప్పుడు రాజ్యాంగం అంటూ రాజకీయాలు చేస్తున్నది. ఆ పార్టీ పదేండ్లు అధికారంలో ఉండి రాష్ర్టానికి, దేశానికి ఏం చేసిందో చెప్పుకోలేని దుస్థితి. దేశంలో దాదాపు 140 కోట్ల మంది ఉంటే, 40 కోట్ల మందికి తినడానికి తిండి లేదు. విద్య, వైద్యం అందుతలేదు. దేశంలో 40 శాతం ప్రాంతాలకు రోడ్డు కనెక్టివిటీ లేదు. విద్యుత్తు సదుపాయం, సాగునీరు సరిపడా లేదు. ఇంకా 20శాతం జనాభా దారిద్య్రరేఖకు దిగువన బతుకుతున్నది. బీజేపీ గెలిస్తే స్థానిక సమస్యలు, తెలంగాణను పట్టించుకునే పరిస్థితి ఉండదు. గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే ఏం అభివృద్ధి జరిగిందో అందరం చూశాం.
భువనగిరి లోక్సభ ప్రాంత అభివృద్ధి కోసం కేంద్రం మెడలు వంచైనా నిధులు తెస్తా. భువనగిరి, ఇబ్రహీంపట్నం, తుంగతుర్తి, నకిరేకల్ నియోజకవర్గాలకు ఐటీ కంపెనీలను తెస్తా. చిట్యాలలో డ్రైపోర్ట్ ఏర్పాటు కోసం కొట్లాడుతా. బీబీనగర్లో సీసీఎంబీ ఏర్పాటుకు, ఎయిమ్స్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తా. యాదగిరిగుట్ట పరిసరాల్లో ఆయుష్ యూనివర్సిటీ నెలకొల్పేందుకు కృషి చేస్తా. భక్తుల తాకిడి పెరుగుతున్నందున యాదగిరిగుట్ట వరకు మెట్రో రైల్ను తీసుకొస్తా. రాయగిరి వరకు ఎంఎంటీఎస్ను పొడిగిస్తా. ఇబ్రహీంపట్నానికీ మెట్రో రైలు వేయిస్తా. హైదరాబాద్-వరంగల్, హైదరాబాద్ -విజయవాడ జాతీయ రహదారులను ఆరులేన్లుగా విస్తరించేందుకు కృషి చేస్తా. భువనగిరి ఖిలాను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతా. భూదాన్పోచంపల్లికి ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్స్టైల్స్ మంజూరు కోసం కేంద్రంతో కొట్లాడుతా.
భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారానికి విశేష స్పందన వస్తున్నది. ప్రణాళిక ప్రకారం మండలాల వారీగా ప్రచారం నడుస్తున్నది. ఎక్కడికెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నరు. నా నిబద్ధత, మంచితనం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు నచ్చి నాకు టికెట్ కేటాయించారు. కేసీఆర్తోపాటు పార్టీ పెద్దలంతా నన్ను ఏకగ్రీవంగా ప్రతిపాదించారు. పార్టీ కార్యకర్తలు, నాయకులందరూ నాకు సహకరిస్తున్నరు.