బయ్యారం, జూలై9 : రాష్ట్ర సర్కారు ప్రతిష్టాత్మకం గా చేపట్టిన ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నది. ఏటేటా చేపల ఉత్పత్తి పెరగడంతో ఆ కుటుంబాలు ఆర్థికంగా బలోపేతమవుతున్నాయి. ఈ ఏడాది కూడా చేప పిల్లలు పంపిణీ చేసేందుకు మత్స్య శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. చెరువుల్లోకి నీరు సమృద్ధిగా చేరిన వెంటనే ఈ ప్రక్రియను ప్రక్రియను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో 1,234 చెరువులుండగా, ఈ ఏడాది 4.25 కోట్ల చేప పిల్లలు వదిలేందుకు ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి పంపించారు. ప్రస్తుతం ఆన్లైన్ టెండర్ల ప్రక్రియ కొనసాగుతున్నది. నీటి వసతి, విస్తీర్ణం ఎక్కువగా ఉన్న పెద్ద చెరువుల్లో 40 ఎంఎం నుంచి 80 ఎంఎం, చిన్న చెరువులు, కుంటల్లో 35 ఎంఎం నుంచి 40 ఎంఎం సైజు గల చేప పిల్లలను వదలనున్నారు.
వర్షాభావ పరిస్థితుల కారణంగా చెరువుల్లో నీటి నిల్వలు పుష్కలంగా పెరిగిన తర్వాత ఆగస్ట్ మొదటి వారం చేప పిల్లలు వదిలే కార్యక్రమం నిర్వహించే విధంగా మత్స్య శాఖ అధికారులు కార్యాచరణ సిద్ధం చేస్తున్నది. కాగా, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ పథకంతో జిల్లాలోని చెరువుల్లో నీటి నిల్వ సామర్థ్యం పెరిగి చేపల పెంపకానికి అనువుగా మారాయి. అందుకు తగ్గట్లుగా మత్స్య సహకార సంఘాల సంఖ్యను పెంచి మరికొందరు మత్స్యకారులకు ఉపాధి కల్పించాలని ప్రభుత్వం మత్స్యశాఖకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో అధికారులు నిబంధనల ప్రకారం మత్స్యకారులకు వృత్తి నైపుణ్య పరీక్షలు నిర్వహించి సంఘాల సంఖ్యను పెంచారు. గతంలో 150 మత్స్య సహకార సంఘాలుండగా, అదనంగా మరో 30 సహకార సంఘాలను నూతనంగా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం 180 మత్స్య సహకార సంఘాల్లో 11,800మంది సభ్యులున్నారు. ఇందులో 11 మహిళా సంఘాల్లో 350 మంది మహిళా సభ్యులు ఉన్నారు.
చేతికొచ్చిన గతేడాది మత్స్య సంపద
2022-23 సంవత్సరంలో 1,018 చెరువులు, కుంటల్లో 4.02 కోట్ల కొర్రమీను, బొమ్మెలు, బంగారు తీగ, రవ్వలు , బొచ్చెలు, వాలుగ, గ్యాస్కట్, గడ్డి చేప, జెల్లల వంటి రకాల చేప పిల్లలను వదలగా, సుమారు 18,556 టన్నుల చేపలు ఉత్పత్తి అయ్యాయి. ఇలా ఏటేటా జిల్లాలో చేపల ఉత్పత్తి పెరగడంతో మత్స్యకారులకు జీవనోపాధి లభించడంతోపాటు ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. అంతేకాకుండా, వైద్యులు సైతం ఆరోగ్యానికి చేపలు మంచివని, వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని సూచించడంతో జనం ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. గతంతో పోలిస్తే మత్స్య సంపద పెరగడం.., ధరలు తగ్గడంతో పేద, మధ్య తరగతి కుటుంబాలు సైతం తింటున్నాయి. కాగా, ఈ ఏడాది జిల్లాలో 30 సహకార సంఘాలు పెరగడంతో సుమారు వెయ్యి కుటుంబాలకు ప్రత్యక్షంగా, మరిన్ని కుటుంబాలకు పరోక్షంగా జీవనోపాధి లభించనుంది.
టెండర్ల ప్రక్రియ కొనసాగుతున్నది..
2023-24 సంవత్సరానికి ఉచిత చేపపిల్లల పంపిణీ కోసం టెండర్ల ప్రక్రియ తుదిదశకు చేరింది. జిల్లాలోని 1,234 చెరువులు, కుంటల్లో 4.25 కోట్ల చేపపిల్లలు వదలడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. గతంలో 150 మ త్స్య సంఘాలుండగా 30కొత్త సహకార సంఘాలను ఏర్పా టు చేశాం. చెరువులు, కుంటల్లో సమృద్ధిగా నీరు చేరిన తర్వా త జూలై చివరి వారం లేదా ఆగస్టు మొదటి వారంలో చేప పిల్లల పంపిణీ ప్రక్రియను ప్రారంభిస్తాం.
– ఏ నాగమణి, జిల్లా మత్స్యశాఖ అధికారి