Telangana | 2023 కాంగ్రెస్ ఎన్నికల సభల్లో రాహుల్గాంధీ బీసీలకు స్థానిక రాజ్యాలు అప్పగిస్తామని గట్టిగా మాట్లాడారు. అదిప్పుడు చేస్తారా? అని తెలంగాణ బీసీ సమాజం ఎదురుచూస్తున్నది. రాష్ర్టాన్ని పాలిస్తున్న ఇక్కడి పెద్దలు మొత్తం బడ్జెట్లో బీసీలకు సగం బడ్జెట్ కేటాయించవలసి ఉన్నది. పంచాయతీరాజ్ వ్యవస్థలో 42 శాతం ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తే దాని ద్వారా 24 వేల మంది ఓబీసీలు కొత్త నాయకులుగా ఎదిగివస్తారని రాహుల్ గాంభీర్యంగా 2023 వరంగల్ ఎన్నికల సభలో చెప్పారు. స్థానిక సంస్థల్లో 24 వేల మంది బీసీ నాయకులు రావటం హర్షించే విషయమే, కానీ దీన్ని ఏ రకంగా చేయగలరన్న ప్రశ్నలు ఎదురవుతున్నాయి.
పంచాయతీరాజ్ చట్టం ఓబీసీల రిజర్వేషన్లకు సంబంధించి 1993 నుంచి తెలుగు రాష్ర్టాల్లో ఏ విధంగా అమలుచేశారో ఒక్కసారి వెనక్కు తిరిగి చూడవలసి ఉన్నది. ఎన్నికల వాగ్దానాలు చేయటం ఓబీసీల ఓట్లను కొల్లగొట్టటం రివాజుగా జరుగుతున్న చర్య. కానీ ఆచరణలో మాత్రం బీసీలు ప్రతిసారీ దగాకే గురవుతునా్నురు. సుప్రీంకోర్టు మార్గదర్శక సూత్రాలకనుగుణంగా చూస్తే రాహుల్గాంధీ చెప్పింది ఆచరణలో సాధ్యం కాదు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లను ప్రకటించినా అందుకు సుప్రీంకోర్టు మార్గదర్శకత్వం వల్ల అది సాధ్యం కాదని చేతులెత్తేయటం సహజంగా జరిగే చర్యే.
బీసీలకు ఏ విధంగా చూసుకున్నా కూడా స్థానిక సంస్థల రిజర్వేషన్లలో నిరాశే మిగులుతుంది. ఈ అంశంపై కేంద్రాన్ని 77 ఏండ్లుగా ఏలుతూ వస్తున్న కాంగ్రెస్, బీజేపీలు రెండు ఓబీసీ రిజర్వేషన్ల పెంపుపై చెప్పలేని రాయలేని నిర్లక్ష్యానికి గురిచేస్తూ వస్తున్నాయి. ఓట్ల కోసం వచ్చినప్పుడు తప్ప తిరిగి బీసీల సమస్యను రాజకీయపార్టీలు పట్టించుకోవు. ఇందుకు రాష్ట్రంలోని బీసీలంతా ఒక్కతాటిపైకి వచ్చి తమ డిమాండ్లను సాధించుకోవాలి. 60 శాతం మంది బీసీల దీర్ఘకాలిక సమస్యగా ఇది బీసీలను క్షోభకు గురిచేస్తుంది. రాష్ట్రం నుంచి ముక్తకంఠంగా ఒకే స్వరంతో బీసీలు ఐక్యమత్యంతో కదిలే సమయం దగ్గరికి వచ్చింది. మనం వేసే ఈ అడుగులే పొరుగు రాష్ర్టాల్లో ప్రభావం చూపుతాయి. ఇది ఓబీసీల జాతీయ ఉద్యమంగా మారాలి. ఇందుకు బీసీ విద్యావంతులు ఎక్కడికక్కడ ఉద్యమ గొంతుకలుగా మారాలి. బీసీ, ఎంబీసీ, ఉపకులాల సంచారజాతుల అనేకానేక సమస్యలకు తక్షణ ఉద్యమాలు రావాలి. అవే రేపటి బీసీల హక్కుల దీర్ఘకాలిక ఉద్యమంగా దేశవ్యాపిత మహోద్యమంగా మారవలసి ఉన్నది.
రాజ్యంగంలోని 243-డీ ప్రకారం స్థానిక సంస్థల్లో ఎస్సీ, ఎస్టీల జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ల కేటాయింపు జరిగింది. అదేవిధంగా మొత్తం సీట్లలో 1/3 వంతు స్త్రీలకు కేటాయింపు చేశారు. ఇక బీసీలకు సంబంధించిన రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభుత్వాలకు విడిచిపెట్టారు. దీని ప్రకారం ఏ రాష్ట్రంలో కూడా బీసీల జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు వచ్చే అవకాశమే లేదు. ఇందుకు కారణం సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం 50 శాతం రిజర్వేషన్ దాటకూడదన్న నిబంధన.
పార్లమెంటులో రాజ్యాంగ సవరణ చేయకుండా బీసీల జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు పొందలేరు. కాంగ్రెస్ బీసీ రిజర్వేషన్లపై నిర్లక్ష్యం చేస్తూ వచ్చింది. ఇప్పుడు మాత్రం తాము అధికారంలోకి వస్తే ఓబీసీ కులగణన, పంచాయతీరాజ్ వ్యవస్థలో రిజర్వేషన్లు ఇస్తామని రాహుల్గాంధీ చెప్తున్నారు. బీజేపీ పార్లమెంటు సాక్షిగానే బీసీ కులగణన చేయబోమని చెప్పింది. ఇలాంటి సందర్భంలో బీసీలు స్థానిక రాజ్యాల్లో తమకు రావాల్సిన సమ వాటా కోసం సమరాలు చేయకతప్పదు. ఇందుకోసం రాజకీయాలకతీతంగా బీసీలందరూ ఒక్కతాటిపైకి రావాల్సిన అత్యవసర సమయం వచ్చింది. బీసీలను ఇంకెంతకాలం మోసం చేస్తారని అన్ని రాజకీయపార్టీలను నిగ్గదీసే సమయం దగ్గర్లోనే ఉన్నది.
– జూలూరు గౌరీశంకర్