Congress | మహబూబాబాద్ రూరల్, ఏప్రిల్ 25 : ఎమ్మెల్యే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మాయమాటలు నమ్మి మోసపోయామని ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఉదయం బీఆర్ఎస్ మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థి కవిత జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో మార్నింగ్ వాక్తోపాటు పట్టణంలోని కూరగాయాల మార్కెట్లో వ్యాపారులు, స్థానికులను కలిసి కారు గుర్తుకు ఓటువేయాలని అభ్యర్థించారు.
ఈ సందర్భంగా మండల పరిధిలోని రేగడి తండాకు చెందిన బానోత్ కాళీ అక్కడే ఆకు కూరలు అమ్ముతుండగా, కవిత ఆమె వద్దకు వెళ్లి బీఆర్ఎస్కు ఓటు వేయాలని అభ్యర్థించారు. అందుకు ఆమె స్పందిస్తూ.. ‘మొన్న జరిగిన ఎన్నికలల్ల కాంగ్రెస్ పార్టీ చెప్పింది నమ్మి మోస పోయినం. కాంగ్రెస్కు ఓటు వేసినందుకు వరి పంట మొత్తం ఎండిపోయింది. రైతులు పెట్టుబడి ఎల్లక ఇబ్బందులు పడుతుండ్రు. తండావాసులు తాగడానికి నీళ్లు లేక బావుల సుట్టూ తిరుగుతున్నరు. మల్ల ఎనుకటి రోజులు అచ్చినయి. కాంగ్రెసోళ్లు రైతుబంధు ఇయ్యలె. రుణమాఫీ చేయకపాయె. పంటలకు తెచ్చిన అప్పులు పెరిగిపాయె. ఆకుకూరలు పండించడానికి నీళ్లు లేకపాయె. సీఎం రేవంత్రెడ్డి ఏ హామీని తీర్చకపాయె. కేసీఆర్ పాలనలో రెండు పంటలు మంచిగ పండి రైతులు ఆనందంగా ఉండె. ప్రతి కాలనీకి తాగు నీరొచ్చింది. అందరికీ లాభంగుండె. ఇప్పుడు జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలె. మళ్లా కేసీఆర్ సారే రావాలె’ అంటూ తన మనసులోని మాటను వెల్లడించింది.