సిటీబ్యూరో, జూలై 22 (నమస్తే తెలంగాణ): పొరుగు రాష్ట్రమైన ఏపీలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతుండడంతో అక్కడి ప్రభుత్వం అలర్ట్ ప్రకటించింది. దీంతో స్థానికంగా అన్ని ప్రభుత్వ దవాఖానల్లో కరోనా పరీక్షలు చేయడంతో పాటు ముందస్తు జాగ్రత్త చర్యగా ప్రత్యేక వార్డులను సైతం ఏర్పాటు చేశారు. గత నెల రోజుల నుంచి దేశంలోని కొన్ని ప్రాంతాల్లో మరోసారి కరోనా కేసులు వెలుగు చూస్తున్న విషయం తెలిసిందే. కేరళలో అత్యధిక కేసులు నమోదవుతుండగా, ఏపీలో గడిచిన 15 రోజుల్లో దాదాపు 60కి పైగా కరోనా కేసులు నమోదయ్యాయి.
కరోనా బారినపడిన నలుగురు రోగులు మృత్యువాత పడడంతో ఏపీ సర్కార్ స్థానిక ప్రజలను జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. అయితే తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మాత్రం ముందు జాగ్రత్తలు చర్యలు తీసుకోవడం లేదు. తార్నాకకు చెందిన ఓ మహిళ అనారోగ్యంతో మృత్యువాత పడిందని, సదరు రోగికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు వైద్యపరీక్షల్లో తేలిందనే వార్త బుధవారం నగరంలో కలకలం సృష్టించింది. అయితే ఎలాంటి కరోనా మరణం జరగలేదని హైదరాబాద్ జిల్లా వైద్యాధికారి డా.పుట్ల శ్రీనివాస్ స్పష్టం చేయగా, మేడ్చల్ జిల్లా అధికారులు మాత్రం ధ్రువీకరించలేదు.

Covid
కేసులు నమోదు కాలేదు డాక్టర్ పుట్ల శ్రీనివాస్, జిల్లా వైద్యాధికారి
ఇప్పటి వరకు మాత్రం నగరంలో ఎక్కడ కూడా కరోనా కేసులు నమోదు కాలేదు. పొరుగు రాష్ట్రంలో కేసులు నమోదవుతున్న మాట వాస్తవమే అయినప్పటికీ నగరంలో మాత్రం కరోనా ఆనవాలు లేవు. గాంధీ, ఉస్మానియా వంటి అన్న ప్రభుత్వ దవాఖానల్లో కరోనా కిట్స్ అందుబాటులో ఉన్నాయి. ఎవరికైనా అనుమానిత లక్షణాలు ఉంటే కరోనా పరీక్షలు చేయిస్తాం. ప్రస్తుతానికి ఆ అవసరం లేనందున.. ఎవరినీ కరోనా పరీక్షలకు రిఫర్ చేయడం లేదు. ప్రస్తు తం వర్షాకాలం మొదలవ్వడంతో కొంత సీజనల్ కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలతో రోగులు దవాఖానలకు వస్తున్నారు. ఇవి కరోనా కేసులు కాదు. సాధారణ సీజనల్ కేసులే. ఎక్కడైనా అనుమానిత కేసులు ఉంటే కరోనా పరీక్షలు జరిపిస్తాం.
అది ఒమిక్రాన్ ఉపవేరియంటే..
ఏపీ, కేరళ వంటి రాష్ర్టాల్లో అక్కడక్కడ కరోనా కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం వస్తున్న వేరియంట్ అంత ప్రమాదకారి కాదు. ఏపీలో నమోదవుతున్న కేసులన్నీ ఒమిక్రాన్ సబ్ వేరియంట్కు చెందినవే. గతంలో పరిశీలిస్తే ఒమిక్రాన్ వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ప్రస్తుతం వస్తున్న సబ్ వేరియంట్ వల్ల కూడా ఎలాంటి ప్రమాదం ఉండబోదు. అందుకని ప్రజలు ఎవరూ కరోనా గురించి భయాందోళనకు గురికావాల్సిన పనిలేదు. అయితే దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు మాత్రం కొంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వారిపై ఈ వైరస్ కొంత ప్రభావం చూపే అవకాశం ఉంటుంది.
– డాక్టర్ రాజారావు, ప్రిన్సిపాల్, ఉస్మానియా వైద్య కళాశాల