హైదరాబాద్, జులై 22 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి తీరు గురవింద గింజ తీరుగా ఉందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎంపీల పార్టీ ఫిరాయింపులపై తెగ ఆందోళన వ్యక్తం చేస్తున్న ఆయన.. రాష్ట్రంలో ఎమ్మెల్యేల ఫిరాయింపులపై మాత్రం సడి సప్పుడు చేయడంలేదు. పార్టీ ఫిరాయింపులపై లోక్సభలో చర్చించాలని, ఇది అత్యంత ప్రాధాన్యమైన అంశం అంటూ వాయిదా తీర్మానం ఇచ్చారు. బీజేపీ కేంద్ర ఏజెన్సీలను ఎగదోసి టీఎంసీ, ఆప్, శివసేన (యూబీటీ) పార్టీల ఎంపీలు పార్టీ మారేటట్టు చేస్తున్నదని ఆరోపించారు.
ఇది ప్రమాదకరస్థాయికి చేరిందని, కాబట్టి సభలోని ఇతర అంశాలను పక్కనపెట్టి ఈ అంశంపై మాట్లాడేందుకు సమయం ఇవ్వాలని కోరారు. అయితే ఎంపీల ఫిరాయింపులపై ఇంతలా ఆందోళన చెందుతున్న చామల కిరణ్కుమార్రెడ్డికి రాష్ట్రంలో జరుగుతున్న ఫిరాయింపులు కనిపించడం లేదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తెలంగాణలో బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలలో 9 మంది కాంగ్రెస్ వైపు ఉన్నారు. ఇది పార్టీ ఫిరాయింపు కాదా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఎంపీలు పార్టీ ఫిరాయిస్తే తప్పు.. తెలంగాణలో ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయిస్తే ఒప్పా అని నిలదీస్తున్నారు. ముందు తెలంగాణలో కాంగ్రెస్ తీరును ఖండించి తర్వాత ఢిల్లీలో ఎంపీల ఫిరాయింపులను ప్రశ్నించాలని సూచిస్తున్నారు.