అగ్ర కథానాయిక తమన్నా నటిస్తున్న తాజా చిత్రం ‘ది వివాన్’ త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది. ఇందులో ఆమె సిద్ధార్థ మల్హోత్రా సరసన నటిస్తున్నది. ఇటీవలే ట్రైలర్ను విడుదల చేశారు. అడవి నేపథ్యంలో మైథలాజికల్ థ్రిల్లర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ఛఠ్ పూజ నేపథ్యంలో చిత్రీకరించిన పాట తన కెరీర్లోనే ఎంతో ప్రత్యేకమని చెప్పింది తమన్నా. ఆమె మాట్లాడుతూ ‘నేను ముంబయిలో పుట్టిపెరిగాను. అక్కడ జుహూ బీచ్లో కొన్ని వేలమంది మహిళలు ఛఠ్ పూజ చేయడం చూసేదాన్ని.
అయితే ఆ సంప్రదాయం గురించి నాకు ఎలాంటి వివరాలు తెలియవు. సినిమాలో పాట చిత్రీకరిస్తున్నప్పుడు ఆ పూజ చేయడం ఎంత కష్టమో అర్థమైంది. దాదాపు 36 గంటల పాటు నీళ్లు కూడా ముట్టుకోకుండా భక్తిశ్రద్ధలతో మహిళలు ఆ పూజలో నిమగ్నమవుతారు. బీహారీ సంస్కృతిలో ఈ పూజ అందమైన భాగం. మనం ఉదయించే సూర్యుడికి నమస్కరించి పూజాదికాలు చేస్తాం.
కానీ వారు అస్తమించే సూర్యుడికి కూడా అంతే ప్రాముఖ్యతనిస్తారు. ఈ పాట షూటింగ్ టైమ్లో భావోద్వేగాల్ని ఆపుకోలేక కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలున్నాయి. ఏదో అతీతశక్తి నాలో ప్రవేశించి ఉద్వేగాన్ని కలిగించినట్లుగా అనిపించింది. నా హృదయాన్ని కదిలించిన పాట ఇది’ అని తమన్నా చెప్పింది.