సుబేదారి, ఏఫ్రిల్ 25: నమస్తే తెలంగాణ దినపత్రిక సబ్ ఎడిటర్ కెంచ అశోక్పై దాడికి పాల్పడిన వరంగల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కే శ్రీధర్పై చర్యలు తీసుకోవాలని సంస్థ వరంగల్ ప్రతినిధులు పోలీసు కమిషనర్ అంబర్ కిశోర్ఝాను కోరారు. బుధవారం మడికొండ యూనిట్ ఆఫీస్కు వెళ్తున్న సబ్ ఎడిటర్ అశోక్పై మడికొండ చౌరస్తాలో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ దాడికి పాల్పడిన విషయం విదితమే.
ఈ మేరకు గురువారం హనుమకొండలోని సీపీ కార్యాలయంలో అశోక్తో కలిసి ‘నమస్తే తెలంగాణ’ వరంగల్ యూనిట్ బ్రాంచ్ మేనేజర్ అశోక్కుమార్, బ్యూరో ఇన్చార్జి గోపాల్, సీనియర్ సబ్ ఎడిటర్లు కిరణ్, సోమనర్సయ్య, క్రైం రిపోర్టర్ రాజ్కుమార్ సీపీని కలిసి ఫిర్యాదు లేఖ అందజేశారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ శ్రీధర్ అకారణంగా తన బైక్ను నెట్టివేయడంతో కిందపడగా చేతికి గాయమైందని, ఎక్కువ మాట్లాడితే ఎఫ్ఐఆర్ చేస్తానని బెదిరించారని బాధితుడు సీపీకి వివరించారు. ఈ ఘటనపై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటానని సీపీ హామీ ఇచ్చారు.