DMK Leader Udhayanidhi Stalin | తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్, ప్రముఖ నటి త్రిషను ఉద్దేశించి డీఎంకే యువజన విభాగం కార్యదర్శి, ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు అక్కడి రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ కేసుకు సంబంధించి చెన్నైలోని నీలంకరైలో ఉన్న ఉదయనిధి నివాసానికి చేరుకున్న పోలీసులు, మంగళవారం ఆయనను విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నారు. తంజావూరులో జరిగిన ఒక బహిరంగ సభలో ఆయన చేసిన వ్యాఖ్యలపై టీవీకే మహిళా వింగ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు, తంజావూరు పోలీసులు ఐటీ చట్టంలోని నిబంధనలతో సహా మొత్తం ఆరు సెక్షన్ల కింద ఆయనపై కేసు నమోదు చేశారు.
ఈ పరిణామాల నేపథ్యంలో ఉదయనిధికి రక్షణ కల్పించాలని కోరుతూ డీఎంకే న్యాయవాద బృందం మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. తంజావూరు డీఎస్పీ అలగేసన్ నేతృత్వంలోని పోలీస్ బృందం, చెన్నై పోలీసు కమిషనర్ ఎ. అమల్రాజ్ ఉదయనిధి నివాసానికి చేరుకుని కేసు వివరాలను తెలియజేశారు. ఈ వార్త తెలిసిన వెంటనే భారీ సంఖ్యలో డీఎంకే కార్యకర్తలు ఆయన నివాసం వద్దకు చేరుకుని నినాదాలు చేయడంతో, ఆ ప్రాంతంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. సీనియర్ డీఎంకే నేతలు కె.ఎన్. నెహ్రూ, మా. సుబ్రమణియన్ తదితరులు అక్కడికి చేరుకుని అధికారులతో చర్చలు జరిపారు.
సోమవారం తంజావూరులోని పనగల్ బిల్డింగ్ వద్ద కావేరి జలాల హక్కులు, మేకెదాటు ప్రాజెక్టు, రైతు రుణమాఫీ తదితర అంశాలపై జరిగిన డీఎంకే నిరసన సభలో ఉదయనిధి ప్రసంగించారు. ఈ సమయంలో కార్యకర్తలు నటి త్రిష పేరును ప్రస్తావించగా, ఆయన చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. దీనిపై టీవీకే మహిళా వింగ్ పోలీసులకు ఫిర్యాదు చేయడమే కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టింది. మరోవైపు ఉదయనిధి వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ టీవీకే జాతీయ అధికార ప్రతినిధి పళ సెల్వకుమార్ జాతీయ మహిళా కమిషన్కు ప్రత్యేకంగా ఫిర్యాదు చేశారు.