దేశంలో తొలి స్వదేశీ 350 కేజీల థ్రస్ట్-క్లాస్ ఎక్స్పెండబుల్ టర్బోజెట్ ఇంజిన్ విజయవంతంగా తయారవడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్కు చెందిన ఆజాద్ ఇంజినీరింగ్, డీఆర్డీవో (DRDO) సంయుక్తంగా సాధించిన ఈ ఘనత హైదరాబాద్తో పాటు దేశానికి గర్వకారణమని పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ట్విట్టర్ (ఎక్స్) వేదికగా స్పందించారు.
హైదరాబాద్లో తయారైన ఈ టర్బోజెట్ ఇంజిన్ భారతదేశపు స్వదేశీ ప్రొపల్షన్ సామర్థ్యాలను, రక్షణ రంగంలో ఆత్మనిర్భరతను మరింత బలోపేతం చేస్తుందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. జెట్ ఇంజిన్ సాంకేతికతకు అత్యంత కచ్చితత్వం, అధునాతన మెటలర్జీ, ప్రపంచ స్థాయి తయారీ నైపుణ్యం అవసరమని పేర్కొన్నారు.
ఈ విజయం హైదరాబాద్లో దశాబ్దాలుగా అభివృద్ధి చెందిన ఏరోస్పేస్, ప్రిసిషన్ ఇంజినీరింగ్ రంగాల సామర్థ్యానికి నిదర్శనమని కేటీఆర్ అన్నారు. గత పదేళ్లలో ఈ రంగం మరింత బలోపేతం కావడం వల్లే ఇలాంటి చారిత్రాత్మక ఘనత సాధ్యమైందని తెలిపారు. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనకు ఈ విజయం మరింత ఊతమిస్తుందని, ప్రపంచ స్థాయి ఏరోస్పేస్ హబ్గా హైదరాబాద్ ఖ్యాతిని మరింత పెంచిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా చారిత్రాత్మక విజయాన్ని సాధించిన ఆజాద్ ఇంజినీరింగ్, డీఆర్డీవో బృందాలకు కేటీఆర్ అభినందనలు తెలియజేశారు.