Sabitha Indra Reddy | హైదరాబాద్ : వెనకాల ఉండే అక్కలు.. ఇక్కడ ఉండి చెప్పి చెప్పి ఇక్కడ ముంచి అక్కడ తేలారు. ఆ అక్కల మాటలు వింటే.. జూబ్లీ బస్టాండ్లో కూర్చోవాల్సి వస్తది అని బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి శాసనసభలో మాట్లాడారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. సీఎం ఏ పార్టీలో నుంచి వచ్చారు..? ఏ పార్టీ నుంచి ఏ పార్టీలోకి మారారు.? వీటిన్నింటిపై తప్పకుండా చర్చ పెడుతాం. కేసీఆర్ ఇంటి మీద వాలిన కాకి నా ఇంటి మీద వాలితే కాల్చేస్తా అని రేవంత్ రెడ్డి అన్నారు. మరి ఎంత మంది ఉన్నారు.. ఎంత మందిని కాల్చేస్తారు. ఎందుకు చేర్చుకున్నారు..? ఇప్పుడేమో సీఎం ఎంజాయ్ చేస్తున్నారు అని సబితా ఇంద్రారెడ్డి నిప్పులు చెరిగారు.
గుండె మీద చేయి వేసుకుని చెప్పాలి సీఎం. ఆ రోజు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినప్పుడు ఒక అక్కగా రేవంత్ను ఆశీర్వదించాను. బాబు నువ్వు గొప్పగా ఎదుగుతావు.. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతావు అని చెప్పి పార్టీలోకి ఆహ్వానించాను. ఇప్పుడు నా మీద ఎందుకు కక్ష తీర్చుకుంటున్నారో నాకు అర్థం కావడం లేదు. ఎందుకు నన్ను టార్గెట్ చేశారు. నీ వెనుకాల కూర్చున్న అక్కలను నమ్ముకోవద్దు మోసం చేస్తరు అని సీఎం అన్నారు. ఏం మోసం చేసినం అధ్యక్షా..? ఏం ముంచినం అధ్యక్షా..? ఈయనను ముంచామా అధ్యక్షా..? ఈయనను బతిమాలిడి పార్టీలోకి రావాలని, భవిష్యత్లో ఈ పార్టీకి ఆశా కిరణం అవుతావు అని ఆహ్వానించాను. రేవంత్ను గుండె మీద చేయి వేసుకోమని చెప్పమను. ఏం మోసం చేశాను.. ఎన్నికల సమయంలో కూడా అదే మాట్లాడారు. ఎందుకు టార్గెట్ చేస్తున్నారు. ఎందుకు అవమానిస్తున్నావ్.. నాపై చేసిన వ్యాఖ్యలను రేవంత్ విత్ డ్రా చేసుకోవాలని సబితా ఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు.
ఇక సీఎం రేవంత్ రెడ్డి మాటలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు వంత పాడారు. సభా నాయకుడు సబిత పేరు పెట్టి మాట్లాడలేదని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి ఎవరి గురించి మాట్లాడలేదు, ఒక సూచన, సలహా ఇచ్చారు అంతే అని శ్రీధర్ బాబు అన్నారు.
ఇవి కూడా చదవండి..
KTR | విమర్శ కోసం విమర్శ చేయొద్దు.. భట్టి విక్రమార్కకు కేటీఆర్ చురకలు
KTR | భారతదేశ భాగ్యరేఖలను మార్చే రాష్ట్రంగా తెలంగాణ అగ్రభాగాన నిలబడింది : ఎమ్మెల్యే కేటీఆర్