Ramaayanam | చిన్నప్పటి ఎండలు చల్లగా ఉండేవి. బహుశా మనుషుల మధ్య ప్రేమల వల్ల కాబోలు. ఎండకాలం వస్తున్నదంటే పట్టరాని సంతోషం. సెలవుల్లో ఆటలే ఆటలు! ప్రయాణాలు.. పుస్తకాలు.. సైకిల్ నేర్చుకోవడం.. చిరుతిళ్లు.. అన్నీ ఆనందం కలిగించే విషయాలే!
ఎండకాలపు మధ్యాహ్న వేళల్లో.. మా చతుశ్శాల భవంతి వెనుక ఉండే గూనపెంకుల వంటింట్లో.. నేతచీర పరుచుకొని, తాటాకు విసనకర్రపై నీళ్లు చల్లుకుని విసురుతూ.. మమ్మల్ని పక్కన పడుకో బెట్టుకుని కథలు చెబుతుండేది నానమ్మ. నీటి తుంపర్లు చల్లగా మా మీద పడుతుంటే.. మట్టి నేల తడిసి పరిమళాలు వెదజల్లుతుండగా.. ఆ కథలు వినడం ఓ చక్కని అనుభవం!
వేసవి వస్తుందంటేనే ఆరుబయట వేసుకొని పడుకోవడానికి వీలుగా, మంచాలకు నవారు అల్లించేవారు. నాన్న కూడా నవారు అల్లడమే కాదు, మాకు కూడా నేర్పించాడు. ఇక బానయ్య అనే వ్యక్తి వచ్చి కొన్ని మంచాలకు నులక అల్లేవాడు. ఆ కొత్త నులక గుచ్చుకుని.. వీపుపై ఇంజక్షన్లు ఇస్తుండేది. నులక మెత్తబడాలనో లేక చల్లగా ఉండాలనో.. దానిమీద నీళ్లు జల్లేవారు.
గాలి ఆడని వేసవి రాత్రుల్లో.. ఆరు బయట నీళ్లు చల్లిన వాకిట్లో మంచాలపై అమ్మ పక్కన పడుకుని.. చుక్కలను చూస్తూ, తను చెప్పే కథలు వినడం.. ఒక మధురానుభూతి. నిద్ర కళ్లను మూస్తూ, తెరుస్తూ ఎప్పుడు నిద్రలోకి జారుకునేవాళ్లమో తెలిసేదేకాదు.
వేసవిలో మా కజిన్స్ అందరూ వాళ్ల అమ్మమ్మ గారిఇళ్లకు వెళ్లేవాళ్లు. కొందరు మా దగ్గరికి వచ్చేవాళ్లు కూడా. అందరం దినమంతా ఇంట్లోని పడమటి గదిలో, సాయంత్రాలు వాకిట్లో రకరకాల ఆటలు ఆడేవాళ్లం. రాత్రయ్యాక మంచాల మీద వరుసగా పడుకుని కబుర్లు చెప్పుకొనేవాళ్లం. “ఇంగ పెట్టిన ముచ్చట్లు చాలు! పండుకోండి. మళ్ల పొద్దున లేవరు” అని అమ్మ మందలిస్తే.. కాసేపు మౌనంగా ఉండి, మళ్లీ దుప్పట్ల చాటున గుసగుసగా ఏవో జోకులు చెప్పుకొని కిసుక్కున నవ్వుకునేవాళ్లం. పంచాయితీ రేడియోలో రాత్రి ఎనిమిదిన్నర నుంచి తొమ్మిది వరకు ‘చిత్రసీమ’ సినిమా పాటలు వచ్చేవి. మంచాల్లో పడుకుని వేపచెట్ల గాలి సన్నగా వీస్తుండగా.. ఆ పాటలు వినడం ఎంతో బాగుండేది. వినీ, వినీ పాటలన్నీ మాకు నోటికి వచ్చేవి.
పగలు ఎంత వేడిగా ఉన్నా.. రాత్రయ్యేసరికి వాతావరణం చల్లగా మారేది. మా ఇంటికి వచ్చే చుట్టాలకూ, ఆ తరువాత రోజుల్లో నా స్నేహితురాళ్లకూ అలా సహజంగా.. ఆరు బయట చల్లగాలి వీస్తూండగా, ఆకాశాన్ని చూస్తూ పడుకోవడం ఎంతో నచ్చేది. ఒక్కో మంచం పక్కన మట్టి కూజాల్లో మంచినీళ్లు పెట్టి ఉంచేవారు.
ఎండాకాలం అనగానే గుర్తుకొచ్చేవి మల్లెపూలు, మామిడిపళ్లు. మాకు పెద్ద మామిడి తోట అయితే లేదుగానీ.. నాలుగైదు మామిడి చెట్లు ఉండేవి. పచ్చళ్లు పెట్టడానికి ఆ పుల్లటి కాయలే వాడేవాళ్లు. రెండు చెట్లకాయలు ఎండు గడ్డి పరిచి మగ్గబెట్టేవారు. ఆ గది దగ్గరికి రాగానే.. మామిడి పళ్ల సువాసన భలే టెంప్టింగ్గా ఉండేది. కానీ, పెద్దవాళ్లు ఇస్తేనే తప్ప.. మాకై మేము తీసుకుని తినేవాళ్లం కాదు.
మా పొలంలో ‘అచ్చన్న బావి’ ఉంటుంది. అది తవ్వించిందెవరో మా పూర్వీకుల్లో ‘అచ్చన్న’ అయి ఉంటారు. ఆ బావి పెద్దగా, వెడల్పుగా ఉండటం వల్ల మగపిల్లలు ఆనపకాయ (సొరకాయ) బుర్రలో, పాత టైర్ ట్యూబులో నడుముకు కట్టుకుని ఈత కొట్టేవాళ్లు. ఇంకా పెద్దవాళ్లు పైనుంచి డైవ్ కొడుతుంటే.. నాన్న వెంట అప్పుడప్పుడూ వెళ్లిన మేము, ఒడ్డుకు దూరంగా నిలబడి అబ్బురంగా చూసేవాళ్లం.
అప్పట్లో విపరీతమైన నీటి కరువు. ఎవరింట్లోనైనా మంచినీళ్ల బావి ఉందంటే చాలు.. దానికి బోలెడు డిమాండ్ ఉండేది. ఆ ఇంటివాళ్లు భాగ్యవంతుల కింద లెక్క! మా ఇంటికి చాలామంది నీళ్లు చేదుకోవడానికి వస్తుండేవారు. ఎండాకాలంలో నెలకో చాంతాడు, చేద బొక్కెన కొనాల్సి వచ్చేది. అలాంటప్పుడు.. నానమ్మ చేదబొక్కెన తీసి దాచిపెట్టేది.
మా ఇల్లు మొత్తం ఖుల్లాగా ఉండేది. ఎవరైనా.. ఎప్పుడైనా రావచ్చు. పెరట్లోని బావిదాకా బిందెలు పట్టుకొని వచ్చినవాళ్లు చేంతాడు, బొక్కెన కనపడక హతాశులయ్యేవాళ్లు. వాళ్లతో.. “చాంతాడు తెగింది” అనో, “బాయిల నీళ్లు లోపలికి పోయినయ్. మీరంటె ఎక్కడికన్న పోతరు! మా బాయిల నీళ్లు లేకుంటె మేమెటు పోవాలె?” అనో అనేది నానమ్మ. “నీళ్లు లోపలికి పోతె.. పూడిక తీయించ రాదుండ్రి” అనేది వాళ్లు. “ఆఁ, తీయిస్తరు.. పైసలు నువ్విస్తవా!” అనేది నానమ్మ. ఆ వాక్పటిమకు ఇక ఏమనలేక.. అలా అని వెనక్కు వెళ్లిపోక.. ఆ పట్టువదలని విక్రమార్కిణులు ఎంతసేపైనా నిలబడే ఉండేవారు. అమ్మ ఎప్పటికోగానీ కల్పించుకోకపోయేది. చిన్నత్తగారి పట్ల భయంతో కూడిన గౌరవం అన్నమాట. నాన్న ఇంట్లో ఉండి ఆ విషయం గమనిస్తే.. “ఎహె! గా చాంతాడు దాచిపెట్టుడు ఏంది?! నీళ్లులేక నోరెండి చస్తరు, చేదుకోనివ్వండి” అనేవాడు. “ఎన్నని కొంటడు?! కరువుగంటి కాలానికి అని దాచిన! మజ్జల నేను కంటు!” అనుకుంటూ.. చేద బొక్కెన ఇచ్చేది నానమ్మ.
ఇక రైల్వేట్రాక్ అవతల ఊరిలో.. మరీ తీవ్రమైన నీటి కరువు! ఆడవాళ్లు నీళ్లున్నాయంటే ఎంత దూరమైనా వెళ్లి, బిందె భుజానికెత్తుకొని నీళ్లు మోసేవారు. మగవాళ్లు సైకిళ్లకు బిందెలు కట్టుకుని పొలాల దగ్గర కరెంట్ మోటార్ల పంపుల నుంచి తెచ్చేవారు. ఇప్పుడు తెలంగాణలో ప్రతి పల్లెలో నల్లాలు, పుష్కలంగా నీళ్లు ఉన్నాయి గానీ.. అప్పట్లో నీటి కష్టాలు వర్ణనాతీతం.
నెల్లుట్ల రమాదేవి ( Nellutla Ramadevi ), రచయిత్రి
Ramaayanam | అమ్మే తొలి గురువు
Ramaayanam | సకలకళా.. వల్లభన్!