Ramaayanam | మేం చదువుకున్నది ప్రభుత్వ పాఠశాలలోనే. అక్కడ ‘స్కూల్ డే’లు పెద్దగా జరిపేవాళ్లు కాదు. హైస్కూల్కి వచ్చాక మాత్రం ఎనిమిది, తొమ్మిది, పదో తరగతుల్లో ‘స్కూల్ డే’ వేడుకలు నిర్వహించారు. మా స్కూల్ చాలా పెద్దది. చుట్టుపక్కల పది గ్రామాల పిల్లలు కూడా.. ఇక్కడే చదువుకునేవారు.
‘స్కూల్ డే’ కోసం నాటికలు, ఏకపాత్రాభినయాలు, డ్యాన్సులు నిర్వహించేవారు. వీటన్నిటి రిహార్సల్స్ పది రోజుల ముందునుంచే మొదలయ్యేవి. మా స్కూల్ గ్రౌండ్లో ఉండే పెద్ద పర్మనెంట్ వేదిక మీద.. ఫంక్షన్ చేసేవారు. ఊరి జనమంతా ఆ రోజు గ్రౌండ్లోనే ఉండేవారు. డీఈఓ గానీ, పోలీస్ ఇన్స్పెక్టర్ గానీ, డాక్టర్, ఇంజినీర్ లాంటి వాళ్లను గానీ అతిథులుగా ఆహ్వానించేవారు. అంతకు వారం రోజుల ముందే.. మా గుడిసె ఆడిటోరియంలో పాటల పోటీలు జరిగేవి. మధ్యాహ్నం తరువాత క్లాసులు ఉండేవి కావు. పైగా పాటలు వినడమంటే మాలో సంతోషం మత్తడి దుంకేది. దేశభక్తి, స్నేహం, భక్తి, ప్రకృతి, వ్యవసాయం, రైతులు, కార్మికులు, అమ్మ, కుటుంబం.. ఈ అంశాల మీదే పాటలు పాడాలి అనే రూల్ ఉండేది. అందుకే, లలిత గీతాలు, జానపద గీతాలు, సినిమా పాటలతోపాటు సినీగీతాల స్టయిల్లో కట్టిన దేశభక్తి గీతాలు పాడేవారు. ఫైనల్గా గెలుపొందిన వారితో.. స్కూల్ డే రోజున స్టేజీ మీద పాడించేవారు.
మా క్లాస్లో జితేందర్ అనే అబ్బాయి.. ‘ఓ భారత పౌరులారా.. లేవండి మీరంతా! చైనా దురాత్ములు దండెత్తి వచ్చిరి.. పోరాడ రారండీ!’ అనే పాట చాలాబాగా పాడేవాడు. అప్పటికి రేడియోలో హిందీ పాటలు పదేపదే విన్న అనుభవంతో వచ్చిన జ్ఞానం వల్ల.. ఆ పాట ‘హమ్ రాజ్’ సినిమాలోని ‘ఏ నీల గగన్ కే తలే ధర్తీ కా ప్యార్ ఫలే’ అన్న విషయం నాకు తెలిసిపోయింది. దాంతో మనసు అదే పాటను హమ్ చేసేది. ఎక్కడన్నా శ్రుతి తప్పితే.. శంకరాభరణం శంకరశాస్త్రిలా ‘జితేందర్!?’ అనాలనిపించేది.
అక్క సీనియర్ అక్స, వాళ్ల చెల్లెలు గుల్బన్.. ఇద్దరి గొంతులూ చాలా బాగుండేవి. కానీ, వాళ్లెందుకోమరి తమ ప్రతిభ తెలుసుకోకుండా పాటలను మాట్లాడినట్టే చదివేవారు. ‘జాతీయ జెండా పైకెత్తునపుడు పాటించవలసిన నియమాలు.. కాషాయరంగు ఎపుడైనా పైకి ఉంచవలెను. ఓ భారతీయుడా!’ అనే పాట.. వాళ్ల బ్రాండ్గా ఉండేది.
ఇక రాణి అనీ అక్క క్లాస్మేట్. ఆమెకు తను చాలా పెద్ద సింగర్నని బాగా నమ్మకం ఉండేది. ఆమె గాయని అవడం ఏమో గానీ.. పాటతో మనకు గాయం చేసేది. అసలు కోరస్ పాడితేనే ఘోరస్గా ఉండేది. ఈ పాటల రాణి పోటీలో దిగి ఓసారి ‘ప్రేమనగర్’ సినిమాలో పాట పాడింది. ‘తేట తేట తెలుగులారా.. తెల్లవారి వెలుగులారా! ఏరులారా.. సెలయేరులారా.. కలకలా గలగలా! (చివరి పదాలను దయదల్చి ‘రా’ చేర్చకుండా వదిలేసింది).. అంటూ సాహిత్యాన్నీ, లయనూ తనదైన శైలికి మార్చి పాడింది. దాంతో వింటున్న వాళ్లు.. అంత సంగీత, సాహిత్య జ్ఞానం లేకపోయినా.. దగ్గడం, సరాయించడం, తలలు గోక్కోవడం, చెవుల్లో, ముక్కుల్లో వేళ్లు పెట్టుకోవడం, అదే పనిగా కదలడం చేస్తూ నిరసన తెలియజేశారు. కాసేపటికి ఆ సంగీత ప్రవాహంలోంచి తెప్పరిల్లిన టీచర్లు.. “అయ్యో! ఇది ప్రేమగీతమమ్మా! ఏదైనా భక్తిపాటో, దేశభక్తి గీతమో పాడాల్నమ్మా!” అని వారించబోయారు. ఆమె అంగీకరించకుండా.. “తెలుగుభాష, ప్రకృతి మీదనే పాడుతున్న కద టీచర్!” అన్నది.
ఇక స్టేజీ డ్యాన్సులకు.. ఆ మాటకొస్తే స్టేజీపైకి ఎక్కడానికే చాలామంది తల్లిదండ్రులు ఒప్పుకొనేవాళ్లుకారు. మాకేమో అటు పాటలూ ఇటు డ్యాన్సులూ రెండూ రావు. ఇప్పుడు ఏ పాటకైనా ఒంట్లోని నట్లూ బోల్టులూ.. ఊడివచ్చేలా స్టెప్పులు ఉంటున్నాయి గానీ, అప్పుడు సింబాలిక్గా కాళ్లూ చేతులూ కదపడమో, ముఖ కవళికల్లోనే భావం పలికించడమో ఉండేది.
“అటవీ స్థలమునకు ఏగెదమా.. వటపత్రమ్ములు కోయుదమా!’, ‘ఏల వచ్చెనమ్మ కృష్ణుడేల వచ్చెను.. ఈ మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసెను’.. లాంటి పాటలకు డ్యాన్సులు చేసేవాళ్లు. అందరూ అబ్బాయిలు గానీ, అందరూ అమ్మాయిలు గానీ నటించే నాటికలను ప్రదర్శించేవారు. అక్క ఓ సారి ‘పెళ్లిచూపులు’ అనే నాటికలో పురుషపాత్రలో నటించింది. అందులో రామారావు, భీమారావు అనే ఇద్దరు పెళ్లికొడుకుల పాత్రలు ఉంటాయి. అమ్మాయిని చూడ్డానికి ఇద్దరు పెళ్లికొడుకులూ వస్తారు. కర్రలాగా సన్నగా, పొడవుగా, తెల్లగా ఉన్న మా అక్క ‘నా పేరు భీమారావు’ అనగానే.. ప్రేక్షకులంతా గొల్లున నవ్వారు. ఆ వెంటనే పార్వతి అనే బొద్దుగా ఉన్నమ్మాయి.. ‘నా పేరు రామారావు’ అనగానే, అందరూ మళ్లీ నవ్వి.. “నీ పేరు భీమారావు ఉండాలి కదా!” అన్నారు. ఇంతకూ అభిజ్ఞ వర్గాల భోగట్టా ఏమిటంటే.. మొదట అన్ని మంచి లక్షణాలున్న ‘రాముడు మంచి బాలుడు’ పాత్ర మా అక్కకు ఇచ్చారట. అయితే పార్వతి.. “నేను లావుగ ఉన్నకదా! ‘భీమారావు’ అనంగనే అందరు నవ్వుతరు. నేనే రామారావు ఉంట” అన్నదట. మొత్తానికి నవ్వడం మాత్రం తప్పలేదు.
నేను తొమ్మిదిలో ఉన్నప్పుడు మా టీచర్ల కోరిక మీద స్కూల్ డే కోసం ‘మంచి స్నేహం’ అనే నాటిక రాశాను. నాకు గుర్తున్నంతవరకూ అదే నా తొలి రచన. క్లాస్లో సోము అనే దొంగపిల్లాడు.. ఎవరిదో పెన్సిల్ కొట్టేస్తాడు. అందరి బ్యాగులూ చెక్ చేసే టైంకి.. పక్కనున్న తన మిత్రుడు రాము బ్యాగ్లో వేస్తాడు. రాము దొరికిపోయి టీచర్ చేత తిట్లుతింటాడు. ‘చెడ్డవాళ్లతో స్నేహం చేయకూడదు. అలాంటివారికి దూరంగా ఉండాలి’ అనేది నీతి. నా మొదటి రచన నాటిక అవడం విశేషమైతే.. అందులో డైలాగ్స్ బాగున్నాయని అందరూ మెచ్చుకోవడం నాకు మంచి జ్ఞాపకం.
ఇప్పుడయితే నేను కచ్చితంగా అలా రాసేదాన్ని కాదు. మనం మంచిగా ఉండటంతోపాటు మన చుట్టూ సమాజంలో ఎందరో సోములు ఉంటారు. వాళ్లను కనిపెడుతూ, పరిసరాలను గమనించే సోయితో మెదిలి.. మనం బుక్ అవకుండా ఉండటం ముఖ్యం అని రాసేదాన్నేమో! ఎవరికి తెలుసు?
నెల్లుట్ల రమాదేవి ( Nellutla Ramadevi ), రచయిత్రి
Ramaayanam | అమ్మే తొలి గురువు
Ramaayanam | సకలకళా.. వల్లభన్!
Ramaayanam | చుట్టాలమ్మో చుట్టాలు 2
“Ramaayanam | చుట్టాలమ్మో చుట్టాలు”