Ramaayanam | ఎక్కడెక్కడి చుట్టాలో వచ్చి.. రోజులకొద్దీ మా ఇంట్లో అలా ఉండిపోయేవారు. వాళ్లలో ఎక్కువమంది మా ఊర్లో ఉన్న డాక్టర్ల దగ్గర వైద్యం చేయించుకోడానికి వచ్చేవారు. ఇందులోనూ ప్రకృతి వైద్య విభాగం వేరే! ఆయుర్వేదం వేరే! దాంతో మా ఇల్లొక హాస్పిటల్లా అనిపించేది.
చుట్టు పక్కల పల్లెటూళ్ల చుట్టాలు కూడా అల్లోపతి వైద్యానికి గానీ, ఇతరత్రా పనులకు గానీ వరంగల్లో, హైదరాబాదో వెళ్లి వస్తూ.. సాయంత్రం అయిందంటే మా ఇంట్లోనే ఉండిపోయేవారు. వాళ్లను అప్పటికే ఇంట్లో ఉన్న వేరే చుట్టాలు.. “ఎహె! ఏం బోతరు? రేపు, ఎల్లుండి ఎట్లయిన అష్టమి, నవమి. అవుతలెల్లుండి అమాశ, దాని తెల్లారి అమాశాంత దినం. మేమున్నం గద! మీరు గూడ నాల్గు రోజులున్నంక పోండి. అందరం కల్సిమెల్సి ఉండొచ్చు” అనేవాళ్లు. మా అమ్మా నాన్నా ప్రేక్షకుల్లా ఎడ్డి ముఖాలేసుకుని.. “అవును! మీరు గూడ ఉండండి” అనేవాళ్లు. అది అంతటితో పోయేది కాదు. వాళ్లకూ, వీళ్లకూ పథ్యం వంటలు వేరే! పాపం.. అవన్నీ చేసీ చేసీ అమ్మ నడుం పోయేది. నాన్న ఎప్పుడూ మందహాస రాముడే! మాకు మాత్రం, చుట్టాలొస్తే రకరకాల పిండివంటలు దొరుకుతాయని భలే ఆనందంగా ఉండేది.
అప్పట్లో తెలంగాణలో అందరూ టీనే తాగేవారు. ఎప్పుడైనా రెగ్యులర్ టీపొడి అయిపోయి, ఇంటి దగ్గరి దుకాణంలో తెప్పించిన టీ పొడితో చాయ్ చేస్తే.. “అయ్యో శకుంతలా! ఎప్పుడున్న తీరు లేదే చాయ్! గీ చాయ్ పత్తా బాగలేదు” అనేవాళ్లు కొందరు. మరికొందరు ఇంకా చనువున్నవాళ్లు.. “ఏమిరా చంద్రయ్యా! మేము తొందరగ పోవాల్నని గీ చాయ్ పత్తా తెప్పిచ్చినావుర!” అని నాన్నతో పరాచికాలాడేవారు. మరి కొంతమంది కాఫీయే తాగుతామనేవాళ్లు. అప్పట్లో కాఫీ తాగడం కొంచెం గొప్ప. “మాకు తిరుపతిలో కాఫీ అలవాటయింది. చాయ్ తాగబుద్ధి అయితలేదు” అనేవాళ్లు. “ఇగ పుట్టినప్పటి నుంచి కాఫీనే తాగినట్టు! తిరుపతిల్నే పెరిగినట్టు ఎడ్డి చేస్తున్నరు” అంటూ నానమ్మ గొణిగేది. “అయ్యో గట్లనకుండీ! పాపం వాండ్లకు అలవాటు గావొచ్చు!” అనేది అమ్మ. ఊర్లో ఉన్న కిరాణా షాపులో కాఫీ బిళ్లలు తెప్పించేది. అవి ఇప్పటి క్యాడ్బరీ చాక్లెట్ బిళ్లల్లా ఉండేవి. ఆ వచ్చిన వాళ్లకు రకరకాల కోరికలుండేవి. “నాకు కొంచెం పడిశెం పట్టింది. బాగ మిర్యాలు ఏసి చారు చెయ్యమ్మా!”.. అని ఒకరు, “చేమకూర బాగ పెరిగినట్టుంది, శనగ బిళ్లల పొట్లాల కూర చెయ్యమ్మా!” అని ఇంకొకరు.. “అయ్యో! మున్గకాయలు ముదిరి పోతున్నయి. తెంపిచ్చి పప్పుచారు చెయ్యరాదమ్మా?!” అంటూ మరొకరు.. ఇలాంటి కోరికలు సామాన్యం.
ఇక కొందరు ముసలివాళ్లయితే చచ్చిపోవడానికే మా ఇంటికి వచ్చేవారు. ఇది నిజం! మా చిన్నప్పుడు మా నాన్నవాళ్ల అమ్మమ్మ చెల్లెలు.. కొరిపెల్లమ్మ ఇలాగే మా ఇంటికి వచ్చింది. నాలుగు చీరెలు ఓ సంచీలో కుక్కుకుని మా ఇంటికి వచ్చి.. “ఇగ నీ దగ్గర్నే ఈ తనువు పోవాల్రా చంద్రయ్యా!” అని డిక్లేర్ చేసింది. మా అమ్మకేసి తిరిగి.. “నీ బిడ్డల తీరుగ నేనొక బిడ్డననుకో! నువ్వు తినేటప్పుడు నాకింత ముద్ద పడెయ్యి!” అన్నది. మా అమ్మ అప్పటికే అంజలీదేవిలా.. “ఎందుకు నాయనమ్మా గట్లంటరు? ఇది మీ మనుమని ఇల్లేనాయె. మీ హక్కు తీరుగ ఉండండి!” అన్నది. ఆ మాటతో ఆమె మురిసి మూడు చెక్కలైంది. నా దర్యాప్తులో తేలిందేమిటంటే.. ఈ కొరిపెల్లమ్మ అసలు పేరు ఆండాళమ్మ. ఆమె అత్తవారి ఊరు సూర్యాపేట దగ్గరలోని కొరిపెల్లి. పాత హిందీ పాటల్లో గీతకర్తల పేర్లు చెప్పేటప్పుడు ‘మజ్రూ సుల్తాన్పురీ’, ‘నక్షలాయ్ పురీ’,
‘హస్రత్ జైపురీ’ అని చెప్పినట్టు.. మా వాళ్లలో కూడా ఈ సంప్రదాయం ఉండేది. మా ఇంట్లోనే ఉండే నానమ్మ చెల్లెల్ని కూడా గొల్లపెల్లమ్మ అనేవారు. శీనేపల్లి ఆయమ్మ, రాయపర్తి అత్తమ్మ, కూనూరు అత్తయ్య.. ఇలా వాళ్ల అసలు పేర్లు చాలామందికి తెలియవు. ఈ కొరిపెల్లమ్మకు పిల్లలు లేకపోవడంతో బంధువుల అబ్బాయిని దత్తత తీసుకున్నదట. ఆస్తి మొత్తం అతనికే ఇచ్చేసి (లేదా అతను తీసేసుకుని), అతడు బాగా చూడకపోవడంతో మా ఇంటికి వచ్చింది. అలా ఆమె మా ఇంట్లోనే ఉన్నప్పుడు మా అమ్మ తరఫు దగ్గరి బంధువుల పెళ్లి వచ్చింది. “నేను అటొచ్చినప్పుడు.. మా చిన్న అమ్మమ్మ పోతే ఎట్ల?! మత్లబు తెలిసి నేను ఒచ్చే వరకు పాచి పీనుగ ఎట్లుంటది?” అని నాన్న రానన్నాడు. ఆ సమయంలో నాన్న వేరే ఊరికి వెళ్లాల్సి వస్తే.. “ఒంట్లె ఎట్లున్నదే అమ్మమ్మా! నేను ఊరికి పోనా?” అని ఆమెను అడిగేవాడు.
“పోయిరా కొడుకా! మంచిగనే ఉన్న!” అనేది ఆమె. ఓసారి మాత్రం.. “ఒద్దు కొడుకా! దగ్గరికొస్తున్నది” అనగానే నాన్న ఆగిపోయాడు. ఈ చర్చ అతి సహజంగా జరగడం ఇప్పుడు తల్చుకుంటే ఆశ్చర్యం వేస్తుంది. చివరికి కొన్ని రోజుల తర్వాత ఆమె చనిపోయింది. ఆమె పెంపుడు కొడుకు సమయానికి రాకపోవడంతో, నాన్నే అంత్యక్రియలు నిర్వహించాడు. ఐదు రోజుల తరువాత వచ్చి.. “మా అమ్మ బంగారం, డబ్బులూ ఇవ్వండి. వెళ్తాను” అని ఆ పెంపుడు కొడుకు గొడవపడ్డాడు. ఆమె ఏమీ తేలేదనీ.. ఇంకా మందులకూ, వెచ్చాలకూ నాన్నే ఇచ్చాడనీ మా ఇంట్లో ఉన్న మిగతా వృద్ధులు చెప్పాక.. చివరికి నాన్నను బస్ చార్జీలు అడిగి తీసుకుని వెళ్లాడు.
ఎందుకో మరి.. దగ్గరివాళ్లలో ఎవరు చనిపోయినా మా ఇంటికే తీసుకువచ్చేవారు. చాలామంది చుట్టాలువచ్చి పదమూడు రోజులయ్యేదాకా మా ఇంట్లోనే ఉండేవారు. అలాంటప్పుడు వంటవాళ్లు కూడా వచ్చేవారుగానీ, సామానూ అదీ నాన్నే తెప్పించేవాడు! అమ్మ చాకిరి సరేసరి! వైద్యానికి వచ్చినవాళ్లు కొన్నిసార్లు డాక్టర్ ఫీజూ, మెడికల్ షాప్ మందుల బిల్లు, కొందరు కిరాణా షాప్ బిల్లు, విత్తనాలు, ఎరువులు, మందులు, బట్టల షాపులో బిల్లులూ.. ఇలా యథోచితంగా నాన్న పేరు చెప్పి, అప్పు పెట్టి వెళ్లిపోయేవారు. ఆయా రుణదాతలు కొన్నాళ్లు వేచి చూసి.. నాన్న కనిపిస్తే అడగడమో, బిల్లు పంపించడమో చేసేవారు. నాన్న మెల్లగా ఈ అప్పులన్నీ అమ్మకు కూడా తెలియకుండా తీరుస్తూ ఉండేవాడు. ఆ బరువును బాధ్యతగానే భావించేవారు ఆయన. ఏనాడూ విసుక్కోలేదు. మనసులోనూ తిట్టుకోలేదు. అదీ వ్యక్తిత్వం అంటే. నాన్న గొప్పదనం మాటల్లో చెప్పలేనిది.
నెల్లుట్ల రమాదేవి ( Nellutla Ramadevi ), రచయిత్రి
“Ramaayanam | చుట్టాలమ్మో చుట్టాలు”
Ramaayanam | పోగొట్టుటలో ఉన్న హాయి-2
Ramaayanam | పోగొట్టుటలో ఉన్న హాయి!