హైదరాబాద్, జూన్ 3 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర 12వ ఆవిర్భావ వేడుకలను మలేషియాలోని మా ట్రేడ్ కన్వెన్షన్ సెంటర్లో ఈనెల 6న అట్టహాసంగా నిర్వహించనున్నారు. బీఆర్ఎస్ ఎన్నారై మలేషియా(బీఏఎం), మలేషియా తెలంగాణ అసోసియేషన్ (మైటా) ఆధ్వర్వంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ వైభవాన్ని ప్రతిబింబించేలా కాకతీయ కళాతోరణం, అమరవీరుల స్మారక చిహ్నాల నమూనాలతో వేదికను తీర్చిదిద్దనున్నారు. వేడుకలకు ముఖ్యఅతిథిగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరుకానున్నారని నిర్వాహకుడు, బీఆర్ఎస్ ఎన్నారై మలేషియా ప్రెసిడెంట్ మారుతి తెలిపారు.
వేడుకల్లో రెండు తెలంగాణ ఎన్నారై యూనియన్లతోపాటు మొత్తం ఎనిమిది తెలుగు సంఘాలు ప్రత్యక్షంగా పాలుపంచుకుంటున్నాయని వెల్లడించారు. మరో 9 యూనియన్లు మద్దతు ప్రకటించాయని పేర్కొన్నారు. మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమయ్యే వేడుకలకు మలేషియా, సింగపూర్, ఆస్ట్రేలియా సహా పలు ఆగ్నేయాసియా దేశాల నుంచి 2,500 మంది తరలిరానున్నారని తెలిపారు. తెలంగాణ సంస్కృతీసంప్రదాయాలు ఉట్టిపడేలా కళారూపాలను ప్రదర్శించనున్నట్టు వివరించారు. కాగా, కార్యక్రమ విజయవంతంపై బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సెల్ అధ్యక్షుడు మహేశ్ బిగాల దృష్టిసారించారు. దీనిపై నిర్వాహకులతో సమీక్షించి పలు సూచనలు, సలహాలు అందిస్తున్నారు.