పెద్దపల్లి, జూన్3: పెద్దపల్లి నియోజకవర్గంలో మట్టి మాఫియాను అరికట్టడం, వడ్ల కొనుగోలులో తరుగు దోపిడీని నియంత్రించడంలో ప్రభుత్వం, అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైందని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి విమర్శించారు. బుధవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్దపల్లి కలెక్టరేట్ ఎదుట రాజీవ్ రహదారిపై ధర్నా చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నియోజకవర్గంలో అక్రమ దందాలు అడ్డగోలుగా సాగుతున్నాయని ధ్వజమెత్తారు.
నియోజకవర్గంలోని చెరువుల్లో మట్టి మాఫియా చెలరేగిపోతున్నదని మండిపడ్డారు. అధికారుల అండదండలతో సాగుతున్న మట్టి మాఫియా దందాను వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. అక్రమంగా ధాన్యాన్ని కట్ చేసిన మిల్లర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, నష్టపోయిన రైతుల ఖాతాల్లో ఆ తరుగు డబ్బులను తిరిగి జమ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టరేట్లో ఏవో బండి ప్రకాశ్కు వినతి పత్రం సమర్పించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రఘువీర్సింగ్, స్థానిక నాయకులు పాల్గొన్నారు.