హైదరాబాద్, జూన్ 3 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని ఇన్ సర్వీస్ టీచర్లకు విద్యాశాఖ శుభవార్త చెప్పింది. అదనంగా స్పెషల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(టెట్)ల నిర్వహణకు పచ్చజెండా ఊపింది. ప్రతి ఏటా రెండు టెట్ పరీక్షల నిర్వహణకు అనుమతిస్తూ విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితారాణా బుధవారం ఉత్తర్వులు విడుదల చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో రెండు టెట్ పరీక్షలు నిర్వహిస్తుండగా, ఇక నుంచి టీచర్ల కోసం ప్రత్యేకంగా రెండు టెట్ పరీక్షలు నిర్వహిస్తారు. ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ను తప్పనిసరి చేస్తూ సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఇటీవలే ఈ గడువును 2028 ఆగస్టు 31 వరకు పొడిగించింది. రాష్ట్రంలో 1.02లక్షల మంది సర్కార్ టీచర్లున్నారు. వీరిలో 27వేల మంది టెట్ పాస్ కాని వారున్నట్టు అధికారులు చెబుతున్నారు. వీరి కోసం ఏడాది నాలుగు చొప్పున టెట్ పరీక్షలు నిర్వహించనున్నారు.
ఏజన్సీల్లోని ఆలయాలకు చట్టప్రకారమే కమిటీలు
హైదరాబాద్, జూన్ 3 (నమస్తే తెలంగాణ): ఏజెన్సీ ప్రాంతాల్లోని ఆలయాలకు పాలక మండళ్లు, నిర్వహణ కమిటీల ఏర్పాటు దేవాదాయ శాఖ చట్టం ప్రకారమే జరుగాలని హైకోర్టు తేల్చి చెప్పింది. వీటి ఏర్పాటుకు ఏజెన్సీ ప్రాంత నిబంధనలు వర్తించబోవని స్పష్టం చేసింది. ఆ ఆలయాలకు స్థానిక గిరిజనులతోనే ట్రస్ట్ బోర్డులు, కమిటీలను ఏర్పాటు చేయాలనడం చెల్లదని తీర్పు వెలువరించింది. ములుగు జిల్లా మంగపేట మండలం మల్లూరులోని శ్రీ హేమాచల లక్ష్మీనరసింహ స్వామి ఆలయ పునరుద్ధరణ కమిటీకి దేవాదాయ శాఖ కమిషనర్ 2024 నవంబర్లో పత్రిక ద్వారా జారీచేసిన నోటిఫికేషన్ను సవాలు చేస్తూ పెసా గ్రామసభ తరఫున కార్యదర్శి కే ఆనందరావు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ సూరేపల్లి నంద విచారణ చేపట్టారు. ఇరుపక్షాల వాదనల అనంతరం న్యాయమూర్తి స్పందిస్తూ.. ఆలయ పునర్ధురణ కమిటీ చట్టప్రకారమే ఏర్పాటైందని తేల్చిచెప్పారు. దేవాదాయ శాఖ చట్టంలోని సెక్షన్ 146 ప్రకారమే కమిషనర్ నోటిఫికేషన్ జారీ చేశారని, ఇది చట్టబద్ధమేనని స్పష్టం చేశారు. తెలంగాణ భూ బదలాయింపు నియంత్రణ నిబంధనలు ఏజెన్సీ ప్రాంతాల్లోని భూముల బదలాయింపునకు మాత్రమే వర్తిస్తాయని, ప్రస్తుత కేసులో భూబదలాయింపు ప్రస్తావనే లేనందున పిటిషన్ను కొట్టివేస్తున్నామని ప్రకటించారు. ఆలయ కమిటీ ఏర్పాటుపై గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేశారు.