Saurabh Bharadwaj : ఢిల్లీలోని బీజేపీ ప్రభుత్వంపై ఆమ్ ఆద్మీ పార్టీ సంచలన ఆరోపణలు చేసింది. రూ.22,000 కోట్ల విలువైన రైస్ స్కాంకు బీజేపీ ప్రభుత్వం సిద్ధమైందని ఆరోపించింది. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఢిల్లీ అధ్యక్షుడు సౌరభ్ భరద్వాజ్ ఈ మేరకు ఎక్స్ ఖాతాలో ఆదివారం దీనికి సంబంధించిన ఆరోపణలు చేశారు. పేద ప్రజలకు అందించాల్సిన బియ్యాన్ని, దారి మళ్లించి, భారీ స్కాంకు బీజేపీ సర్కార్ తెరతీసిందని విమర్శించారు. ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం.. అసోంకు చెందిన ఒక కార్పొరేషన్, ఢిల్లీ ప్రభుత్వం కలిసి ఒక ఒప్పందానికి వచ్చాయి.
ప్రభుత్వం, కార్పొరేషన్ కలిసి ఎఫ్సీఐ (ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా)కు ఒక లేఖ రాశాయి. ఢిల్లీలోని పేద ప్రజలకు సరఫరా చేసేందుకు వీలుగా ప్రతి వారం 31,000 మెట్రిక్ టన్నుల బియ్యం కావాలని కోరింది. అది కూడా మూడేళ్లపాటు ప్రతివారం. ఇక, వారం వారం అందించే ఈ బియ్యం విలువ రూ.143 కోట్లు ఉంటుంది. దీని ప్రకారం.. ప్రతి వారం ఎఫ్సీఐ.. ఢిల్లీ ప్రభుత్వం, అసోం కార్పొరేషన్లకు ఈ బియ్యాన్ని అందించాలి. అయితే, ఈ బియ్యం పేదలకు చేరడం లేదని సౌరభ్ ఆరోపించారు. బియ్యాన్ని పేదలకు పంపిణీ చేయకుండా హరియాణాలోని ఒక ప్రైవేటు సంస్థకు అందిస్తున్నారు. ఈ సంస్త నుంచి సంబంధిత వ్యక్తులు ప్రయోజనం పొందుతున్నారు. అంటే, వారానికి రూ.143 కోట్ల విలువైన బియ్యం.. మూడేళ్లపాటు.. మొత్తం కలిపి రూ.22,000 కోట్లు అవుతుందని సౌరభ్ వివరించారు.
ఈ భారీ కుంభకోణానికి అసోం కార్పొరేషన్తో కలిపి, ఢిల్లీలోని బీజేపీ ప్రభుత్వం తెరతీసిందని ఆయన ఆరోపించారు. పేదలకు దక్కాల్సిన బియ్యాన్ని కాజేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు. అయితే, ఈ అంశంపై ఢిల్లీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. ఢిల్లీలో ప్రస్తుతం రేఖా గుప్తా ఆధ్వర్యంలోని బీజేపీ ప్రభుత్వం పనిచేస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు.. అంతకుముందు ఢిల్లీలో కొనసాగుతున్న ‘సర్’పై కూడా సౌరభ్ సంచలన ఆరోపణలు చేశారు. అనేకమంది అర్హులైన ఓటర్ల పేర్లను సర్ పేరిట తొలగిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ మేరకు ఢిల్లీలో సీఈవో అశోక్ కుమార్ను కలిసి ఫిర్యాదు చేశారు.