Kasi Majili Kathalu Episode 73( కాశీ మజిలీ కథలు ) |జరిగిన కథ : కన్యాకుబ్జాన్ని పాలించే తాళధ్వజుడనే రాజుకు అనేకమంది కుమారులు ఉన్నారు. వారిలో మొదటి అయిదుగురూ.. తూర్పుదిశలో దిగ్విజయ యాత్రలు చేసి, అందగత్తెలను పెళ్లాడి.. తిరిగి ఇల్లు చేరారు.ఆ తరువాతి అయిదుగురి పేర్లు వరుసగా.. విద్యాసాగరుడు, కళాభిరాముడు, హరివర్మ, సుధర్ముడు, సులోచనుడు. వీళ్లు అయిదుగురూ విద్యాసాగరుని ఆధ్వర్యంలో ఒకనాడు తండ్రిని చూడటానికి వచ్చారు.
“తండ్రీ! అన్నల్లాగే మాకు కూడా దిగ్విజయ యాత్రకు అనుమతి ఇవ్వండి” అని కోరాడు విద్యాసాగరుడు.
“తగినంత సైన్యం తీసుకుని ఉత్తరదిక్కుకు వెళ్లండి” అని చెప్పాడు తాళధ్వజుడు. విద్యాసాగరుని ఆధ్వర్యంలో ఆ రాజకుమారులు.. మాళవం, నేపాళం, మగధ, కాశ్మీరం, కోసల, కురు దేశాలను జయించారు. ఆ రాజులందరినీ సామంతులను చేసుకున్నారు. అక్కడితో తృప్తిపడి ఇంటిబాట పట్టారు.
సైన్యాలతో కలిసి ఉత్తర దేశ అరణ్యాల వెంట వస్తుండగా.. వాతదోషం వల్ల పదాతి దళంలోని సైనికులందరూ ఒకరి తరువాత ఒకరుగా రోగపీడితులు
కాసాగారు. ఏనుగులు ఉన్నట్లుండి మావటీలను పడదోయ సాగాయి. గుర్రాలు ముందరికాళ్లు ఎగరేసి రౌతులను కిందపడేయ సాగాయి. ఆ సమయంలో ప్రళయ సూచనగా ఒక జంఝామారుతం బయల్దేరింది. రాజపుత్రులు తమ గుర్రాలనెక్కి అక్కణ్నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు. కానీ, బలమైన గాలి విసురుకు.. ఆ అయిదుగురూ తమ గుర్రాలతో సహా తలోదిక్కుకూ పడ్డారు. పెద్దవాడైన విద్యాసాగరుడు.. గాలి విసురుకు కొట్టుకుపోతూ ఏ చెట్టు కొమ్మనైనా ఆసరాగా పట్టుకోవడానికి ఎంతగానో ప్రయత్నించాడు. కానీ సాధ్యం కాలేదు. చాలాసేపటివరకు గాలికి అలా ఎంతోదూరం కొట్టుకుపోతూనే ఉన్నాడు. చివరికి పర్వతంలాంటి ఒక గోడ అడ్డం రావడంతో గుర్రం నేలకు జారిపోయింది. అంతలో గాలి కూడా తగ్గింది.
దెబ్బలు సవరించుకుంటూ మెల్లగా లేచి, గుర్రానికి అలుపు తీర్చి నలుదిక్కులా పరికించి చూశాడు విద్యాసాగరుడు. అప్పటికే చీకటి పడుతుండటంతో తానెక్కడ ఉన్నదీ తెలుసుకోలేక పోయాడు. ‘ఎటు వెళ్తే ఏం ప్రమాదమో?’ అనే శంకతో.. గుర్రపు జీనును కింద పరుచుకుని, అక్కడే కూలబడ్డాడు. తన తమ్ముళ్లందరూ ఏమైపోయారో అని చింతిస్తూ రాత్రంతా గడిపాడు.
తెల్లవారిన తరువాత తానొక పెద్ద కోటగోడ పక్కన ఉన్నానని తెలుసుకున్నాడు. ఆ గోడ చాలా ఎత్తుగా ఉంది. గోడవెంట ఉత్తరదిక్కుగా చాలాదూరం ప్రయాణించాడు. ఎంత దూరం వెళ్లినా లోనికి వెళ్లేందుకు ద్వారం కనిపించలేదు.
తిరిగి వెనక్కు వచ్చి రెండోదిక్కుగా ముందుకు వెళ్లాడు. కానీ, ఆ దారిలో గుట్టలు ఎక్కువగా ఉండటంతో గుర్రాన్ని నడపలేక పోయాడు. చేసేది లేక బయల్దేరిన చోటికే తిరిగి వచ్చాడు. గుర్రాన్ని మేతకు వదిలి, ఆ గోడను నిశితంగా పరిశీలిస్తూ కొంతసేపు గడిపాడు.
అలా చూడగా చూడగా.. ఒకచోట పైరాళ్లు దొర్లడం వల్ల కోటగోడ కొంచెం ఎత్తు తగ్గడం గమనించాడు. విద్యాసాగరుడు ఆ చోటు గుర్తుపెట్టుకున్నాడు. అక్కణ్నుంచి దూరంగా వెనక్కి వెళ్లి.. గుర్రాన్ని ముందుకు
పరిగెత్తించి, గోడ దూకించడానికి ప్రయత్నించాడు. కానీ ఊతం చాలలేదు. దాంతో రెండుసార్లు వెనక్కు తిరిగి రావాల్సి వచ్చింది.
మూడోసారి కళ్లెం గట్టిగా లాగి పట్టుకున్నాడు. మడమలతో కొడుతూ.. ప్రాణాలు పోయినా సరే ఈసారి కోటదాటక తప్పదని సంజ్ఞచేస్తూ వేగంగా తోలాడు. ఆ గుర్రం కూడా తన శక్తినంతా చూపింది. ఉన్నట్లుండి రెక్కలు మొలిచినట్లు గాల్లోకి లేచింది. అతికష్టంమీద గోడమీదికి లంఘించింది. కోటగోడ మీద రెండు నిమిషాలు నిలబడగలిగింది.
అక్కడ గుర్రం నాలుగుకాళ్లూ నిలపడానికి తగినంత చోటులేదు. అందువల్ల వెంటనే లోపలికి దూకాల్సి వచ్చింది. కానీ, అప్పటికే గుర్రానికి అలసట ఎక్కువై.. గిలగిల తన్నుకుని ప్రాణాలు విడిచిపెట్టింది.
“అయ్యయ్యో! ఉచ్ఛైశ్రవంతో పోల్చదగిన ఉత్తమజాతి అశ్వాన్ని నా తొందరపాటుతో చేజేతులా చంపుకొన్నాను” అని కొద్దిసేపు దుఃఖించాడు విద్యాసాగరుడు. మొలలో ఉన్న కత్తితో ఒక గొయ్యి తవ్వి, గుర్రాన్ని పూడ్చిపెట్టాడు. అక్కణ్నుంచి ఎటూ కదలడానికి మనస్కరించ లేదు. తన గుర్రమే మాటిమాటికీ గుర్తొస్తుండగా.. కన్నీరు కారుస్తూ ఒక రాతిపై కూర్చున్నాడు. కొద్దిసేపటికి తెలియకుండానే నిద్ర పట్టేసింది. ఆ నిద్రలో ఒక కల వచ్చింది. ఆ కలలో తన గుర్రమే కనిపించింది.
“రాజపుత్రా! నాకోసం నువ్వు దుఃఖించాల్సిన అవసరం లేదు. నీలాంటి మహాత్ముడు స్వయంగా అంత్యక్రియలు చేసినందువల్ల నాకు ఉత్తమ లోకాలు కలిగాయి. నీ కృతజ్ఞతకు దేవతలు మెచ్చుకుంటున్నారు. నీవు ఇక్కణ్నుంచి కదిలి పడమర దిక్కుగా వెళ్లు. నీకు మేలు కలుగుతుంది” అని చెప్పింది.
అదిరిపడి లేచిన విద్యాసాగరుడు.. “ఓహో! నా వాహనం మృతిచెందిన తరువాత కూడా, నాకు ఉపకారం చేయడానికే ప్రయత్నిస్తున్నది. ఈ జన్మలో దానిని మరిచిపోగలనా?” అనుకుంటూ, ఆ అశ్వం చెప్పినట్లుగా పడమటిదిశగా నడవసాగాడు.
కొంతదూరం నడిచేసరికి అడవి మందగించింది. ఒక సుందర ఉద్యానవనం కన్నులకు కట్టింది.
‘చూడబోతే ఇక్కడ ఏ మహారాజో నివసిస్తున్నాడు కాబోలు’ అనుకుంటూ మరికొంత ముందుకు వెళ్లాడు. అక్కడ కనిపించిన తటాకంలో స్నానం చేశాడు. గట్టునున్న మామిడిపళ్లు తిని, ఆకలి తీర్చుకున్నాడు. అంతలో దూరం నుంచి ఎవరో తనవైపే గుర్రంపై వస్తుండటం కనిపించింది. మొదట ఎవరో సైనికులు కాబోలనుకున్నాడు. గుర్రం దగ్గరికి వచ్చిన తరువాత కానీ.. ఆ వచ్చింది ఒక స్త్రీ అని తెలియలేదు.
ఆమె గుర్రం దిగి విద్యాసాగరునికి చేరువగా వచ్చి నిలబడింది. జారుజడతో, సగం చందమామ లాంటి నుదురుతో, పెద్ద కన్నులతో విలసిల్లుతున్న ఆ భువనమోహన రూపాన్ని చూసి.. మాటలు రాక తబ్బిబ్బయ్యాడు విద్యాసాగరుడు. ముందుగా ఆమే.. కోకిల స్వరంతో అతణ్ని పలకరించింది.
“కలికీ! ఎవరు నువ్వు? ఎక్కణ్నుంచి వచ్చావు? ఇంతకుముందు నిన్నిక్కడ ఎప్పుడూ చూడలేదే?! నీకోసమే కాబోలు.. నా గుర్రం కళ్లెమెంత లాగినా నిలువకుండా నీ దగ్గరికి లాక్కుని వచ్చింది. మా మేడకు పోదాం రా. నీకు గుర్రం ఎక్కడం వచ్చా?!” అన్నదామె.
ఆమె మాటలకు ఆశ్చర్యపోయాడు విద్యాసాగరుడు. తనను స్త్రీగా సంబోధించడమే కాకుండా.. పురుషుణ్ని చూడగానే స్త్రీలో సహజంగా కనిపించాల్సిన సిగ్గు ఛాయలేమీ ఆమెలో కనిపించక పోవడంతో కొంచెం ఆగి ఆలోచించాడు.
“తరుణీ! నా సంగతి చెప్పాలంటే ముందుగా నీ ఉదంతం వివరించాలి. నీ పేరేమిటి? ఎవరి కూతురివి? నీకు పెళ్లయిందా? ఈ అడవిలో ఎందుకున్నావు?” అని ప్రశ్నించాడు.
అందుకు ఆ అమ్మాయి వింతగా నవ్వింది.
“చెలీ! నువ్వు అడిగిన మాటలేవీ నాకర్థం కాలేదు. నా పేరు ప్రమద్వర అంటారు. నాతో పాటు ఇంకా చాలామంది స్నేహితురాళ్లు ఉన్నారు. వాళ్లనడిగితే నీ ప్రశ్నలకు జవాబులు దొరకగలవు” అన్నది గుర్రంపై కూర్చుని చేయందిస్తూ.
తన వెనుక అతణ్ని కూర్చోబెట్టుకుని, నడుమును గట్టిగా పట్టుకోమని సూచించింది. విద్యాసాగరునికి మేను ఝల్లుమంటున్నది.
‘పాపం! ఈమెకు స్త్రీపురుష వివక్ష తెలియదేమో! నన్నెక్కడికి తీసుకువెళ్తున్నది!?’ అనుకున్నాడు మనసులో.
ఇంతలో ఆమె.. “రమణీ! వడిగా తోలవచ్చునా? భయం లేదు కదా!” అని ప్రశ్నించింది.
ఆ ప్రశ్నకు విద్యాసాగరుడు సిగ్గుపడి.. “నీ ఇష్టం వచ్చినంత వేగంగా తోలవచ్చు” అని సమాధానం ఇచ్చాడు.
అప్పుడు ప్రమద్వర మడమలతో రికాబును కదిలించి వేగం పెంచింది. కొంతసేపటికి వాళ్లు ప్రయాణిస్తున్న గుర్రానికి ఎదురుగా కొందరు యువతులు వచ్చారు.
“యువరాణీ! ఎక్కడికి వెళ్లిపోయావు? నువ్వంత వేగంగా దౌడు తీయడం ఎప్పుడూ చూడలేదు. ఈ అమ్మాయి ఎవరు? మన కోటలోకి ఎలా వచ్చింది?!” అని ప్రశ్నలవర్షం కురిపించారు.
అప్పుడు ప్రమద్వర.. “చెలులారా! ఈ గుర్రం ఎందుకో ఈవేళ వింతగా ప్రవర్తించింది. కళ్లెం పట్టుకుని ఎంత బలంగా లాగినా ఆగలేదు. ఈ చిన్నది ఉన్న తావుకు తీసుకుపోయి ఆపింది. ఈమె ఎవరో నాకూ తెలియదు. ఈమె నన్ను కొన్ని ప్రశ్నలు అడిగింది. అవేమిటో నాకు తెలియలేదు. పదండి! ఇంటికి వెళ్లిన తరువాత మాట్లాడుకుందాం” అంటూ గుర్రాన్ని ముందుకు కదిలించింది.
ఒక పెద్ద కోటలాంటి భవంతి ముందున్న ద్రాక్షపందిరి వద్ద గుర్రాలన్నీ ఆగాయి. కోట లోపలి నుంచి కొందరు తరుణులు బిలబిలమంటూ వచ్చారు. కొందరు కళ్లేలు పట్టుకున్నారు. కొందరు చేయందించి గుర్రాలపైనున్న వారిని కిందికి దించారు. కొందరు పాదుకలు తొడిగారు.
ప్రమద్వర అప్పుడు విద్యాసాగరుని చిటికెనవేలు పట్టుకుని.. “సఖీ! పాపం నువ్వు చాలా బడలికగా ఉన్నావు. పద.. కడుపునిండా తిని, విశ్రాంతి తీసుకుందువు గానీ..” అంటూ మేడమీదికి తీసుకుపోయింది.
విద్యాసాగరుడి ఆశ్చర్యానికి అంతు లేకుండా ఉంది.
‘వీళ్లందరూ నన్ను ఆడదాన్ని అనుకుంటున్నారు. వీళ్లంతా కావాలని నాటకం ఆడుతున్నారని అనుకోవడానికి వీల్లేకుండా ఉంది. వీరు నన్ను చూసి సిగ్గుపడి, తమ అవయవాలు కప్పుకోవడం లేదు. ఒకవేళ నేనే పురాణంలో ఇళునిలా స్త్రీగా మారిపోయానేమో అనుకోవడానికి నా రూపంలో మార్పేమీ కనిపించడం లేదు. వీరిలా పొరబడటానికి కారణం తెలియదు. పోనీ అడుగుదామంటే ఇక్కడ మరో మగపురుగు కానరావడం లేదు’ అని తనలో తాను మధన పడసాగాడు.
“ఈమెకు కావాల్సిన సదుపాయాలు చేయండి” అని అక్కడున్న వారిని ఆజ్ఞాపించి ప్రమద్వర అక్కణ్నుంచి వెళ్లిపోయింది.
అంతలో అక్కడికి ఒక వృద్ధ మహిళ వచ్చింది. అందరూ ఆమెకు నమస్కరించారు. ఆమెను తమ ఉపాధ్యాయురాలిగా విద్యాసాగరునికి పరిచయం చేశారు.
ఆ ఉపాధ్యాయురాలు విద్యాసాగరుని వద్దకు వచ్చి.. “అమ్మాయీ! ఎవరు నువ్వు? ఇక్కడికెలా వచ్చావు?” అని ప్రశ్నించింది.
ఆ ప్రశ్నకు విద్యాసాగరుడు హతాశుడైపోయాడు.
“అవ్వా! ఇక్కడున్న వారందరిలోనూ నువ్వే పెద్ద దానివి. అనుభవం పండినదానివి. వాళ్లందరూ నన్ను స్త్రీగా భావించినా సరిపెట్టుకున్నాను. ఇప్పుడు నువ్వు కూడా నన్నలాగే సంబోధిస్తున్నావు. సరే కానివ్వు. ముందు మీ విషయం చెబితే కానీ, నేను నా సంగతులు చెప్పలేను. ఈ మహారణ్యంలో మగతోడు లేకుండా మీరందరూ ఎందుకు ఉన్నారు? అసలెలా ఉండగలుగుతున్నారు?” అని ప్రశ్నించాడు.
వెంటనే ఆమె నోటిపై వేలును ఉంచుకుంది.
“ఇక్కడ పురుష శబ్దం వినిపించకూడదు. పద.. అలా దూరంగా వెళ్లి మాట్లాడుకుందాం” అంటూ విద్యాసాగరుని చేయి పుచ్చుకుని తీసుకువెళ్లింది.
“అవ్వా! ఇక్కడ పురుష శబ్దమే పనికిరాదా? ఎందుకు.. కారణమేమిటి? తెలుసుకోవాలని నాకు కుతూహలంగా ఉంది. త్వరగా చెప్పు” అని అడిగాడు విద్యాసాగరుడు.
అప్పుడు ఆ ఉపాధ్యాయురాలు ఇలా చెప్పింది.. కాశ్మీరదేశాన్ని శ్రీవర్ధనుడనే రాజు పాలిస్తున్నాడు. కుబేరునితో సమానుడైన ఆయనకు సావిత్రీపూజా ఫలంగా ఒక కుమార్తె కలిగింది. ఆమె బారసాలకు దేశదేశాల నుంచి అనేకమంది రాజులు విచ్చేశారు. ఉత్సవం పూర్తయిన తరువాత అందరితోపాటు వెనక్కి తిరిగి వెళ్లిపోతున్న నేపాళ చక్రవర్తిని మాత్రం.. శ్రీవర్ధనుడు నిర్బంధంగా తన రాజ్యంలో కొద్దిరోజులు నిలిపేశాడు.
“మిత్రమా! నీతో వియ్యమందాలని నా కోరిక. నిశ్చితార్థం జరిపించుకుని కానీ, నువ్వు మా దేశం విడిచిపెట్టి వెళ్లడానికి వీల్లేదు” అన్నాడు శ్రీవర్ధనుడు.
అప్పుడు నేపాళ రాజు.. “మిత్రమా! నా కుమారునికి తగిన గుణాలు కలిగిన కన్య దొరకడం కష్టం. అయినా నువ్వింత మోజు పడుతున్నావు కనుక, నాకు కాబోయే కోడలిని నా అభీష్టానికి అనుగుణంగా పెంచుతానని మాటిస్తే.. తాంబూలాలు పుచ్చుకుందాం” అని పలికాడు.
“నీ అభీష్టం ఏమిటో సెలవివ్వు” అని అడిగాడు శ్రీవర్ధనుడు.
“నాకు కాబోయే కోడలు జ్ఞానం వచ్చింది మొదలు.. భర్త తప్ప, మరో పురుషుడి ముఖం చూడకూడదు. తండ్రి, అన్నదమ్ములతో సహా పురుషజాతి అనేది ఒకటి ఉంటుంది అని కూడా ఆమెకు తెలియకూడదు. ఆ విధంగా నీ కూతురిని ఒక రహస్య స్థలంలో ఉంచి ఈడు వచ్చేవరకు పెంచగలిగితేనే ఈ పెళ్లి ఖాయం చేసుకుందాం. లేదంటే ఇక్కడితో ఈ సంగతి మరిచిపోదాం” అన్నాడు నేపాళ రాజు కఠినంగా.
(వచ్చేవారం.. మహిళారాజ్యంలో మగధీరుడు-2)
– అనుసృజన
నేతి సూర్యనారాయణ శర్మ
Kasi Majili Kathalu | పాతాళాన్ని గెలిచిన మానవుడు
Kasi Majili Kathalu | సుధన్వుడి రససిద్ధి
Kasi Majili Kathalu | పాతాళ గుహ
Kasi Majili Kathalu | అపరాధ విచారణ
Kasi Majili Kathalu | రత్నాంగి తెచ్చిన తగాదా
Kasi Majili Kathalu | విడిపోయిన జంట
Kasi Majili Kathalu | అతివ సాహసం
Kasi Majili Kathalu | ఆమె పేరు పద్మిని