Kasi Majili Kathalu Episode 53 ( కాశీ మజిలీ కథలు ) | జరిగిన కథ : విక్రమార్క చక్రవర్తి కుమారుడు కీర్తికేతుడు పరమలోభి. అతడి కుమారుడు విజయభాస్కరుడు.. తాతలా దయాపరుడు. తండ్రి విధించిన మరణశిక్ష నుంచి తప్పించుకుని తల్లితో కలిసి వెళ్తూ, దారిమధ్యలో కలభాషిణి అనే రాచకన్యను రక్షించాడు. ఆ యువతిని కాపాడినందుకు ఆమె తండ్రి ఇచ్చే బహుమానాన్ని నిగమశర్మ అనే బ్రాహ్మణునికి వచ్చేలా చేశాడు. ఆ తర్వాత, రత్నకూట నగరానికి చేరుకున్నాడు. అక్కడ రాజు ఇవ్వజూపిన బంగారానికి ఆశపడి, దేవభట్టు అనే బ్రాహ్మణ దంపతులు తమ కుమారుణ్నే బలివ్వబోయారు.
“అన్నా! చూశావా ఈ దారుణం. నా తండ్రి చివరికి నన్ను బలివ్వడానికి సిద్ధపడ్డాడు” అన్నాడు గుణసాగరుడు గోలుగోలున ఏడుస్తూ. విజయభాస్కరుడు అతణ్ని ఓదార్చాడు. దేవభట్టు ముందుకు వెళ్లి.. “అయ్యవారూ! నేను మీ కుమారునికి అభయమిచ్చాను. అతనికి బదులుగా నన్ను రాజుగారి దగ్గరికి తీసుకు వెళ్లండి. మీ కుమారుడినని చెప్పండి. నన్ను బలి ఇచ్చి, ఆ బంగారు విగ్రహాన్ని పొందండి” అన్నాడు.
దేవభట్టుకు ఆశ్చర్యం, ఆనందం ముప్పిరిగొన్నాయి. అతడి భార్య ఈ పనికి ముందు ఒప్పుకోలేదు. కానీ, విజయభాస్కరుని పట్టుదల వల్ల ఆమెకూడా సరేనన్నది.
చివరిలో విజయభాస్కరుడు ఒక షరతు పెట్టాడు. దానిప్రకారం.. ‘రాబోయే బహుమతిలో సగభాగం గుణసాగరునికి ఇవ్వాలి. అతణ్ని కూడా మిగిలిన పిల్లలతో సమానంగా చూడాలి’. అందుకు దేవభట్టు దంపతులు ఒప్పుకొన్నారు. ఆ మరునాడు తల్లికి తెలియకుండా దేవభట్టు దంపతుల వెంట వెళ్లాడు విజయభాస్కరుడు. వాళ్లు ముగ్గురినీ తీసుకుని మర్రిచెట్టు వద్దకు వెళ్లాడు చంద్రావలోకుడు. అక్కడ విజయభాస్కరుణ్ని వెల్లకిలా పడుకోబెట్టి, కాళ్లూ చేతులను దేవభట్టు దంపతులు పట్టుకున్నారు.స
మరోక్షణంలో కత్తివేటు పడబోతున్నదనగా.. “ఆగు” అన్న అరుపు వినిపించింది.
అప్పుడు ఆ బ్రహ్మరాక్షసుడు.. “రాజా! చూశావా.. ఆ దంపతులిద్దరి కన్నుల్లో చుక్కనీరు లేదు. పైగా వాళ్ల ముఖాలు ఆనందంతో వెలిగిపోతున్నాయి. నాకేదో అనుమానంగా ఉంది. ఈ కుర్రాడు వాళ్ల కొడుకేనా? సరిగ్గా కనుక్కో” అన్నాడు హుంకరిస్తూ.
చంద్రావలోకుడు కత్తి ఝళిపించాడు. దేవభట్టు దంపతులు గడగడ వణికిపోయారు.
అప్పుడు విజయభాస్కరుడు కల్పించుకుని.. “అయ్యా! నన్ను కొడుకుగా భావించమని నేనే వాళ్లతో చెప్పాను. నేను స్వచ్ఛందంగానే బలి కావడానికి వచ్చాను. ఇందులో వారి తప్పేమీ లేదు” అని చెప్పాడు.
“బలి కావడానికి స్వచ్ఛందంగా వచ్చావా? ఎవడవురా నువ్వూ” అన్నాడు బ్రహ్మరాక్షసుడు విస్తుపోతూ.
“నేను విక్రమార్క మహారాజుగారి మనవడిని. నాపేరు విజయభాస్కరుడు” చెప్పాడతను.
ఆ మాటలు వింటూనే బ్రహ్మరాక్షసుడు కూర్చున్న చోటునుంచి గబుక్కున లేచాడు. విజయభాస్కరుని ముందు సాగిలపడ్డాడు.
“దేవా! బేతాళుడు మా ఏలిక. ఆయనకు ప్రభువు విక్రమార్కులవారు. వారి మనుమలంటే.. మీరు మాకు పూజనీయులు. నా తప్పిదాన్ని మన్నించండి. ఈ చంద్రావలోకుడి వల్లే నాకు మీ దర్శనం కలిగింది. ప్రభూ! నాకు మీ పాదస్పర్శను అనుగ్రహించండి. దానివల్ల శాపవిమోచనం పొందుతాను” అని వేడుకున్నాడు.
విజయభాస్కరుని పాదాలను తాకగానే బ్రహ్మరాక్షసుడు తేజోరూపాన్ని ధరించి, అక్కడినుంచి వెళ్లిపోయాడు.
అప్పుడు చంద్రావలోకుణ్ని ఉద్దేశించి.. “రాజా! మీరు చెప్పిన ప్రకారం ఆ బంగారు విగ్రహాన్ని ఈ దంపతులకు ఇప్పించండి” అన్నాడు భాస్కరుడు.
చంద్రావలోకుడు ఆనందంగా అంగీకరించాడు.
“కుమారా! నువ్వు మాకు మహోపకారం చేశావు. నాతోపాటు నా రాజ్యానికి వస్తే నిన్ను సోదరునిలా చూసుకుంటాను” అన్నాడు.
కానీ, ఆ ప్రతిపాదనకు విజయభాస్కరుడు అంగీకరించలేదు. దేవభట్టు ఇంటికి వెళ్లి, తన తల్లిని తీసుకుని ఆ రాజ్యంనుంచి నిష్క్రమించాడు. కొద్దిరోజుల ప్రయాణం తరువాత శోభావతి అనే పట్టణానికి చేరుకున్నాడు.
* * *
ఆ పట్టణాన్ని ఏలే యశస్కరుడు సహృదయుడు అని తెలుసుకుని, ఒకనాడు కొలువు కూటానికి వెళ్లాడు విజయభాస్కరుడు. అతని రూపురేఖలను గమనించిన ఆ రాజు.. “కుమారా! ఎవరు నువ్వు? నీది ఏ దేశం? నీ తల్లిదండ్రులెవ్వరు? ఏపని మీద ఇక్కడికి వచ్చావు?” అని ఔదార్యంతో ప్రశ్నించాడు.
అందుకు సమాధానంగా..
“నా పేరు విజయభాస్కరుడు. నేను క్షత్రియుణ్ని. ఒక కారణం చేత తండ్రికి దూరమై, నా తల్లితో కలిసి ఈ పట్టణానికి వచ్చాను. ప్రస్తుతం ఉద్యోగం కోరి మీ కొలువుకు వచ్చాను. నెలకు నూరు వరహాలు వేతనంగా ఇచ్చి, నీచపు పనులకు వినియోగించకుండా ఉంటే మీ కొలువులో ఉండగలను” అని విజయభాస్కరుడు చెప్పాడు.
“సరే.. నువ్వు కోరినంత వేతనం ఇస్తాను. నీకేం ఉద్యోగం ఇవ్వాలో తరువాత ఆలోచిద్దాం” అని అప్పటికి యశస్కరుడు కొలువు చాలించాడు.
ఆనాటినుంచి రాజోద్యోగులకు ఉచితమైన వేషాన్ని ధరించి, ప్రతిరోజూ కొలువుకు వెళ్లేవాడు విజయభాస్కరుడు. అతనికి ఏ పనీ చెప్పకుండా తన ఎదురుగా కూర్చోబెట్టుకునేవాడు యశస్కరుడు.
అలా కొంతకాలం గమనించిన తరువాత, విజయభాస్కరుని గుణశీలాలను గురించి యశస్కరుడు ఒక అంచనాకు వచ్చాడు. అంతఃపుర రక్షణాధికారిగా నియమిస్తూ ప్రకటన పత్రాన్నిచ్చాడు. విజయభాస్కరుడు బాధ్యతలు చేపట్టాడు. ఆనాటినుంచి అంతఃపురంలో భద్రత కట్టుదిట్టం అయింది. కొద్దిరోజులు అంతా బాగానే గడిచింది.
యశస్కరునికి ముగ్గురు రాణులు ఉన్నారు. మూడురోజులకు ఒకరి వద్ద చొప్పున రాజు తన భార్యలతో గడుపుతుంటాడు. విజయభాస్కరుని రాక తరువాత అంతఃపురంలో పోతుటీగకు కూడా ప్రవేశం లేకుండా పోయింది. స్త్రీలకు సైతం రాకపోకలు సాగించాలంటే అనుమతి తప్పనిసరి అయింది.
యశస్కరుని చిన్నభార్య పేరు మంజువాణి. ఆమెకు సుముఖుడనే మంత్రితో సంబంధం ఉండేది. భర్త తన వద్దకు రానిరోజుల్లో సుముఖుణ్ని రహస్యంగా తనవద్దకు రప్పించుకునేది. కానీ, విజయభాస్కరుని వల్ల మంజువాణి ప్రేమ కలాపాలకు ఆటంకం ఏర్పడింది.
దాంతో ఒకరోజు సుముఖుడు స్త్రీవేషం ధరించి, కొన్ని నకిలీ పత్రాలు తయారుచేసి.. అతికష్టం మీద మంజువాణి వద్దకు వెళ్లాడు. తెల్లవారుజామున మళ్లీ స్త్రీవేషంలోనే తిరిగి బయటికి వెళ్లడానికి ప్రయత్నించబోతే.. “తెల్లవారే వరకు బయటికి వెళ్లడానికి ఎవరికీ అనుమతి లేదు” అని విజయభాస్కరుడు అడ్డుకున్నాడు.
అప్పుడు మంజువాణి కలగచేసుకోవాల్సి వచ్చింది. స్వయంగా తానే విజయభాస్కరుడు ఉండేచోటుకు తరలివచ్చి, మంత్రిని ఎలాగో బయటికి పంపగలిగింది. కానీ, విజయభాస్కరుడి రూపలావణ్యాలను చూసేసరికి ఆమెకు కన్ను చెదిరిపోయింది. ఆ రోజంతా ఆమెకు మనసు మనసులో లేదు.
రాత్రివేళ పనేమీ లేకపోయినా విజయభాస్కరుడు ఉన్నచోటుకు వెళ్లి, ఏదో ఒకటి కల్పించుకుని మాట్లాడటం మొదలుపెట్టింది. రెండర్థాలు వచ్చే మాటలతో అతణ్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నించింది. కానీ, అనుభవ లేమితో విజయభాస్కరుడు ఆమె చెప్పేది సరిగా అర్థం చేసుకోలేకపోయాడు.
“అతడికి ముల్లోకాలనూ మోహింప చేయగలిగిన సౌందర్యం ఇచ్చిన బ్రహ్మదేవుడు.. కాస్తంత రసికత్వాన్ని కూడా ఇచ్చి ఉంటే నాకీ పాట్లు లేకపోవును కదా!” అన్నది రాణి.. దాసిముందు గోడు వెళ్లబోసుకుంటూ.
“మాటలతో లాభం లేనప్పుడు క్రియలోకి దిగడమే!” అని సలహా చెప్పింది దాసి.
ఆమె సలహాను అనుసరించి మరునాటి రాత్రి, విజయభాస్కరుడు కత్తి చేతబట్టుకుని పహరా కాస్తుండగా వెనుకమాటుగా వెళ్లి అతణ్ని కౌగిలించుకుంది మంజువాణి. విజయభాస్కరుడు అతిప్రయత్నం మీద ఆమె పట్టు విడిపించుకున్నాడు.
“ద్రోహురాలా! ఎంత పనిచేశావు? నిన్నేం చేసినా పాపం లేదు” అంటూ కత్తి ఎత్తి.. చంపడానికి చేతులురాక దాన్నక్కడే పడేసి విసవిసా వెళ్లిపోయాడు.
కామం తీరకపోతే క్రోధం ఆవేశిస్తుంది. అటువంటి క్రోధం మానవుణ్ని మూఢుణ్ని చేస్తుంది. మంజువాణి అనాలోచితంగానే కిందపడ్డ కత్తిని చేతిలోకి తీసుకుంది. వెళ్లిపోతున్న విజయభాస్కరునిపైకి విసిరింది.
ఆమె దురదృష్టం.. కత్తి గురి తప్పింది. వెనుకవాటున కత్తి వస్తున్నదని గమనించని విజయభాస్కరుడు ముందుకు వెళ్లిపోయాడు. మంజువాణి మందిరంలో దూరడానికి అక్కడే కాచుకుని కూర్చున్న సుముఖుడి గుండెల్లో దిగింది ఆ కత్తి. ఆ దృశ్యం చూసి, మంజువాణి మ్రాన్పడిపోయింది. ఆమె దాసి రంగప్రవేశం చేసి.. మంత్రి సుముఖుని మృతదేహాన్ని ఎత్తి కందకంలో పడదోసింది. ఆ తతంగమంతా పూర్తయ్యేసరికి తెల్లవారింది.
అప్పుడు యశస్కరుని వద్దకు వెళ్లి..
“మహారాజా! విజయభాస్కరుడు చేసిన దుష్కృత్యం చూశారా? మహారాణిగారిపై అత్యాచారం చేయబోయాడు. మాకేం చేయాలో తోచక, మంత్రి సుముఖులవారికి కబురు చేశాం. అతగాడు ఆయనతో ఘర్షణ పడుతున్నాడు. ఏం చేస్తాడో ఏమో.. మీరే కాపాడాలి” అన్నది దాసి.
యశస్కరుడు పరుగు పరుగున వచ్చాడు. అక్కడ ఎవరూ లేరు. ఇంతలో భటులు వచ్చి.. ‘సుముఖుల వారి శవం కందకంలో తేలుతున్నది’ అని వార్తను అందించారు.
దాంతో కోపోద్రిక్తుడైన రాజు సూటిగా విజయభాస్కరుని ఇంటికి వెళ్లాడు. అప్పటికే తన తల్లితో కలిసి, ఆ రాజ్యం విడిచిపెట్టి పోవడానికి సిద్ధమవుతున్న భాస్కరుణ్ని బంధించాడు. జరిగిన సంఘటనపై విచారణ చేపట్టాడు. తన కళ్లముందే దాసి చెప్పిన సాక్ష్యాన్ని విన్న విజయభాస్కరుడు నిశ్చేష్టుడయ్యాడు.
“దీనికి నీ సమాధానం ఏమిటి? నువ్వు నేరం చేయలేదని నిరూపించుకోగలవా?” అన్నాడు యశస్కరుడు.
తను నిరపరాధినని నిరూపించే సాక్ష్యమేదీ లేదు.
‘సుముఖుడు ఎలాగూ చనిపోయాడు. ఇకనుంచైనా మంజువాణి బుద్ధి తెచ్చుకుని తన ప్రవర్తన చక్కదిద్దుకుంటే అంతే చాలు!’ అనుకున్నాడు విజయభాస్కరుడు. రాజు అడిగినదానికి సమాధానం చెప్పకుండా మౌనం దాల్చాడు.
“ఇతడు మౌనంగా ఉండటాన్ని బట్టి నేరం చేసినట్లు తెలుస్తున్నది. ఈ తప్పునకు సరైన దండన ఉరిశిక్ష” అని తన అభిప్రాయం చెప్పాడు న్యాయ మంత్రి.
కానీ, యశస్కరునికి మనసు ఒప్పలేదు.
“ఇతడి ముఖంలో ఎక్కడా అపరాధభావం లేదు. నేరం చేసి ఉంటాడంటే అంగీకరించ లేకపోతున్నాను. ప్రత్యక్ష సాక్ష్యాన్ని పరిగణనలోకి తీసుకుని, ఇతడికి ద్వీపాంతరవాస శిక్ష విధిస్తున్నాను” అని తీర్పు చెప్పి, సింహాసనం నుంచి పైకి లేచాడు యశస్కరుడు.
బంధితుడైన విజయభాస్కరుణ్ని భటులు సముద్రతీరానికి తీసుకుపోయి ఓడ ఎక్కించారు.
అన్నెంపున్నెం ఎరుగని తన కుమారునికి అంతటి శిక్షపడిందని తెలిసి చారుమతీదేవి కన్నీరు మున్నీరుగా విలపించసాగింది.
ఆ రాత్రికి యశస్కరునికి నిద్రపట్టలేదు. మారువేషం ధరించి పట్టణంలో తిరుగాడసాగాడు. ఒక ఇంటి అరుగుమీద కూర్చుని ఉండగా లోపలినుంచి వినిపించిన ఆ ఇంటివారి మాటలు అతణ్ని ఆలోచనలో పడేశాయి.
“ఆ పిల్లవాణ్ని శిక్షించడం అన్యాయం” అన్నది ఓ స్త్రీ గొంతు.
“అన్యాయం అంటావేమిటి? మహారాణినే చెరబట్టాలని ప్రయత్నించినవాణ్ని శిక్షించరా? రాజుగారింకా మంచివాడు కాబట్టి ఉరి తీయించలేదు” అన్నాడు భర్త.
“ఆ మంజువాణికి సుముఖుడికి ఉన్న సంబంధం.. మీ మహారాజుకి తప్ప లోకానికంతటికీ తెలుసు. అర్ధరాత్రిపూట అత్యాచారం జరిగితే అంతఃపురంలో ఎవరూ లేనట్లు ఎక్కడో ఉన్న మంత్రిగారికి కబురు చేశారట. ఎక్కడన్నా విన్నామా ఈ విడ్డూరం?! మీకూ, మహారాజుకూ మతి లేకపోతే సరి. నాకే గనక న్యాయాధికారం ఇస్తే తేల్చి ఉండేదాన్ని వీళ్ల సంగతి” అన్నది భార్య.
..ఆ మాటలన్నీ జాగ్రత్తగా విన్న యశస్కరుడు తిరిగి అంతఃపురానికి వచ్చాడు. మరునాడు తెల్లవారుతూనే ఆ భార్యాభర్తలను, విజయభాస్కరుని పొరుగువారిని కూడా కొలువుకూటానికి రప్పించాడు.
ముందుగా పొరుగువారిని ప్రశ్నించి, విజయభాస్కరుని ప్రవర్తన గురించి తెలుసుకున్నారు. వాళ్లంతా ముక్తకంఠంతో అతడు సత్యసంధుడని, ఏ మచ్చలేని గుణశీలాలు కలవాడని చెప్పారు.
ఆ తరువాత గతరాత్రి తనకు జ్ఞానోదయం కలిగించిన స్త్రీమూర్తికి నమస్కరించి.. “తల్లీ! నేను న్యాయం చేయలేని అసమర్థుడినయ్యాను. దయచేసి ఈ సమస్య తీర్చు. నీకు అన్ని అధికారాలూ అప్పగిస్తున్నాను” అన్నాడు.
ఆమె ముందుగా తబ్బిబ్బు పడ్డా, రాజు ప్రోత్సాహంతో కార్యరంగంలోకి దూకింది. మంజువాణి మందిరంలో శోధించి, సుముఖుడు ఆమెకు రాసిన ప్రేమలేఖలు వెలికి తీసింది. ఆ తరువాత దాసీలను విడివిడిగా ప్రశ్నించి.. వారి సాక్ష్యాలన్నీ ఒకదానికొకటి పొంతన లేవని తేల్చింది.
దాంతో యశస్కరుడు హతాశుడైపోయాడు. ద్వీపాంతరానికి పంపిన ఓడను హుటాహుటిన వెనక్కి పిలిపించండని ఆజ్ఞలు జారీ చేశాడు.
కానీ, అప్పటికే పరిస్థితి చేయిజారిపోయింది.
(వచ్చేవారం.. సముద్రంలో రహస్యమందిరం)
– అనుసృజన
నేతి సూర్యనారాయణ శర్మ
Kasi Majili Kathalu | దయాపరుడు
Kasi Majili Kathalu | విక్రమార్కుని మనుమడు
Kasi Majili Kathalu | ఉత్తమ ఇల్లాలు
Kasi Majili Kathalu | గెలుపు ఎప్పుడూ మంచికే!
Kasi Majili Kathalu | ఇద్దరు మోసగాళ్లు
Kasi Majili Kathalu | శ్రీశైలంలో దేవకన్య
Kasi Majili Kathalu | వామన గుహ
Kasi Majili Kathalu | నలుగురు రాకుమారులు