హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 11(నమస్తే తెలంగాణ)/ఖైరతాబాద్,: ఖమ్మంలో అభంశుభం తెలియని బాలికపై అఘాయిత్యం, హత్యాయత్నం జరిగి నాలుగు రోజులైనా మంత్రులు ఏం చేస్తున్నారు? రాష్ట్రంలో ఇంత ఘోరం జరిగితే ప్రభుత్వం స్పందించాల్సిన తీరు ఇదేనా? అంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్లీడర్ తన్నీరు హరీశ్రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రెండు చేతులకు ఫ్రాక్చర్ అయ్యి, తిరిగి కోలుకోలేని పరిస్థితిలో ఉన్న ఆ చిన్నారిని చూస్తుంటే గుండె తరుక్కుపోతున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. నిమ్స్లో చికిత్స పొందుతున్న బాలికను గురువారం మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డితో కలిసి ఆయన పరామర్శించారు.
ఆమెకు అందుతున్న వైద్యం గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇలాంటి ఘటన జరుగడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఆ చిన్నారి ప్రస్తుతం నడువలేని స్థితిలో ఉన్నదని, భవిష్యత్తులో కూడా నడువలేదని వైద్యులు చెబుతు ఎంతో బాధ కలిగిందని ఆందోళన వ్యక్తంచేశారు. ఆ బాలిక పరిస్థితికి ప్రభుత్వమే కారణమని ఆగ్రహం వ్యక్తంచేశారు.
బాధితులి పట్ల ఈ ప్రభుత్వం అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహస్తున్నదని, కనీస బాధ్యత కూడా లేదా అని నిప్పులుచెరిగారు. తక్షణమే ఫాస్ట్ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి, ఇలాంటి దారుణాలకు పాల్పడే మృగాలను ఉరితీయాలని డిమాండ్ చేశారు. అప్పుడే ఇంకొకరు ఇలాంటి తప్పులు చేయాలంటే భయపడుతారన్నారు.
సొంత జిల్లాలో ఇంత దారుణం జరిగితే ఉప ముఖ్యమంత్రి, మరో ఇద్దరు మంత్రులకు కనీసం పట్టింపు లేదా అని హరీశ్రావు దుయ్యబట్టారు. ప్రతిపక్ష నేతలు వస్తున్నారంటే వంద మంది పోలీసులను మోహరించడంపై ఉన్న శ్రద్ధ, ఆ బాలికకు ఉచితంగా మందులు ఇప్పించడంపై లేదాని తూర్పారబట్టారు. ఈ అఘాయిత్యాన్ని వెలుగులోకి తెచ్చి పోలీసుస్టేషన్లో కేసు పెట్టి బాధిత కుటుంబానికి అండగా నిలిచిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రజక సంఘం అధ్యక్షుడు ముదిగొండ రాంబాబును కేసు పెట్టి జైల్లో వేస్తామని ఖమ్మం పోలీసులు బెదిరించడం అత్యంత దారుణమని మండిపడ్డారు. డీజీపీ తక్షణమే సదరు పోలీసు అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
బాధిత బాలిక కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే రూ.10లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని హరీశ్రావు డిమాండ్ చేశారు. మెరుగైన వైద్యం అందించడంతో పాటు సర్జరీలన్నీ పూర్తి చేసి ఆమె పూర్తిగా కోలుకునేంత వరకు అయ్యే ఖర్చులన్నీ భరించాలని చెప్పారు. బాధిత బాలికకు బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా అండగా ఉంటుందని, మాజీ ఎమ్మెల్యే ఉపేందర్రెడ్డి, తాము పార్టీ తరపున కొంత ఆర్థిక సాయం అందించామని, భవిష్యత్తులోనూ ఆ కుటుంబానికి అండగా ఉంటూ కంటికి రెప్పలా కాపాడుకుంటామని హామీ ఇచ్చారు.
ప్రభుత్వం చేతగానితనం వల్లే రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని హరీశ్రావు ఎండగట్టా రు. రాష్ట్రంలో రోజుకు 5నుంచి 6 పోక్సో కేసులు నమోదవుతుండటం అత్యంత బాధాకరమని ఆందోళన వ్యక్తంచేశారు. వికారాబాద్ జిల్లా యాలాల్, బొమ్మరాసిపేట, బషీరాబాద్, మోమిన్పేట, నిర్మల్లో బాలికలపై జరిగిన లైంగికదాడులే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. కరీంనగర్లో పట్టగలు దొంగతనం, హైదరాబాద్ నడిబొడ్డున అడిషనల్ డీజీ భార్య హత్య కేసు, ఖమ్మం జిల్లాలో సెల్ఫోన్ దుకాణంలో లూటీ వంటి ఘటనలో ఇప్పటి వరకు రికవరీ కాలేదని ధ్వజమెత్తారు. కొంతమంది పోలీసులు సోషల్ మీడియాలో పీఆర్ స్టంట్ల కోసమే పనిచేస్తున్నారని విమర్శించారు. పౌరులను కాపాడాల్సిన సైబర్ సెక్యూరిటీ వింగ్ ఎక్స్ అకౌంట్, వబ్సుటై హ్యాక్ కావడమే ప్రభుత్వ చేతకానితనానికి అద్దం పడుతున్నదని మండిపడ్డారు. కేసీఆర్ హయాం లో మహిళల రక్షణ కోసం ఉమెన్ ప్రొటెక్షన్వింగ్లను అమలు చేశామని, నేడు ఆ విభాగానికి అడిషనల్ డీజీగా ఉన్న అధికారికే అదనంగా బాధ్య లు అప్పగించి మహిళా భద్రతను గాలికి వదిలేశారని నిప్పులు చెరిగారు.
బాధిత బాలికది అత్యంత పేద కుటుంబమని, ఘటన జరిగిన క్రమంలో ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చుకోకపోవడంతో ప్రైవేట్లో రూ.40వేలు అప్పు చేసి ట్రీట్మెంట్కు ఖర్చు చేశారని హరీశ్రావు ఆవేదన వ్యక్తంచేశారు. చివరకు నిమ్స్కు వస్తే ఇక్కడ కూడా ప్రభుత్వ డాక్టర్లు మందులు బయట కొనుక్కోమని చెప్పడం ప్రభుత్వ అమానవీయ తీరుకు నిదర్శనమన్నారు. బయట మందుల షాపుల్లో బాలాజీ మెడికల్ స్టోర్ పేరిట రూ.3,900, రూ.2,350, రూ.730లతో డాక్టర్లు రాయించిన మందుల బిల్లులే ఇందుకు సాక్ష్యమన్నారు. బాధిత కుటుంబానికి ఎక్కడెక్కడి నుంచో దాతలు ఫోన్పే ద్వారా పంపిన డబ్బులతో ఆ పేద కుటుంబం వేలాది రూపాయల బిల్లులు పెట్టి మందులు కొనుక్కుంటుందన్నారు.
హైదరాబాద్, జూన్ 11 (నమస్తేతెలంగాణ): ఖమ్మంలో బాలికపై లైంగికదాడికి యత్నం, హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడిపై ఫాస్ట్ట్రాక్ కోర్టులో విచారణ జరుపాలని ఎమ్మెల్సీ, మండలి విప్ దేశపతి శ్రీనివాస్ గురువారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. నిందితుడికి అత్యంత కఠినంగా శిక్షపడేలా వేగంగా విచారించాలని కోరారు. మహ్మద్ గౌస్పాషా అనే దుండగుడి దుశ్చర్య అత్యంత హేయమని పేర్కొన్నారు. మనిషి రూపంలో ఉన్న ఇలాంటి క్రూరమృగాన్ని సభ్యసమాజం క్షమించదని స్పష్టంచేశారు. దవాఖానలో చేరిన బాధితురాలికి ప్రభుత్వ ఖర్చులతో కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. నేరగాళ్లకు వణుకు పుట్టేలా చట్టం కదలాలని, బాధితురాలి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలువాలని కోరారు.
మహబుబాబాద్, జూన్ 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువైందని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఆరోపించారు. గురువారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పదేపదే కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని చెప్తుతున్నారని, కోటీశ్వరులను చేయడం కాదు.. ముందు వారికి సరైన రక్షణ కల్పించాలని డిమాండ్చేశారు. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మహిళలపై దాడులు, అఘాయిత్యాలు రోజురోజుకూ పెరిగి పోతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. అంగన్వాడీ సిబ్బంది వేతనాలురాక ఆకలితో అలమటిస్తున్నారని వాపోయారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ పా ర్టీ పూర్తిగా విఫలమైందని, మహిళలు, యువతులకు ఇస్తామన్న రూ.2,500, స్కూటీలు, తులం బంగారం ఎమయ్యాయని ప్రశ్నించారు. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణకు తెలంగాణ కాంగ్రెస్ నాయకులే కారణమని ఆ రోపించారు. ఇప్పటికైనా మహిళల రక్షణకు ప్రాధాన్యమివ్వాలని కోరారు.
హైదరాబాద్, జూన్ 11 (నమస్తేతెలంగాణ): ఖమ్మం జిల్లాలో మైనర్ బాలికపై లైంగికదాడికి యత్నించి, హత్యాయత్నానికి పాల్పడిన మహ్మద్ గౌస్పాషా అనే కామాంధుడిని కఠినంగా శిక్షించాలని, బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ గురువారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. తక్షణమే ఫాస్ట్ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి విచారణ జరుపాలని డిమాండ్ చేశారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్, జూ న్ 11 (నమస్తే తెలంగాణ): ఖమ్మంలో బాలికపై దారుణానికి ఒడిగట్టిన గౌస్ను చట్టపరంగా కఠినంగా శిక్షించాలని కల్లుగీత కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్గౌడ్ డిమాండ్ చేశారు. బాధితురాలికి అండగా నిలువాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నదని గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దవాఖానలో చికిత్స పొందుతున్న బాలికకు మెరుగైన చికిత్స అందించాలని కోరారు.
బాలికపై అత్యాచారం చేసి, హత్య చేసేందుకు యత్నించిన కేసులో నిందితుడు గౌస్ను కఠినంగా శిక్షించాలని బీఆర్ఎస్ రాష్ట్ర నేత గోసుల శ్రీనివాస్ పేర్కొన్నారు. సభ్యసమాజం తలదించుకునేవిధంగా ఉన్న ఇలాంటి ఘటనలు పునరావృతంకాకుండా చూడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.