Kasi Majili Kathalu Episode 32 ( కాశీ మజిలీ కథలు ) | జరిగిన కథ : మాళవరాజ్యం శత్రువుల వశమైంది. రాజైన ధర్మపాలుని ఇద్దరు కుమారుల్లో పెద్దవాడు అదృష్టదీపుడు. గొల్లవారి వద్ద పెరిగినా, తన తెలివితేటలతో భారతావనిలోనే గొప్ప చక్రవర్తిగా పేరు గడించాడు. తన సోదరుణ్ని, తల్లిదండ్రులను కలుసుకునే క్రమంలో.. విదర్భ యువరాణిని గాంధర్వ వివాహం చేసుకున్నాడు. ఆ తరువాత పుష్పగిరిలో ఒక బ్రాహ్మణుని కలిశాడు.
“అయ్యా! మాది కౌశాంబి. నేను మాళవ ప్రభువైన ధర్మపాలుని పురోహితుణ్ని. నేటికి సరిగ్గా పద్దెనిమిదేళ్ల కింద మా రాజ్యం శత్రువుల పరమైంది. మా రాజుగారు అప్పటినుంచి బందీగానే ఉన్నారు. మేమంతా పరదేశీయుల పాలనలో నానా అగచాట్లూ పడుతున్నాం. మీరు అచ్చంగా మా రాజుగారి పోలికలోనే ఉన్నారు. మీరెవరో తెలుసుకోవచ్చా?” అని ప్రశ్నించాడు బ్రాహ్మణుడు.
అదృష్టదీపుడికి తానెవరో చక్కగా బోధపడింది. కానీ, ఆ విషయాన్ని బ్రాహ్మణుడితో పంచుకోలేదు. మాళవదేశం గురించి, ధర్మపాలునికి జరిగిన అన్యాయం గురించి మరికొన్ని ప్రశ్నలడిగి తెలుసుకున్నాడు.
ఆ తరువాత బలభద్రుణ్ని దూరంగా తీసుకుపోయి..
“మిత్రమా! అంగడివీధిలో నావంటి వాణ్ని చూశానని చెప్పావు. ఆరోజు సన్యాసి చెప్పిన జోస్యం ప్రకారం నాకు తమ్ముడు, తల్లిదండ్రులు ఉన్నారట. ఇప్పుడీ బ్రాహ్మణుడేమో మాళవ రాజ్యాధిపతి నా తండ్రి కావచ్చని చెబుతున్నాడు. ఈ మూడూ కలిపి చూస్తే.. అవన్నీ నిజాలేనని అనిపిస్తున్నది. పద.. నువ్వు ఇందాక చూసిన కుర్రవాడెవరో కనుక్కుందాం” అంటూ ముందుకు నడిచాడు.
అంతకుముందు బండిమీద బందీగా రాజభటులు తీసుకువెళ్లిన కుర్రవాని పేరు హరిదత్తుడని తెలిసింది. పుష్పగిరి ప్రభువైన రాజవాహనుడి కుమార్తె ప్రియంవద అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పలేక పోయినందువల్ల అతనికి ఉరిశిక్ష పడింది.
“ఎలాగైనా అతణ్ని రక్షించాలి. నేనిప్పుడే పోయి రాకుమారి ప్రశ్నలకు సమాధానం చెబుతానని మాటిచ్చి, అతణ్ని విడిపిస్తాను”.. అన్నాడు అదృష్టదీపుడు.
“మిత్రమా! తొందరపడకు. ఆ రాకుమారి అడిగే ప్రశ్నలేమిటో తెలియకుండా ముందుగానే సవాలు స్వీకరించడం ప్రమాదం” చెప్పాడు బలభద్రుడు.
“నాకేమీ పరవాలేదు. ఎలాగైనా అతను బతికితే చాలు. మిత్రగుప్తుడనేవాడు రాకుమారి ప్రశ్నలకు సమాధానం చెబుతాడని, రాజుగారితో మాట్లాడేంత వరకూ ఉరిశిక్షను ఆపమని భటులతో చెప్పు. సమయం లేదు. పదపద” అంటూ.. మిత్రుణ్ని వధ్యశాలకు పంపాడు అదృష్టదీపుడు.
తాను నేరుగా రాజాస్థానానికి వెళ్లాడు. రాజవాహనునికి నమస్కరించి..
“అయ్యా! మాది కాశీపురం. నా పేరు మిత్రగుప్తుడు. నేను మీ కూతురు వేసిన ప్రశ్నలకు నెల రోజుల లోపుగా సమాధానాలు ఇస్తాను. కానీ, నాకోసం కాదు.. మీరు ఉరిశిక్ష వేసిన హరిదత్తుని కోసం ఆ సమాధానాలు చెప్పబోతున్నాను. దయచేసి శిక్ష రద్దు చేయండి. నేను జవాబులు ఇవ్వ లేకపోతే అతని బదులుగా నన్నే ఉరి తీయించవచ్చు” అన్నాడు అదృష్టదీపుడు.
అంతా విన్న రాజవాహనుడు విచారం వ్యక్తం చేశాడు.
“ఇప్పటికే హరిదత్తుని విషయంలోనే ప్రజలు నన్ను నానారకాలుగా నిందిస్తున్నారు. అయినా మా అమ్మాయి చేపట్టిన వ్రతం ప్రకారం సమాధానం చెబుతానని ముందుకువచ్చి, చెప్పలేకపోతే ఉరి తీయకతప్పదు. ఏది ఏమైనా నీకోసం అతని శిక్షను ఆపగలను. కానీ, విడుదల చేయలేను. నువ్వు సమాధానం చెప్పలేకపోతే నిన్ను, అతణ్ని కూడా శిక్షించాల్సి వస్తుంది” అని హెచ్చరించాడు.
దానికి అదృష్టదీపుడు అంగీకరించాడు. హరిదత్తునికి శిక్ష నిలిపేయాల్సిందిగా మహారాజు ఆజ్ఞాపత్రిక రాసిచ్చాడు. ఆ తరువాత..
“మహారాజా! మీ కుమార్తె అడగాలనుకున్న ప్రశ్నలేంటో తెలుసుకోవచ్చా?” అని అడిగాడు అదృష్టదీపుడు.
అప్పుడు రాజవాహనుడు ఆ ప్రశ్నల పత్రికను తెప్పించాడు. అందులో కొన్ని ప్రశ్నలు పద్యరూపంలో ఉన్నాయి. ఆ పద్యాల సారాంశమేమిటంటే..
‘భువనేశ్వరీ దేవికి ఎన్ని ముఖాలున్నాయి? ఆయా ముఖాలు ఏయే రంగుల్లో ఉంటాయి? ఆమె ఆలయం ఎక్కడుంది? ఆ ఆలయంలో కనిపించే లిపి ఏమిటి?.. ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినవారిని రాకుమార్తె ప్రాణాధీశునిగా వరించాలి. చెప్పలేని వారికి మరణశిక్ష విధించాలి. ఇది భువనేశ్వరీ మాత ఆజ్ఞ’..
ఆ పత్రికను ఒకటికి రెండుసార్లు చదివి, తిరిగి మహారాజుకు ఇచ్చేశాడు అదృష్టదీపుడు. రాజాస్థానంనుంచి బయటపడి మిత్రుడు బలభద్రుణ్ని కలుసుకున్నాడు. అతనికి ఆ ప్రశ్నలు వివరించి చెప్పాడు.
“ఏమిటీ తలాతోకా లేని ప్రశ్నలు? ఆమె ఎక్కడో చూసిన భువనేశ్వరి ఆలయం మనకెలా తెలుస్తుంది? అందుకే తొందరవద్దని నేను ముందుగానే హెచ్చరించాను. నువ్వే వినలేదు. ఈ ప్రశ్నలకు ఎవడూ సమాధానం చెప్పలేడు. ఇప్పటికే ఎంతోమంది చెప్పలేక మరణించారని చెప్పుకొంటున్నారు. మిత్రమా! నువ్వు ఏమైపోతావోనని నాకు బెంగగా ఉంది” అన్నాడు బలభద్రుడు.
“మరేమీ పరవాలేదు. నాకింకా నెలరోజుల ఆయుర్దాయం ఉంది. అప్పటిలోగా మనం ఎలాగైనా ఆ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలి. అందుకోసం ప్రియంవదను రహస్యంగా అనుసరించాలి. నువ్వొక పనిచెయ్యి. ప్రియంవద పరిచారికలలో ఎవరితోనైనా ఎలాగో ఒకలా స్నేహం చేసుకో. ఆమె ద్వారా ప్రియంవద తరచుగా ఎక్కడెక్కడికి వెళ్తుందో, ఆమె అభిరుచులు ఎలాంటివో తెలుసుకో. వాటిని బట్టి మనకేమైనా ఆధారాలు దొరకవచ్చు” అని చెప్పాడు అదృష్టదీపుడు.
అతను చెప్పినట్లుగానే ప్రియంవద చెలికత్తె అయిన కలహంసికతో పరిచయం పెంచుకున్నాడు బలభద్రుడు. ఆమె ద్వారా.. ప్రియంవద ప్రతి శుక్రవారం కేళీశైలానికి వెళ్తుందని తెలుసుకున్నాడు. ఎవరి కంటా పడకుండా ఆమెను అనుసరించి, అదృష్టదీపుడు కూడా పుష్పగిరి పట్టణానికి ఉత్తరదిక్కున ఉన్న కేళీశైలానికి వెళ్లాడు. ప్రియంవదతోపాటు అక్కడ పదిమంది పరిచారికలు ఉన్నారు. వారందరూ ఆ కొండకింది వరకూ ఆమెతో కలిసే వచ్చారు. కానీ, ఆ శిఖరంపైకి మాత్రం ప్రియంవద ఒంటరిగా వెళ్లింది.
ఆమె పైకి వెళ్లడం చూసి, అదృష్టదీపుడు వేరే దిక్కునుంచి కొండ కొమ్ముపైకి వెళ్లి చూశాడు. అక్కడ ప్రియంవద కనిపించలేదు. ఎలా మాయమైందో అర్థంకాక అదృష్టదీపుడు తబ్బిబ్బు పడ్డాడు. తిరిగి కొండపాదం వద్ద ఉన్న పరిచారికల దగ్గరికి వచ్చాడు. అప్పటికి ప్రియంవద కొండపైనుంచి దిగివచ్చింది. ఆమె చేతిలో దేవీపూజ చేసిన పళ్లెం ఉంది. పరిచారికలు ఆ పళ్లేన్ని అందుకున్నారు. ఆ తరువాత వాళ్లందరూ పల్లకి ఎక్కి అక్కడినుంచి వెళ్లిపోయారు.
అదృష్టదీపుడు మాత్రం అక్కడే ఉండిపోయాడు.
‘కొండపైనే భువనేశ్వరీదేవి ఆలయం ఉండి ఉండాలి. ఎక్కడుందో కనిపెట్టాలి!’ అనుకుంటూ అదృష్టదీపుడు మళ్లీ కొండపైకి వెళ్లాడు. సుమారుగా 6 కిలోమీటర్ల చుట్టుకొలతతో, సమచతురస్రంగా, ఎక్కడానికి అనువుగా ఉన్నది ఆ కొండ. అక్కడంతా తుప్పలే కానీ, దట్టమైన అడవి లేదు. ఎంతగా వెతికినా ఏమీ కనిపించలేదు.
చివరికి విరక్తి కలిగి కొండదిగి పట్టణంలోకి వెళ్లిపోయాడు. బలభద్రునితో అనేకరకాల ప్రశ్నలు అడిగించి, కలహంసిక నుంచి సమాధానాలు రాబట్టాడు. ఆమె మాటల్ని బట్టి.. ఆ కొండపైనే కీలకమైంది ఉన్నదని అదృష్టదీపునికి అర్థమైంది. కానీ, ఎంత వెతికినా ప్రయోజనం లేకుండా ఉంది. పట్టుదలగా ప్రతిరోజూ వెళ్తూ.. అణువణువూ, ప్రతి పొదా గాలించసాగాడు. ఆ వెతుకులాటలోనే వారంరోజులు గడిచిపోయాయి. మళ్లీ శుక్రవారంనాడు ప్రియంవద కొండకు రానేవచ్చింది. అదృష్టదీపుడు ఆమెకు తెలియకుండా మరోసారి నీడలా అనుసరించాడు. చేతిలో పూజాద్రవ్యాలున్న పళ్లెంతో కొండ ఎక్కుతున్న ప్రియంవద.. ఉన్నట్లుండి ఒకచోట గాలిలో గాలిలా కలిసిపోయింది. తాను చూస్తున్నది కలనో.. వైష్ణవమాయనో.. అదృష్టదీపునికి అర్థం కాలేదు. ప్రియంవద మాయమైనచోట గాలిలో చేతులతో కలయదిప్పి చూశాడు. అక్కడ మనుషుల తాలూకు స్పర్శ ఏమీ లేదు. కొండమీద అవే పాత తుప్పలు తప్ప, వెలుగునీడల్లో మార్పులు లేవు.
జరిగిన దానికి విస్తుపోతూ చాలాసేపు ఒక పొదనీడలో కూర్చున్నాడు. చూస్తుండగానే ప్రియంవద ఎలా వెళ్లిందో.. అలాగే తిరిగి వచ్చింది. భూమ్యాకాశాల మధ్య ఏ ఆలంబన లేకుండా దేవతాస్త్రీ మాదిరిగా స్వేచ్ఛగా కొండ దిగివెళ్లడం ప్రారంభించింది.
‘ఈ రహస్యం ఏమిటో ఛేదించిగానీ ఊళ్లోకి వెళ్లకూడదు’ అని గట్టిగా తీర్మానించుకున్నాడు అదృష్టదీపుడు. చీకటిపడినా కొండ దిగకుండా గాలింపు కొనసాగించాడు. ఫలితం ఏమీ కనిపించలేదు.
పొద్దుపోయిన తరువాత ఒకచోట ఉత్తరీయం పరుచుకుని, నిద్రకు ఉపక్రమించాడు. వెల్లకిలా పడుకుని, కండ్లు తెరిచి చూసేసరికి అల్లంత దూరాన జిగేల్మంటూ వెలుగులు విరజిమ్ముతున్న ఒక దివ్యదేవాలయం దర్శనమిచ్చింది. ‘ఏమిటీ వింత?’ అనుకుని, ఆశ్చర్యంతోలేచి కూర్చునేసరికి వెలుగులు లేవు.. ఆలయమూ లేదు.
‘వట్టి భ్రాంతి కాబోలు!’ అనుకుని మేను వాల్చేసరికి.. మళ్లీ ఆ దేవాలయం దర్శనమిచ్చింది. అలా మరో రెండుసార్లు అదేరకంగా పరీక్షించిన తరువాత.. కీలకం అంతా తన ఉత్తరీయం కిందనున్న గడ్డిమొక్కల్లో ఉన్నదని అర్థం చేసుకున్నాడు. ఉత్తరీయాన్ని జరుపుతూ దానికింద ఉన్న ఒక్కో మొక్కనూ తడిమి చూడటం మొదలుపెట్టాడు. కేవలం ఒక మొక్కను పట్టుకున్నప్పుడు మాత్రమే ఆ ఆలయం దర్శనమిస్తున్నదని గ్రహించాడు. తన మొలలో ఉన్న బాకును తీసి, ఆ మొక్కను మొదలంటా కోసి చేతిలో పట్టుకున్నాడు. ఆ సమయంలో అతని కుడికన్ను, కుడిభుజం, కుడితొడ అదరసాగాయి. ఆ శుభసూచకాలను కనిపెట్టి, సంతోషంతో తనముందు కనిపిస్తున్న ఆలయంలోకి ప్రవేశించాడు. రత్నకాంతులతో ధగధగలాడుతున్న ఆలయ ద్వారానికి రెండువైపులా ద్వారపాలకుల విగ్రహాలున్నాయి. అతను ఆ విగ్రహాలను చూసి, నిజమైన స్త్రీలేమోనని భ్రమపడ్డాడు. కాదని తెలుసుకుని, చుట్టూ పరికిస్తూ లోపల అడుగుపెట్టాడు.
మణిస్తంభాలతో ప్రకాశిస్తున్న ఆ మందిరాన్ని చూడగానే దిగ్భ్రమ కలిగింది. అందులో అనేక గదులు ఉన్నాయి. అవన్నీ రత్నాలు పొదిగిన తలుపులతో మూసి ఉన్నాయి. వాటిలోని వింతలు కనిపెట్టాలని సాహసంతో ఒక తలుపు తెరిచి చూశాడు. ఒక్కసారిగా కండ్లు మిరుమిట్లు గొలిపాయి. పెద్ద ఉసిరికాయలంత వజ్రాలు గుట్టలు పోసి ఉన్నాయి. దోసెడు వజ్రాలు తీసి ఉత్తరీయంలో మూటగట్టుకున్నాడు. మరోగది తలుపు తీసేసరికి వైడూర్యాలు కనిపించాయి. ఇక వరుసగా ప్రతిగదిలో రత్నాలు, బంగారు నాణేలు.. ఇలా వరుసగా నవనిధులూ అతనికి దొరికాయి. ఆ విశేషాలన్నీ చూసుకుంటూ మందిరంలో తిరుగుతుండగా.. ఒక మూలన మెట్లు కనిపించాయి. వాటిని అనుసరించి పైకి వెళ్లాడు. మామూలు కండ్లు చూడలేనంత గొప్ప వెలుగు తప్ప అక్కడేమీ లేదు. కొంతసేపు కండ్లు మూసుకుని, నిదానంగా తెరిచేసరికి.. వెలుగంతా పోయి, తేటతెల్లంగా కనిపించ సాగింది.
అక్కడి గోడలలో రత్నాలు పొదిగి ఉన్నాయి. నేలపై రత్నకంబళి పరిచి ఉంది. దూరంగా ఒక బంగారు శక్తి విగ్రహం కనిపించింది. రెండుచేతులు, మూడుతలలు గల ఆ శక్తి విగ్రహం భయం గొలిపేలా ఉంది.
పెరుగుతున్న గుండెవేగాన్ని ఎలాగో అణుచుకుంటూ ఆ విగ్రహాన్ని పరీక్షించి చూడగా, దాని వెనుక మళ్లీ మెట్ల మార్గం కనిపించింది. ఆ మెట్లెక్కి పైకి వెళ్లగా దేవీ సన్నిధానం గోచరించింది.
ఐదు వర్ణాలు కలిగిన ఐదు ముఖాలతోనూ, పది చేతులతోనూ.. అఖిల భువనాలనూ కాచి రక్షించగల తేజస్సుతోనూ ఒప్పుతున్న ఆ మహాదేవీ పీఠంపైన.. ‘భువనేశ్వరీ మాత’ అని రాసి ఉంది. ఆమె వెనుకగోడ మీద..
‘ఎవరికీ చేజిక్కని ఔషధ తీగను చేతపట్టుకుని ఎవడు ఈ ఆలయ ప్రవేశం చేస్తాడో.. అతనే ఇక్కడున్న నిధులన్నిటికీ అధికారి అవుతాడు. నా ప్రియభక్తురాలైన ప్రియంవదకు భర్త అవుతాడు’ అని అర్థం వచ్చే పద్యం రాసి ఉంది.
దానిని చూసి..
‘అయ్యయ్యో! నేను ఈ కష్టాలన్నీ పడింది హరిదత్తుని కోసమే కానీ, నాకోసం కాదు కదా! అతను వలచిన ప్రియంవదను నేనెలా చేపట్టగలను?! సరే! ముందు అతని ప్రాణాలు రక్షించగలిగితే.. ఆ పై సంగతి తరువాత ఆలోచించుకోవచ్చు’ అనుకున్నాడు అదృష్టదీపుడు.
ముందుగా భువనేశ్వరీదేవిని అర్చించాలనే సంకల్పంతో తాను తెచ్చిన ఔషధ తీగను పరాకుగా కిందపెట్టి, ఆమె ఎదుట సాష్టాంగ నమస్కారం చేశాడు. కొంతసేపు భక్తిపూర్వకంగా ధ్యానం చేసి, కండ్లు తెరిచి చూసేసరికి అక్కడ దేవీ ఆలయం లేదు. పచ్చికలు, తుప్పలు, శిలలు తప్ప.. మరేమీ లేవు.
(వచ్చేవారం.. భువనేశ్వరీ మాత)
– అనుసృజన
నేతి సూర్యనారాయణ శర్మ
Kasi Majili Kathalu ( కాశీ మజిలీ కథలు ) | అదృష్టదీపుడు – 2
Kasi Majili Kathalu ( కాశీ మజిలీ కథలు ) | అదృష్టదీపుడు
Kasi Majili Kathalu ( కాశీ మజిలీ కథలు ) | పాటపాడే చెట్టు
Kasi Majili Kathalu ( కాశీ మజిలీ కథలు ) | స్వర్గంలో మానవుడు
Kasi Majili Kathalu ( కాశీ మజిలీ కథలు ) | ఎగిరే చెట్లు
Kasi Majili Kathalu ( కాశీ మజిలీ కథలు ) |కాశీ మజిలీ కథలు : దొంగల తప్పిదం
Kasi Majili Kathalu ( కాశీ మజిలీ కథలు ) |రహస్య స్నేహితుడు