Suriya 50 | కోలీవుడ్ వర్గాల్లో ఇప్పుడు ఒక ఆసక్తికరమైన వార్త హల్చల్ చేస్తోంది. వైవిధ్యభరితమైన పాత్రలతో దేశవ్యాప్తంగా భారీ క్రేజ్ సంపాదించుకున్న స్టార్ హీరో సూర్య ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా గడుపుతున్నారు. ఇటీవలే ‘కరుప్పు’ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా, తన నటనతో విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకుని మంచి జోష్లో ఉన్నారు సూర్య. ఈ ఉత్సాహంతోనే ఆయన తన తదుపరి చిత్రాలను శరవేగంగా పూర్తి చేసే పనిలో పడ్డారు. ప్రస్తుతం ఆయన టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో తన 46వ చిత్రమైన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ షూటింగ్ను ముగించుకుని, విడుదలకు సిద్ధం చేస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని ఈ ఏడాది ఆగస్టు 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్గా రిలీజ్ చేసేందుకు చిత్రబృందం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
అయితే ఈ సినిమా విడుదలైన వెంటనే సూర్య ఏమాత్రం గ్యాప్ తీసుకోకుండా తన 47వ ప్రాజెక్టును పట్టాలెక్కించబోతున్నాడు. క్రేజీ డైరెక్టర్ జీతూ మాధవన్ దర్శకత్వంలో ‘సూర్య 47’ సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రంతో పాటు సూర్య ఫ్యూచర్ లైనప్లో టాలెంటెడ్ డైరెక్టర్లు పా రంజిత్, టి.జె.జ్ఞానవేల్ వంటి ప్రముఖ దర్శకులు కూడా లైన్లో ఉన్నారు. వీరితో చేయబోయే సినిమాలు కూడా విభిన్నమైన జోనర్లలో ఉండబోతున్నాయని సమాచారం.
అయితే వీటన్నింటికంటే ముఖ్యంగా ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో సూర్య కెరీర్కు సంబంధించిన ఒక ల్యాండ్మార్క్ మూవీ గురించిన చర్చ చాలా బలంగా నడుస్తోంది. సూర్య సినీ ప్రస్థానంలో ఎంతో ప్రతిష్టాత్మకమైన, మైల్స్టోన్ లాంటి 50వ చిత్రాన్ని (Suriya 50) టాలీవుడ్ టాప్ కమర్షియల్ మాస్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కించబోతున్నారనే టాక్ ఫిలిం నగర్ సర్కిల్స్లో జోరుగా వినిపిస్తోంది. అనిల్ రావిపూడి చెప్పిన ఒక వినూత్నమైన కమర్షియల్ లైన్ సూర్యకు విపరీతంగా నచ్చిందని, అందుకనే ఈ మైల్స్టోన్ ప్రాజెక్ట్ను ఆయనకు అప్పగించే ఆలోచనలో సూర్య ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రేజీ కాంబినేషన్కు సంబంధించిన చర్చలు ఇప్పటికే ముగింపు దశకు చేరుకున్నాయని, అన్ని కుదిరితే త్వరలోనే ఈ ల్యాండ్మార్క్ ప్రాజెక్ట్కు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.