India | శ్రీలంకతో టెస్టు సిరీస్కు సిద్ధమవుతున్న టీమిండియాకు ఊహించని సమస్య ఎదురైంది. ఆగస్టు 15 నుంచి రెండు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుండగా.. జట్టులోని కీలక ఆటగాళ్లను గాయాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే పలువురు స్టార్ క్రికెటర్లు సిరీస్కు దూరం కాగా.. తాజాగా కెప్టెన్ శుభ్మన్ గిల్ కూడా గాయంతో వార్మప్ మ్యాచ్కు దూరమవడం ఆందోళన కలిగిస్తోంది. శ్రీలంక క్రికెట్ XIతో జరుగుతున్న మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్లో గిల్ బరిలోకి దిగాల్సి ఉంది. అయితే వేలికి స్వల్ప గాయం కావడంతో అతడిని మ్యాచ్కు దూరంగా ఉంచారు. అయితే గిల్ గాయం తీవ్రతపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని టీమ్ మేనేజ్మెంట్ తెలిపింది. శ్రీలంకతో తొలి టెస్టు సమయానికి అతడు అందుబాటులో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అయితే గిల్ విషయం పక్కన పెడితే.. టీమిండియా గాయాల జాబితా మాత్రం భారీగానే ఉంది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఈ సిరీస్లో ఆడటం లేదు. అతడితో పాటు హర్షిత్ రాణా, నితీశ్ కుమార్ రెడ్డి కూడా శ్రీలంక పర్యటనకు దూరమయ్యారు. మరోవైపు వాషింగ్టన్ సుందర్ పరిస్థితిపై ఇంకా స్పష్టత లేదు. సాయి సుదర్శన్ కూడా ఫిట్నెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంది. ఇక బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో ప్రస్తుతం ఏకంగా 13 మంది ఆటగాళ్లు గాయాల నుంచి కోలుకునే పనిలో ఉన్నారు. వీరిలో బుమ్రా, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, సాయి సుదర్శన్, నితీశ్ కుమార్ రెడ్డి, రియాన్ పరాగ్ వంటి టీమిండియాకు ఉపయోగపడే ఆటగాళ్లు ఉండటం గమనార్హం.బుమ్రా ఎడమ మోకాలి సమస్యతో రిహాబిలిటేషన్ తీసుకుంటున్నాడు. వైద్య బృందం పర్యవేక్షణలో అతడి రికవరీ కొనసాగుతోంది.
ప్రస్తుతానికి అతడిపై బౌలింగ్ భారం పెంచకుండా ఫిట్నెస్ను దశలవారీగా మెరుగుపరిచే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. బుమ్రా తిరిగి బౌలింగ్ ఎప్పుడు మొదలుపెడతాడన్న దానిపై మాత్రం ఇంకా ఎలాంటి ఖచ్చితమైన సమాచారం లేదు. హార్దిక్ పాండ్యా తొడ కండరాల గాయంతో, వాషింగ్టన్ సుందర్ హ్యామ్స్ట్రింగ్ సమస్యతో చికిత్స పొందుతున్నారు. సాయి సుదర్శన్ పాదంలో స్ట్రెస్ రియాక్షన్కు గురయ్యాడు. రియాన్ పరాగ్ భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న తర్వాత రిహాబ్లో ఉన్నాడు. హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి కూడా హ్యామ్స్ట్రింగ్ గాయాలతో కోలుకుంటున్నారు.ఇక యువ ఆటగాళ్లు యుద్వీర్ సింగ్ చరక్, హిమాన్షు సింగ్, సుయశ్ శర్మ కూడా గాయాల కారణంగా రిహాబిలిటేషన్ తీసుకుంటున్నారు. ఆకాశ్దీప్ వెన్ను కింది భాగంలో స్ట్రెస్ ఫ్రాక్చర్తో బాధపడుతుండగా.. అశోక్ శర్మ వెన్ను, పక్కటెముక గాయాలతో చికిత్స పొందుతున్నాడు.ఇలా ఒకేసారి ఇంతమంది ఆటగాళ్లు గాయపడటం టీమిండియా మేనేజ్మెంట్కు తలనొప్పిగా మారింది. ముఖ్యంగా టెస్టు క్రికెట్లో ఆటగాళ్ల ఫిట్నెస్ అత్యంత కీలకం కావడంతో.. తొందరపడి ఎవరినీ మైదానంలోకి దింపకూడదనే నిర్ణయానికి బీసీసీఐ వచ్చినట్లు తెలుస్తోంది.