TMC Rebel MPs : 17 మంది టీఎంసీ రెబల్ ఎంపీలు బీజేపీలో చేరబోతున్నారు. ఈ విషయాన్ని టీఎంసీ రెబల్ ఎంపీ, ప్రస్తుత ఎన్సీపీఐ పార్టీ ఎంపీ జగదీష్ చంద్ర బర్మ బసునియా వెల్లడించారు. మమతా బెనర్జీ స్థాపించిన టీఎంసీ నుంచి గెలిచి, ఎన్సీపీఐలో చేరిన ఎంపీల్లో జగదీష్ చంద్ర ఒకరు. సోమవారం జగదీష్ చంద్ర మీడియాతో మాట్లాడారు. వచ్చే దుర్గా పూజ లోపు 17 మంది టీఎంసీ రెబల్ ఎంపీలు, ప్రస్తుత ఎన్సీపీఐ ఎంపీలు బీజేపీలో చేరుతారని ఆయన వెల్లడించారు.
అయితే, ముగ్గురు మైనారిటీలు మాత్రం బీజేపీలో చేరడం లేదని తెలిపారు. ఎన్సీపీఐ ఎంపీలు అబూ తాహెర్, ఖలిలుర్ రహమాన్లు వేరే విభాగంగా ఉంటారని, అయితే, బీజేపీ, ఎన్డీయేకు మద్దతుగా ఉంటారని జగదీష్ చంద్ర అన్నారు. మైనారిటీ ఎంపీలు ఉన్న నియోజకవర్గాల్లో మైనారిటీల జనాభా ఎక్కువగా ఉందని, అందువల్ల వారు నేరుగా బీజేపీలో చేరకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. దీనివల్ల వారికి రాజకీయంగా ఇబ్బందులొచ్చే అవకాశం ఉందన్నారు. ఎన్సీపీలో చేరే విషయంలో బీజేపీ మద్దతు తమకు ఉందని, అయితే ఎంపీలు బీజేపీలో చేరాలనుకుంటున్నారని చెప్పారు.
అన్నీ అనుకున్నట్లు జరిగితే 20 మంది టీఎంసీ రెబల్ ఎంపీల్లో 17 మంది బీజేపీలో చేరడం ఖాయం అని జగదీష్ అన్నారు. అతడు పార్టీకి తిరుగుబాటు చేసిన నేపథ్యంలో భారీ భద్రత మధ్య ఆదివారం సొంత నియోజకవర్గమైన కూచ్ బెహర్ చేరుకున్నారు. ఇదే సమయంలో కొందరు బీజేపీ కార్యకర్తలు అక్కడి టీఎంసీ కార్యాలయంపై దాడి చేసి, ధ్వంసం చేశారు. కొంతమంది బీజేపీ నేతలు ఆయన ఇంటిముందు నిరసన తెలిపారు. జగదీష్ పర్యటన నేపథ్యంలో అక్కడ స్వల్ప ఉద్రిక్తత, రాజకీయ ఘర్షణ తలెత్తింది.