Country-made bombs | ఏపీలోని చిత్తూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. అర్దరాత్రి నాటు బాంబులు వేసి ఫాంహౌస్లో దోపిడీకి ప్రయత్నించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. చిత్రూరు గ్రామీణ మండలం మంగాపురానికి చెందిన పట్టాభి నాయుడు అమెరికాలో స్థిరపడ్డాడు. ఆయన స్వగ్రామంలో ఉన్న మామిడి తోటలో ఫాంహౌస్ నిర్మించుకున్నాడు. దానిని తన చెల్లి విజయ, బావ వెంటకేష్ నాయుడు చూస్తున్నారు. కాగా, అర్ధరాత్రి ఫాంహౌస్లోకి చొరబడిన దుండగులు రెండు కుక్కలకు మత్తు మందు ఇచ్చి చోరీకి ప్రయత్నించారు.
ఈ క్రమంలో వాచ్మెన్ ఆనందరావు(52) అడ్డుకోవడంతో గొంతుకోసి హతమార్చారు. అనంతరం కిటికీపై నాటు బాంబులు వేశారు. భయపడిపోయిన విజయ దంపతులు గట్టిగా అరవడంతో దుండగులు పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.