BRICS Summit : బ్రిక్స్ కూటమి ఎవరికీ వ్యతిరేకం కాదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న బ్రిక్స్ సదస్సు ప్రారంభం సందర్భంగా మోదీ మాట్లాడారు. బ్రిక్స్ సదస్సు ఎవరికీ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. బ్రిక్స్ కూటమి విషయంలో యూరప్ దేశాలకు ఉన్న సందేహాలపై మోదీ ఈ విధంగా సమాధానమిచ్చారు. గ్లోబల్ సౌత్ (దక్షిణ ప్రాంతపు దేశాలు) రూల్స్ రూపొందించే శక్తిగా ఎదగాలి.
ఐక్యరాజ్యసమితిలోనూ సవరణలు అవసరం. అన్ని దేశాలకు భాగస్వామ్యం కావాలి. అన్ని దేశాలు తమ గొంతుక వినిపించాలి. బ్రిక్స్ను బలోపేతం చేస్తూనే ప్రపంచస్థాయి సంస్కరణల కోసం ఒక మార్గాన్ని రూపొందించాలి. ప్రస్తుతం ఉన్న ప్రపంచ వ్యవస్థ ఒక పిరమిడ్లాగా ఉంది. అధికారం, బలం, ఆదిపత్యం, నిర్ణయాలు తీసుకునేవన్నీ పైన ఉండే దేశాలు. కింద ఉండే దేశాలు వీటివల్ల ప్రభావితం అవుతున్నాయి. అవి తమను తాము సొంతంగా నిర్మించుకోలేక పోతున్నాయి. ఐక్యరాజ్యసమితిలో సంస్కరణలు తీసుకురావడాన్ని ఆలస్యం చేయకూడదు. ఈ విషయంలో చర్చలకు నిర్ణీత కాలవ్యవధిని నిర్ణయించుకోవాలి.
ఓటు హక్కు, నాయకత్వ స్థాయిలు, పాలసీలు రూపొందించడం వంటివన్నీ నేటి ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా ఉండాలి అన్నారు. ఇదే సమయంలో ఇటీవలి కాలంలో నౌకలపై దాడులు జరుగుతూ, సముద్రంపై నావికులకు కలుగుతున్న ఇబ్బందుల్ని మోదీ ప్రస్తావించారు. సముద్ర మార్గాలు సురక్షితంగా ఉండాలని, నావికులను, సిబ్బందిని రక్షించుకునేందుకు అత్యవసర వ్యవస్థను రూపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రపంచ వాణిజ్యానికి ఇది ఎంతో అవసరం అన్నారు. ఐరాసలో అనేక దేశాలకు శాశ్వత సభ్యత్వం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.